ఉమ్మడి జిల్లా చరిత్రలో మొదటిసారి కరీంనగర్లో నిర్వహించిన రెండు రోజుల ప్రాపర్టీ షో విజయవంతమైంది. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ ఎక్స్పోకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. రెండు రోజులపాటు ఉదయం నుంచి సాయంత్రం దాకా వేలాది మందితో రెవెన్యూ గార్డెన్స్ కిటకిటలాడింది. రెండో రోజు ఆదివారం సెలవు దినం కావడంతో ఉద్యోగులు, పలువురు ప్రముఖులతోపాటు సందర్శకులు పెద్ద సంఖ్యలో వచ్చారు. కొందరైతే కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. హైదరాబాద్, కరీంనగర్కు చెందిన దిగ్గజ రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలతోపాటు ఎస్బీఐ, యూబీఐ, బీవోబీ, కేడీసీసీబీ బ్యాంకులు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. వెంచర్లు, ఇండ్లు, అపార్ట్మెంట్లు, బ్యాంకు రుణాల గురించిన వివరాలను ఆసక్తిగా తెలుసుకున్నారు. రాత్రి 7గంటల ప్రాంతంలో అట్టహాసంగా నిర్వహించిన ప్రాపర్టీ షో ముగింపు కార్యక్రమానికి అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్ హాజరై, రియల్ సంస్థల ప్రతినిధులకు జ్ఞాపికలు అందజేశారు.
కరీంనగర్ కార్పొరేషన్, నవంబర్ 27 : కరీంనగర్లోని రెవెన్యూ గార్డెన్స్లో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాపర్టీ షో విజయవంతంగా ముగిసింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ షోను ఉమ్మడి జిల్లా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సందర్శించారు. హైదరాబాద్, కరీంనగర్కు చెందిన రియల్ ఎస్టేట్కు సంబంధించిన సంస్థల నుంచి పూర్తిస్థాయిలో వివరాలను సేకరించారు. ఆయా సంస్థలు ప్లాట్లు, ఫ్లాట్లపై అందిస్తున్న డిస్కౌంట్స్, ఆయా ఆస్తులకు సంబంధించి ధరలను తెలుసుకున్నారు. అలాగే వ్యాపారాలు, భూములు, ఇళ్ల కొనుగోలుకు సంబంధించి ఆయా బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల ద్వారా అందిస్తున్న రుణాల వివరాలను సేకరించారు.
అలాగే, ప్రస్తుత పరిస్థితుల్లో సోలార్ విద్యుత్ వినియోగం, ఏర్పాటుపై ఆయా సంస్థల ప్రతినిధులు వివరాలను అందించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు రావడంపై వ్యాపార సంస్థల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వచ్చిన సందర్శకులకు ప్రతి రెండు గంటలకు ఒకసారి లక్కీ డ్రా తీసి ఆకర్షణీయమైన బహుమతులను అందించారు. కరీంనగర్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్కుమార్గౌడ్, నగర పాలకసంస్థ కమిషనర్ సేవా ఇస్లావత్, డీఏవో శ్రీధర్, ల్యాండ్ సర్వే ఏఈ అశోక్కుమార్, కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేని మధు, కేడీసీసీ బ్యాంకు సీఈవో సత్యనారాయణరావుతో పాటు వివిధ సంఘాల నాయకులు, ఉద్యోగులు, వ్యాపారులు సందర్శించారు.
ఇలాంటి షోల వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారంటూ అభినందనలు తెలిపారు. రాత్రి 7గంటల ప్రాంతంలో ముగింపు సమావేశం అట్టహాసంగా నిర్వహించారు. అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్ హాజరై, లక్కీ డ్రా తీశారు. విజేతకు 10 వేల విలువైన సెల్ఫోన్ను అందించారు.
అనంతరం రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధులకు జ్ఞాపికలు అందించారు. అంతకుముందు బాల సదన్ విద్యార్థులు సాంసృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. బతుకమ్మ, తెలంగాణ సంప్రదాయాన్ని తెలిపే పాటలు, నృత్యాలతో అలరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సారార్ కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ, మాజీ సర్పంచ్ శ్రీనివాస్రావుతోపాటు బాల సదన్ నిర్వాహకురాలు మంజులాదేవి, సంగెం రాధకృష్ణ, సూర్యశ్రీ పాల్గొన్నారు.
