రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): వాణిజ్య సేద్యం.. ఒక్కసారి మొక్కలు నాటితే 30 ఏండ్లపాటు సిరులు కురిపించే పంట.. ఆయిల్పామ్ సాగు దిశగా కర్షకలోకం కదులుతున్నది. సంప్రదాయ విధానాలతో లాభం లేదని, మార్కెట్లో డిమాండ్ ఉన్న నూనె జాతి ఆయిల్ పామ్ సాగు చేయాలని గత సర్కారు పిలుపు మేరకు చైతన్యవంతమైంది. తక్కువ పెట్టుబడి.. రాబడి ఎక్కువ వచ్చే పంట కావడం.. సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుండడం.. ముఖ్యంగా ఎకరానికి రూ.లక్షకుపైనే నికర ఆదాయం వచ్చే అవకాశముండడంతో సాగుపై ఆసక్తి చూపుతున్నది. సిరిసిల్ల జిల్లాలో 3వేల ఎకరాలు సాగు లక్ష్యం కాగా, ఇప్పటికే 2275 ఎకరాల్లో సాగైంది. మరో 725 ఎకరాలు వేస్తే టార్గెట్ పూర్తికానుండగా, ఉద్యానవనశాఖ వడివడిగా అడుగులు వేస్తున్నది.
వ్యవసాయంలో రైతులు అనాదిగా సంప్రదాయ పంటలే వేస్తున్నారు. మార్కెట్లో డిమాండ్ను బట్టి కాకుండా పాతకాలం నాటి సేద్య విధానాలే పాటిస్తున్నారు. ఫలితంగా లాభం వస్తే తీసుకుంటున్నారు. లేదంటే నష్టపోతున్నారు. ఈ క్రమంలో పరిస్థితిని గుర్తించిన గత బీఆర్ఎస్ సర్కారు మార్కెట్లో డిమాండ్ ఉన్న ఆయిల్పామ్ సాగును ప్రోత్సహించింది. ఈ క్రమంలో కేంద్ర బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి సాగుకు అనువుగా ఉన్న మండలాలను సూచించగా, ఉద్యాన వన శాఖ రంగంలోకి దిగి జిల్లాలోని రైతులకు అవగాహన కల్పించింది. రాజేంద్రనగర్లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విద్యాలయ శాస్త్రవేత్తలను రప్పించి వారితో అవగాహన పెంపొందించే కార్యక్రమాలు చేపట్టగా, రైతాంగం చైతన్య వంతమైంది.
సిరిసిల్లలో టార్గెట్ 3వేల ఎకరాలు
ఉద్యానవన శాఖ అధికారులు జిల్లాలో మూడు వేల ఎకరాల్లో సాగు లక్ష్యాన్ని నిర్దేశించారు. ఆ దిశగా 13 మండలాల్లోని ఔత్సాహిక రైతుల వివరాలు సేకరించారు. వరి, పత్తి, మక్క పంటలకే పరిమితమైన రైతులకు అవగాహన కల్పించి మొక్కలు నాటేలా ప్రోత్సహించారు. మొక్కల పెంపకానికి ఎకరానికి రూ.16,800 సర్కారు సబ్సిడీ ఇవ్వగా, చాలా మం ది రైతులు ఆసక్తి చూపారు. ముందుకొచ్చిన రైతుల ను దశల వారీగా ఖమ్మం జిల్లా ఆశ్వారావుపేటకు తీసుకెళ్లారు. సాగు చేస్తున్న రైతులు, ఆయిల్ పామ్ గింజల నుంచి నూనే తీసే ఫ్యాక్టరీల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించారు. ఈ కమం లో గతేడాది 390 మంది రైతులు తమ భూముల్లో 1274 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేశారు. ఈ యేడాది 1003 ఎకరాల్లో సాగు లక్ష్యం పూర్తి కాగా, ఇప్పటి వరకు 292 మంది రైతులు సాగు చేశారు. మరో 725 ఎకరాల లక్ష్యాన్ని పూర్తి చేయాల్సి ఉంది. ఈ సీజన్లో బోయినిపల్లి మండలంలో 75.85ఎకరాలు, చందుర్తి మండలంలో 57.205, గంభీరావుపేట 46.885, ఇల్లంతకుంట 137.08, కోనరావుపేట 77.08, ముస్తాబాద్ 206.355, రుద్రంగి 18.575, సిరిసిల్ల 12.7, తంగళ్లపల్లి 137.505, వీర్నపల్లి 14.75, వేములవాడ అర్బన్ మండలం 6.555, వేములవాడ రూరల్ మండలంలో 71.38, ఎల్లారెడ్డిపేట మండలంలో 141.475 ఎకరాలలో సాగు చేపట్టారు.
