పెద్దపల్లి, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): మంథనివాసుల దశబ్దాల దారిద్య్రాన్ని దూరం చేసేందుకు తెలంగాణ సర్కారు కంకణం కట్టుకున్నది. భారీగా నిధులు మంజూరు చేసి అభివృద్ధిని పరుగులు పెట్టించింది. మహదేవపూర్, పల్మెల, మహాముత్తారం, కాటారం నాలుగు మండలాల అడవి బిడ్డల ఏండ్లనాటి కలను సాకారం చేస్తూ రూ.119 కోట్లతో 108 కిలో మీటర్ల రింగ్ రోడ్డు నిర్మించి కుగ్రామాలకు సైతం రవాణా సౌకర్యం కల్పించింది. రూ.కోటితో ముకునూర్-కనుకునూర్ రహదారి, రూ.2 కోట్లతో నీలంపల్లి బ్రిడ్జి, రూ.2.45 కోట్లతో బూరుగుగూడెం-దమ్మూరు రోడ్డు, రూ.4.80 కోట్లతో సర్వాయిపేట బ్రిడ్డి, రూ.1.18 కోట్లతో అంబట్పల్లి-రాపల్లికోట రోడ్డు, రూ.26 కోట్లతో కాళేశ్వరం-దామెరకుంటకు డబుల్లేన్ రోడ్డు, రూ. 5.25 కోట్లతో పంకెన తీగలవాగుపై వంతెన, రూ. 6.45 కోట్లతో పెద్దవాగుపై, రూ. 2.95 కోట్లతో లెంకలగడ్డలో వాగుపై బ్రిడ్జిలను నిర్మించింది. రూ.50 కోట్లతో ముత్తారం మండలం ఖమ్మంపల్లి బ్రిడ్జిని సైతం నిర్మించింది.
మరో రూ.50 కోట్లతో ముత్తారం మండలం ఓడెడ్ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ వంతెనల నిర్మాణంతో భూపాలపల్లి, హన్మకొండ, వరంగల్ జిల్లాలకు రవాణా సౌకర్యం చేరువైంది. రూ.60 కోట్లతో మంథని నుంచి అన్ని మండలాలకు డబుల్ రోడ్ల నిర్మించింది. రూ.11 కోట్లతో ముత్తారం నుంచి కాల్వశ్రీరాంపూర్ మండలం కూనారం రోడ్డు, రూ.14 కోట్లతో కేశనపల్లి నుంచి నాగెపల్లి రోడ్డు, రూ.2.22 కోట్లతో మైదంబండ నుంచి సర్వారం రోడ్డు నిర్మాణాలు చేపట్టారు.
రూ.5 కోట్లతో మంథని బొక్కలవాగుపై మరో వంతెనకు పూర్తి చేశారు. రూ.2.50 కోట్లతో మంథని-సూరయ్యపల్లి జలవంచ వాగుపై వంతెనను నిర్మించారు.రూ.2.40 కోట్లతో బట్టుపల్లి, ఖాన్సాయిపేట బ్రిడ్జి, రూ.60 లక్షలతో కాటారం మండలం భస్వాపూర్ కాజ్వే, రూ.18 కోట్లతో మంథని- రామగుండం రోడ్డు, రూ.28 కోట్లతో మంథని-పెద్దపల్లి రోడ్లను నిర్మించారు. రూ.5 కోట్లతో మల్హర్ మండలం చిన్నతూండ్ల-పెద్దతూండ్ల వంతెన, రూ.7 కోట్లతో పెద్దతూండ్ల-శాత్రావజ్పల్లి వంతెన అప్రోచ్ రోడ్డు పనులు పూర్తి చేశారు. ఇవే కాదు నియోజకవర్గ వ్యాప్తంగా వందల కోట్ల రూపాయల ప్రత్యేక ని ధులతో రోడ్డు, డబుల్ రోడ్ల నిర్మాణాలను చేపట్టి ప్రతీ గ్రామానికి రహదారిని నిర్మించారు.
మంథని బొక్కలవాగుపై మరో వంతెన నిర్మాణంతో మంథని కొత్త శోభ సంతరించుకున్నది. పుట్ట మధూకర్ ఇక్కడి ప్రజల రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకొని మరో వంతెనను నిర్మించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సర్కారు ఆర్డీఎఫ్(రూరల్ డెవలప్మెంట్) కింద 2016 జూలై నెలలో రూ.5 కోట్ల నిధులను విడుదల చేయడంతో బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రారంభించారు. 100 మీటర్ల పొడవుతో డబుల్ రోడ్డు వెడల్పుతో వంతెన, 100 మీటర్లతో అప్రోచ్ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేశారు.
