కోరుట్ల, అక్టోబర్ 21 : భారత జాగృతి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన బతుకమ్మ సంబురాలతో కోరుట్ల పట్టణం పులకించిపోయింది. ఆరు చోట్ల జరిగిన వేడుకలు అంబరాన్నంటాయి. ముఖ్య అతిథిగా హాజరైన భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆయా చోట్ల పాల్గొన్నారు. మధ్యాహ్నం ఒంటిగంట 20 నిమిషాలకు కోరుట్లకు చేరుకున్న ఆమెకు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు, కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేశ్, కోరుట్ల మున్సిపల్ చైర్పర్సన్ అన్నం లావణ్య పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం ప్రసాద్ సెలక్షన్ అధినేత బాలె నర్సయ్య, పుష్పలత దంపతుల ఇంటికి చేరుకోగా, కుటుంబ సభ్యులు ఎమ్మెల్సీకి ఘనంగా స్వాగతించారు.
అక్కడ ఎమ్మెల్యే విద్యాసాగర్రావు సతీమణి సరోజన, జడ్పీ చైర్పర్సన్, మున్సిపల్ చైర్పర్సన్తో పాటు జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు డాక్టర్ మంచాల వరలక్ష్మి, ప్రధాన కార్యదర్శి కుసుమ రజిత, కోరుట్ల నియోజకవర్గ జాగృతి అధ్యక్షురాలు బండారు లావణ్య, మహిళా ప్రజాప్రతినిధులు, స్థానిక మహిళలతో కలిసి కవిత బతుకమ్మను పేర్చారు. తర్వాత బతుకమ్మను ఉంచి స్థానిక మహిళలతో ఆడిపాడారు. అక్కడి నుంచి వాసవి కల్యాణ భవనానికి చేరుకోగా వైశ్య సంఘం ప్రతినిధులు, మహిళలు కవితకు సాదర స్వాగతం పలికారు. అక్కడ తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చిన కవిత బతుకమ్మ పాటలు పాడారు. వైశ్య సంఘం సభ్యురాళ్లలో కలిసి బతుకమ్మ ఆటలు ఆడారు. వారితో సెల్ఫీలు దిగారు. వైశ్య సంఘం ప్రతినిధులు కవితను శాలువా, పూలమాలతో సత్కరించి జ్ఞాపికను ప్రదానం చేశారు. తర్వాత పట్టణంలోని భీమునిదుబ్బలోని బెల్లాల ప్రశాంత్ దంపతుల ఇంటికి చేరుకున్నారు.
వారి ఇంటిలోనూ బతుకమ్మను పేర్చి ఆడిపాడారు. అక్కడి నుంచి నేరుగా మున్సిపల్ కౌన్సిలర్ ఆడెపు కమల, మధు, కో అప్షన్ సభ్యురాలు రెంజర్ల కల్యాణి ఇంటికి వెళ్లి తేనీరు సేవించారు. తిరిగి అంబేద్కర్ నగర్లోని దొనకొండ గంగాధర్ సుజాత దంపతుల ఇంటికి చేరుకున్నారు. అక్కడ వందలాదిగా వచ్చిన కాలనీ మహిళలతో కలిసి బతుకమ్మ పేర్చిన కవిత, బతుకమ్మ పాటలతో హుషారు రేకిత్తించారు. అనంతరం శ్రీనివాసరోడ్డులోని పిన్నంశెట్టి ఆనంద్, రాజేశ్వరి దంపతుల ఇంటికి చేరుకోగా కవితకు చీర, సారె అందించి ఆత్మీయ పరిచయం చేసుకున్నారు.
అక్కడ కొంచెం సేపు గడిపిన కవిత బతుకమ్మలను పేర్చి స్థానికులతో ఫొటోలు దిగారు. అక్కడే ఉన్న అవ్వను ఆత్మీయంగా పలుకరించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. కవితను చూసిన అవ్వ ‘చల్లంగా ఉండూ తల్లి’ అంటూ దీవించింది. అక్కడికి సమీపంలో నివాసం ఉంటున్న పీఏసీఎస్ అధ్యక్షుడు ఎలిశెట్టి భూంరెడ్డి ఇంటికి వెళ్లారు. కుటుంబసభ్యులతో కలిసి సెల్ఫీలు దిగారు. సాయంత్రం 6 గంటలకు బీఆర్ఎస్ నాయకుడు బొమ్మ రాజేశం ఇంటికి చేరుకుని అక్కడ బతుకమ్మలను పేర్చారు. మహిళలతో కలిసి బతుకమ్మ పాటలు పాడి సందడి చేశారు. ఆయాచోట్ల ఆర్బీఎస్ జిల్లా కన్వీనర్ చీటి వెంకట్రావు, మెట్పల్లి మున్సిపల్ చైర్పర్సన్ రణవేణి సుజాత, జడ్పీటీసీ దారిశెట్టి లావణ్య, వైస్ ఎంపీపీ చీటి స్వరూప, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అన్నం అనిల్, మున్సిపల్ ఉపాధ్యక్షుడు గడ్డమీది పవన్, జిల్లా సర్పంచ్ల ఫోరం గౌరవాధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.