తెలంగాణ చౌక్, మే 29: ఆదివాసీ ఆడబిడ్డ, దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించకుండా నియంతలా ప్రధాని ప్రారంభించడం దేశ ప్రజలను అమానించినట్లేనని ప్రజా సంఘం జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం మండిపడ్డారు. రాష్ట్రపతిని అవమానించిన మోదీ దేశప్రజలకు క్షమాపణ చెప్పాలని, పార్లమెంట్కు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. కరీంనగర్లోని శ్వేత హోటల్లో సోమవారం ఆయన జిల్లా కమిటీ సభ్యులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఆదివాసి బిడ్డ పార్లమెంట్ భవనాన్ని ప్రారంభిండం ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులకు ఇష్టం లేదని ఆరోపించారు. బీజేపీ ఎప్పటికైనా దళిత, గిరిజన ఆదివాసీలను ఎదగనివ్వకుండా కుట్రలు చేస్తున్నదని విమర్శించారు.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ దేశంలోనే ఎక్కడా లేని విధంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు నూతన సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టి దళితులను, అంబేద్కర్ను గౌరవించారని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీ సీఎం కేసీఆర్ను ఆదర్శంగా తీసుకోవాలని హితవు పలికారు. కేసీఆర్ ప్రభుత్వం అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రస్థానంలో ఉండడం కేంద్ర ప్రభుత్వం ఓర్వలేక పోతోందన్నారు. తమ మాట వినని విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర్టాల ప్రభుత్వాలపై ఈడీ, సీబీఐ దాడులు చేయిస్తూ కక్ష సాధింపులకు పాల్పడుతున్నదన్నారు. అందులో భాగంగానే తెలంగాణ ఆడబిడ్డ కవితక్కపై ఈడీ దాడులు చేయించారని, ఎన్ని దాడులు, కేసులు పెట్టినా కవితక్క నిర్దోషిగా బయటకు వస్తారని పేర్కొన్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రధాని మోదీ తొమ్మిదేండ్లలో 18 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. శ్రీరాముడి పేరుతో అధికారంలోకి వచ్చారని, కాని హిందూ యువత కోసం చేసిన ప్రయోజనాలు ఏమి లేవన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఆ పార్టీ పాలిత రాష్ర్టాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రిజర్వేషన్లను అమలు చేయడంలేదని ధ్వజమెత్తారు. బీజేపీ అగడాలను భరించలేకనే కర్ణాటకలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు తరిమికొట్టారని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీని, ఆర్ఎస్ఎస్ను దేశం నుంచి తరిమివేస్తారని హెచ్చరించారు. పార్లమెంట్ను రాష్ట్రపతితో ప్రారంభించకుండా, ప్రధాని మోదీ ప్రారంభిండం, అది దేశ ద్రోహి సావర్కర్ జయంతి రోజున ప్రారంభించడం దేశానికి చీకటి రోజని అభివర్ణించారు. ఈ విషయాలను ప్రజలకు వివరించేందుకు సభలను నిర్వహిస్తామని తెలిపారు. అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయడం, రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్గా నామకరణం చేసిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపడానికి కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో ఆగస్టు 29న భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభకు ఉమ్మడి జిల్లా నుంచి అన్ని వర్గాల ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు భాస్కర్, సురేందర్ సన్ని, సముద్రాల అజయ్, గజ్జెల ఆనందరావు, శంకర్ సాయిలు, స్వరూప, లత, శ్రీనివాస్ పాల్గొన్నారు.