ఉమ్మడి జిల్లాలో మారుమూల ప్రాంతమైన తూర్పు డివిజన్ కాటారం, మహదేవపూర్, మల్హర్, మహాముత్తారం మండలాలతో పాటు కొత్తగా ఏర్పాటైన పలిమెల మండలాన్ని కలుపుకొని ప్రభుత్వం గత నెలలో కాటారం రెవెన్యూ డివిజన్ను ఏర్పాటు చేసింది. దీంతో ఎన్నో ఏండ్లుగా ఆ ప్రాంత ప్రజలు ఇటు మంథని డివిజన్లో, అటు భూపాలపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉండగా కొత్తగా ఏర్పాటైన కాటారం డివిజన్ కిందకి ఈ మండలాలు చేరాయి. దీంతో కాళేశ్వరం భూసేకరణ, ఇతర రెవెన్యూ సమస్యల పరిష్కారం, ఈ ప్రాంత ప్రజల అభివృద్ధికి అడుగులు పడ్గాయి.
ప్రభుత్వం పాలనా సౌలభ్యం కోసం మండలాల పునర్విభజనకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మంథని నియోజకవర్గంలో రెండు మండలాలను ఏర్పాటు చేసింది. రామగిరి, పలిమెల మండలాలను ఏర్పాటు చేసింది. దీంతో మహదేవపూర్ మండల కేంద్రానికి దాదాపు 50కిలో మీటర్ల దూరంలో, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దుగా ఉన్న గ్రామాల ప్రజలకు పాలన పరమైన సేవలను అందించేలా నూతనంగా పల్మెల మండలాన్ని, సింగరేణి గనులు విస్తరించిన సెంటినరీకాలనీ పారిశ్రామిక ప్రాంతాన్ని రామగిరి మండలంగా ఏర్పాటు చేశారు. గతంలో ఏడు మండలాలు ఉండగా తాజాగా ఏర్పాటైన రెండుతో వీటి సంఖ్య తొమ్మిదికి చేరింది.
పేదోడి సొంతింటి కలను బీఆర్ఎస్ సర్కారు సాకారం చేసింది. పుట్ట మధూకర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంథనిలో దాదాపు 192 డబుల్బెడ్రూం ఇండ్లను మంజూరు చేయించారు. జడ్పీ చైర్మన్గా నిర్మాణాన్ని పూర్తి చేయించి 75 ఇండ్లను పంపిణీ చేయించారు. మిగిలిన ఇండ్ల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. నియోజకవర్గ లబ్ధిదారులు ఇండ్లను పొందిన వారిలో మొదటిస్థానంలో నిలిచారు.
మేజర్ పంచాయతీగా ఉన్న మంథనిని సర్కారు 2018 ఆగస్టు 2న మున్సిపాలిటీగా చేసింది. పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ చొరవతో పెద్ద మొత్తంలో అభివృద్ధి నిధులు విడుదల చేస్తున్నది. మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ మౌలిక వసతుల కోసం వెచ్చిస్తున్నారు. మంథని మున్సిపాలిటీ ఏర్పాటుతో శివారు ప్రాంతాలైన ఎక్లాస్పూర్, కూచిరాజ్పల్లి, మల్లెపల్లి వరకు మంథని-పెద్దపల్లి, మంథని-కాటారం, మంథని- గోదావరిఖని ప్రధాన రహదారుల వైపు భూములకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. పుట్ట మధూకర్ ప్రత్యేక కృషితో 2019 సెప్టెంబరు 6న డీఎంఎఫ్టీ ద్వారా బొక్కలవాగుపై చెక్ డ్యామ్ నిర్మాణానికి రూ.6.36 కోట్లు మంజూరు చేసి పనులు పూర్తి చేశారు. బొక్కలవాగులో చెక్ డ్యామ్ నిర్మాణం తరువాత మత్తడి దూకుతున్న నీటిని చూస్తూ ఇటు ప్రయాణికులు, అటు పట్టణ ప్రజలు ఆనందానికి లోనవుతున్నారు. నిత్యం వేలాది వాహనాల్లో మంథనికి వచ్చి పోయే ప్రయాణికులకు నిండుకుండలా ఉండే చెక్ డ్యామ్ కనువిందు చేస్తోంది.
