పెద్దపల్లి, సెప్టెంబర్ 9: పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలతో పాలన చేరువైందని, ప్రజల చెంతకే అభివృద్ధి, సంక్షేమం అందుతున్నదని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనారిటీ, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పంచాయతీ రాజ్ శాఖ పర్యవేక్షక ఇంజినీర్ కార్యాలయాన్ని శనివారం జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్తో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన సీఎం కేసీఆర్ పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని గుర్తు చేశారు.
కొత్త జిల్లాలతోపాటు అవసరమైన చోట రెవెన్యూ డివిజన్లు, మున్సిపాలిటీలు, మండలాలు, గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసి ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసిన గొప్ప పాలనా దక్షకుడు అని కొనియాడారు. వాటి ఫలాలు మన కండ్ల ముందు స్పష్టంగా కనిపిస్తున్నాయని, ప్రతి గ్రామం, పట్టణాలలో జరిగిన అభివృద్ధే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రజావసరాలకు అనుగుణంగా పంచాయతీ రాజ్, నీటి పారుదల, రోడ్లు భవనాల, మిషన్ భగీరథ శాఖలను విస్తరించడం జరిగిందన్నారు. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు నూతనంగా పర్యవేక్షక ఇంజినీర్ కార్యాలయాన్ని పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.
పెద్దపల్లి ఎఫ్ఏసీ (ఫుల్ అడిషనల్ చార్జ్)గా బాధ్యతలు స్వీకరించిన కరీంనగర్ పంచాయతీ రాజ్ పర్యవేక్షక ఇంజినీర్ వీ కనకరత్నంకు జడ్పీ చైర్మన్తో కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రజా కవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణ రావు జయంతి సందర్భంగా పంచాయతీ రాజ్ కార్యాలయంలో కాళోజీ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఇక్కడ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్, జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, జిల్లా పంచాయతీ రాజ్ ఇంజినీర్ గిరీశ్బాబు, డివిజనల్ అకౌంట్ అధికారి బ్రహ్మానందరెడ్డి, డిప్యూటీ ఈఈలు శంకరయ్య, దేవేందర్, జనార్దన్, అసిస్టెంట్ ఇంజినీర్లు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, నాయకులు బయ్య కొమురయ్య పాల్గొన్నారు.