30ఏండ్ల దాకా దిగుబడి
ఆయిల్పామ్ సాగులో భారీ లాభాలుండే అవకాశమున్నది. నాటిన మొక్క ఐదేండ్ల నుంచి 30 ఏండ్ల దాకా దిగుబడినిస్తుంది. ఒక్కో చెట్టుకు ఏడు నుంచి ఎనిమిది గెలలు వస్తాయి. రైతు నిర్వహణను బట్టి గెల సైజు 20నుంచి 60 కిలోల మధ్య ఉంటుంది. ప్రస్తుతం టన్ను ధర మార్కెట్లో 15వేల నుంచి 20వేల దాకా పలుకుతుంది. కాగా, జిల్లాలో నాటి న ఆయిల్పామ్ మొక్కలు మంచిగా పెరుగుతున్నా యి. ఏడాదికే ఆరు మీటర్ల ఎత్తుకు చేరుకున్నాయి. 2022లో నాటిన మొక్కలు ఈ నెలాఖరుతో రెండేళ్లు పూర్తి చేసుకుంటాయి. మరోవైపు గింజల నుంచి నూ నె తీసే ఫ్యాక్టరీలను ఎక్కడికక్కడ ఏర్పాటు చేస్తుండగా, రైతులు మరింత ఉత్సాహం చూపుతున్నారు.
అంతర పంటలూ వేసుకోవచ్చు..
ఆయిల్ పామ్ పంట సాగు చేసే రైతులు అంతర పంటలూ సాగు చేసుకోవచ్చు. పత్తి, మిర్చి, కూరగాయలు, పసుపు, మక్క, పొద్దు తిరుగుడు, టమాట, బీర, శ్రీగంధం, సోయాబీన్, పెసళ్లు, మినుములు, పప్పు దినుసులు, పత్తి పంటలను సాగు చేసుకోవచ్చు. చీడ పీడల ఇబ్బందుల ఉండవు. ఇతర పంటల సాగుకు అవసరమయ్యే ఎరువులను 30 శాతం ఉపయోగిస్తే సరిపోతుంది. దిగుబడిలో సైతం ఎలాంటి తేడాలు ఉండని అధికారులు చెబుతున్నారు.
లాభదాయక పంట
ఈ ప్రాంత రైతులు చాలా కాలంగా ఒకే రకమైన పంట వేస్తున్నారు. దిగుబడి రాక తీవ్రంగా నష్టపోతున్నట్లు గుర్తించాం. అందుకే కొత్త పంటలు సాగు చేయాలని చెబుతున్నాం. ప్రస్తుతం ఆయిల్ పామ్ తోటల సాగులో మంచి లాభం ఉంది. ఈ పంట సాగు వల్ల రైతులకు ఎలాంటి నష్టం లేదు. మొక్కల మధ్య ఆరుతడి పంటలు కంది, పెసర, జామ, మామిడి మొక్కలు కూడా సాగు చేసుకోవచ్చు. కూరగాయలు పెట్టుకోవచ్చు. ప్రభుత్వం కూడా ఎకరానికి 16,800 సబ్సిడీ ఇస్తున్నది. చాలా మంది రైతులు ముందుకొస్తున్నారు. ఇప్పటి వరకు రెండు వేల ఎకరాలపైనే సాగు చేశారు. త్వరలోనే నిర్ధేశిత లక్ష్యాన్ని పూర్తి చేస్తాం.
– జ్యోతి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి (రాజన్న సిరిసిల్ల)