అపర భగీరథుడు కేసీఆర్ తెలంగాణ రైతుల సాగునీటి కష్టాలను తీర్చిదిద్దేందుకు ఇక్కడి గోదావరి నదిపై బృహత్తరమైన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి మంథని ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు. ఇందులో భాగంగా లక్ష్మీ, సరస్వతీ, పార్వతీ బరాజ్లు, పంపుహౌస్ల నిర్మాణాలతో రాష్ట్రంలో లక్షాలాది ఎకరాలకు సాగునీరు, కోట్లాది మందికి తాగునీరు అందిస్తోంది. లక్ష్మీ, పార్వతీ, సరస్వతీల బరాజ్ కమ్ బ్రిడ్జిల నిర్మాణాలతో గోదావరి అవతలి వైపు ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ర్టాలతో పాటు మంచిర్యాల జిల్లాతో ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగు పడ్డాయి. నిత్యం వేలాది పర్యాటకులు బరాజ్లు, పంపుహౌస్లను సందర్శిస్తూ ఇక్కడి ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తున్నారు.
దీపం కింది చీకటిలా సింగరేణి భూనిర్వాసితుల సమస్యలు ఉండేవి. రామగుండం-1 పరిధిలోని సింగరేణి 11ఇైంక్లెన్ విస్తరణలో భూములు, ఇండ్లు కోల్పోయిన రామగిరి మండలం జల్లారం పంచాయతీ పరిధిలోని సింగిరెడ్డిపల్లి, పెద్దంపేట్, వకీల్పల్లి భూగర్భ గనుల విస్తరణలో సర్వస్వం కోల్పోయారు. వీరి సమస్యలు బీఆర్ఎస్ సర్కార్ వచ్చే వరకు కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అనే చందంగా ఉండేవి. ఓసీపీ-3 పరిధిలోని రచ్చపల్లి, అక్కెపల్లి, అడ్యాల గ్రామాల భూనిర్వాసితుల సమస్యలు సైతం పరిష్కారానికి నోచుకోలేదు. అప్పటి ఎమ్మెల్యే పుట్ట మధూకర్ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి నిర్వాసితుల సమస్యలను పరిష్కరించారు. మెరుగైన పరిహారం, పునరావాస కాలనీలు నిర్మించి సకల సౌకర్యాలు కల్పించారు.
మంథనిలోని రావుల, తమ్మ చెరువు కట్టలతో పాటు బొక్కలవాగుకట్టను సుందరీకరించారు. ఇందుకు కోట్లాదిగా నిధులు వెచ్చించారు. కట్టలపై వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, బతుకమ్మ ఘాట్, వివిధ రకాల పూల మొక్కలను పెంచారు. బొక్కలవాగు కట్టపై రూ. 1.99 కోట్లు, రావుల చెరువుకట్టపై రూ. 30లక్షలు, తమ్మి చెరువు కట్టపై రూ. 30లక్షల నిధులతో సీసీ రోడ్డు పనులు పూర్తై రోడ్లు అందుబాటులోకి వచ్చాయి. పట్టణంలోని పాత పెట్రోల్ పంపు చౌరస్తా నుంచి డిపో వరకు ఇరువైపులా డబుల్ బీట్ రోడ్డు నిర్మాణంతో సెంట్రల్ లైటింగ్ సిస్టంను ఏర్పాటు చేయించారు. డివైడర్లలో వివిధ రకాల మొక్కలను ఏర్పాటు చేసి పట్టణాన్ని ప్రత్యేకంగా సుందరీకరించారు.
ప్రభుత్వం, జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ప్రత్యేక చొరవతో రూ.10 కోట్ల నిధులతో మంథనిలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మాతా శిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్) గర్భిణులు, బాలింతలు, శిశువుల పాలిట వరంగా మారింది. గర్భ నిర్ధారణ నుంచి మొదలై పుట్టిన బిడ్డకు ఐదేండ్లు వచ్చే వరకు రూపాయి ఖర్చు లేకుండా అన్ని రకాల వ్యాధులకు ఉచితంగా వైద్య సేవలు అందించడంతో పాటు అత్యాధునిక పరికరాలతో వైద్య సేవలు అందిస్తున్నారు.