తెలంగాణ సర్కారు చిన్నారుల సంరక్షణపై ప్రత్యేక దృష్టిపెట్టింది. కార్ఖానాలు, గనులు, దుకాణాలు, ఇటుక బట్టీల్లో బందీలుగా మారిన వారికి విముక్తి కల్పించాలని నిర్ణయించింది. ఈ దిశగా బాలల పరిరక్షణ కమిటీలు ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఇందులోని సభ్యులకు బాలల హక్కులపై శిక్షణ ఇచ్చింది. వీరు క్షేత్రస్థాయిలో చిన్నారుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి చైతన్యం నింపేలా కార్యాచరణను రూపొందించింది.
– కలెక్టరేట్, ఏప్రిల్ 23
కలెక్టరేట్, ఏప్రిల్ 23: ‘నేటి బాలలే రేపటి పౌరులు..వారిని కాపాడుకుంటేనే దేశ సంపదగా మారుతారు’ అనే మహాత్ముడి ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ సర్కారు చర్యలు చేపడుతున్నది. చిన్నారులకు ఉజ్వల భవిష్యత్ను అందించే సమున్నత లక్ష్యంతో అడుగులు వేస్తున్నది. గతంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న అనేక మంది బాలలు దుకాణాలు, గనులు, కార్ఖానాలు, ఇటుక బట్టీల్లో కూలీలుగా మాత్రమే పరిమితమయ్యారు. తల్లిదండ్రుల నిరక్షరాస్యత మూలంగా బాల్య వివాహాలతో చిరుప్రాయంలోనే జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దీనిని గమనించిన అప్పటి ఉద్యమ నేత కేసీఆర్ స్వరాష్ట్రంలో వారిని బందీఖానాల్లో నుంచి విముక్తి కల్పించారు. పాలనా పగ్గాలు చేపట్టగానే చిన్నారుల మోముల్లో చిరునవ్వులు పూయించాలనే లక్ష్యంతో బాలల హక్కులు పునరుద్ధరణకు నడుం బిగించారు. క్షేత్రస్థాయి నుంచి మొదలు జిల్లా స్థాయి వరకు బాలల పరిరక్షణ కమిటీల ఏర్పాటుకు ఆదేశించారు. దీంతో, జిల్లాల వారీగా సమగ్ర పిల్లల పరిరక్షణ పథకం నిర్వహించే ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏటేటా కొత్తగా కమిటీలు నియమిస్తున్నారు. సభ్యులకు జీవించడం, రక్షణ పొందడం, భాగస్వామ్యం, అభివృద్ధి చెందే హక్కులను పరిరక్షించేలా బాధ్యతను అప్పగించారు. ఈ కమిటీల ద్వారా గ్రామాలు, మండలాలు, జిల్లా స్థాయిలో బాలల హక్కులు అమలయ్యేలా పర్యవేక్షిస్తున్నారు.
జిల్లాలోని 313 గ్రామ పంచాయతీల్లో, 16 మండలాల్లో, పట్టణాల్లో 174 బాలల పరిరక్షణ కమిటీలు ఏర్పాటు కాగా, 211 గ్రామ, 15 మండల, 24 పట్టణ కమిటీలకు ఇప్పటివరకు శిక్షణ ఇచ్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు. గ్రామస్థాయిలో సర్పంచ్, మండల స్థాయిలో ఎంపీపీ, జిల్లాలో జడ్పీ చైర్మన్ అధ్యక్షులుగా కమిటీలు పనిచేస్తున్నాయి. గ్రామాల్లో అంగన్వాడీ టీచర్, మండలస్థాయిలో సీడీపీవో, జిల్లాలో సంక్షేమాధికారి కన్వీనర్లుగా ఉండగా, వైద్య, విద్య, పోలీసు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మహిళా సమాఖ్య, న్యాయశాఖ, రెవెన్యూ, పాఠశాల కమిటీలు, యువజన సంఘాలు,బాలల సంఘాల సభ్యులు, తల్లిదండ్రులు కమిటీల్లో సభ్యులుగా కొనసాగుతున్నారు. పట్టణాల్లో వార్డు స్థాయిలో కౌన్సిలర్ అధ్యక్షుడిగా ఉంటారు. ఈ సంఘాలన్నీ ప్రతి నెలకోమారు సమావేశమవుతూ, బాలల పరిరక్షణపై చర్చలు, సమీక్షలు నిర్వహిస్తాయి. ఇప్పటివరకు గ్రామ, మండల స్థాయిలో పలుమార్లు సమావేశాలు నిర్వహించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ సమావేశాల ద్వారా నలభై శాతం నిరక్షరాస్యులైన గ్రామీణుల్లో బాలల హక్కుల పట్ల అవగాహన కల్పించినట్లు స్పష్టం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మరింత శ్రద్ధతో అధికార యంత్రాంగం కృషి చేస్తే బాలల హక్కులు పరిరక్షించటమే కాక, వారి భవిష్యత్ కూడా వెలుగులమయంగా మారుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.
బాలల హక్కుల పరిరక్షణకు కృషి..
ప్రభుత్వం సూచనల మేరకు బాలల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశాం. జిల్లాలోని 313 గ్రామాల్లో కమిటీలు పనిచేస్తున్నాయి. మండలాలు, పట్టణాల్లోనూ ఏర్పాటు చేస్తాం. ఈ కమిటీల ద్వారా 16 ఏండ్లలోపు బాలల హక్కులకు భంగం వాటిల్లకుండా కృషి చేస్తున్నాం. ముఖ్యంగా బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్యవివాహాలకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపడుతున్నాం.
– శాంత, ఐసీపీఎస్ ఇన్చార్జి, కరీంనగర్