హైదరాబాద్కు దీటుగా కరీంనగర్ అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నది. గతానికి ఇప్పటికి చాలా మార్పు చెందింది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. హైదరాబాద్తోపాటు ప్రభుత్వానికి భారీగా ఆదాయం అందిస్తున్న నగరంగా జిల్లా ఎదగడం అభినందనీయం. ప్రభుత్వం ఆధ్వర్యంలో అంగారిక టౌన్షిప్ ప్లాట్లు వేలం వేస్తే రూ.130 కోట్ల భారీ ఆదాయం వచ్చింది. అంటే ఇక్కడి భూములకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా పెట్టుబడి పెట్టాలన్న ఆలోచన వస్తే అది ల్యాండ్స్పైనే ఉంటున్నది. రాష్ట్ర ఏర్పాటు తర్వాతనే భూముల ధరలకు ఇంతలా రెక్కలు వచ్చాయి. భూములు, ప్లాట్లను కొనుగోలు చేసే ముందు అన్ని పత్రాలు చూసుకోవాలి. ప్రభుత్వ కార్యక్రమాలతో జిల్లాలో భూ సమస్యలను సాధ్యమైనన్నీ పరిష్కరించాం. అక్కడక్కడా కొన్ని మాత్రం ఉన్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని అన్ని రికార్డులను పరిశీలించిన తర్వాత కొనడం మంచిది. ఇలాంటి ప్రాపర్టీ షోల ద్వారా ప్రజలకు మంచి సందేశం ఇవ్వడం అభినందనీయం. రానున్న రోజుల్లో మరిన్ని ప్రాపర్టీ షోలు నిర్వహించాలి.
– ముగింపు కార్యక్రమంలో కరీంనగర్,అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్
ప్రాపర్టీ షో మంచి కార్యక్రమం. రియల్ ఎస్టేట్కు సంబంధించిన సంస్థలు, బ్యాంకులను ఒక వేదికపైకి తీసుకురావడం అభినందనీయం. ప్రభుత్వ నిబంధనల మేరకు ఉన్న భూములు, ప్లాట్లను మాత్రమే ప్రజలు కొనుగోలు చేయాలి. అలాంటి ప్లాట్లు, భూములకు మాత్రమే ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాంకుల నుంచి రుణాలు వస్తాయి. తిరిగి కొన్నేండ్ల తర్వాత విక్రయించాలనుకున్నా మంచి రేటు వస్తుంది. రియల్ వ్యాపారాలు నిర్వహించే సంస్థలు కూడా నిబంధనల మేరకు తమ వ్యాపారాలు చేస్తే ప్రజల్లో మంచి గుర్తింపు వస్తుంది. మా కరీంనగర్ కేంద్ర సహకార బ్యాంకు (కేడీసీసీబీ) ద్వారా డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ అందిస్తున్నాం. అంతే కాకుండా గృహ రుణాలతోపాటు వ్యాపార, ఉన్నత విద్యకు అవసరమైన రుణాలు ఇవ్వడంలో ముందు వరుసలో ఉన్నాం. ఈ ప్రాపర్టీ షోకు వచ్చే సందర్శకుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఇందులో భాగస్వాములం అయినందుకు చాలా సంతోషంగా ఉన్నది.
– ముగింపు కార్యక్రమంలో కేడీసీసీబీ సీఈవో సత్యనారాయణ
ఈ ప్రాపర్టీ షోకు ‘టీ న్యూస్’ మీడియా పార్టనర్గా వ్యవహరించింది. మెయిన్ స్పాన్సర్లుగా పీ మంగాత్రం, అపర్ణ, హైదరాబాద్ కంపెనీలు, అసోసియేట్ స్పాన్సర్గా రాయిచందని సింధ్ డెవలపర్స్ వ్యవహరించాయి. కో స్పాన్సర్లుగా ఆదర్శ కంఫర్ట్స్, బిల్డ్ అర్బన్ కన్స్ట్రక్షన్, ఎస్ఆర్ కన్స్ట్రక్షన్, స్పాన్సర్లుగా ఉస్మాని కన్స్ట్రక్షన్స్, మైత్రి గ్రూప్స్, రాయల్ రిడ్జ్, డ్యూరో, రెప్కో హోమ్లోన్స్, శ్రీ వెంకటేశ్వర అవెన్యూ, కేకే ఎంటర్ ప్రైజెస్, మహాలక్ష్మి మార్కెటింగ్తోపాటు బ్యాంకులు ఎస్బీఐ, యూబీఐ, బీవోబీ, కేడీసీసీబీ కొనసాగాయి.