చిగురుమామిడి, డిసెంబర్ 31: ఉపాధి హామీ పథకం లో కూలీల హాజరు నమోదు విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరింత సాంకేతికతను అభివృద్ధి చేసింది. గత విధానాలను పూర్తిగా మార్చి మరింత పారదర్శకంగా హాజరు నమోదు చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. అందులో భాగంగా జనవరి 1 నుంచి ప్రతి కూలీ హాజరును ఎన్ఎంఎంఎస్ ప్రత్యేక పోర్టల్లో క్షేత్రస్థాయి లో ఫీల్డ్ అసిస్టెంట్లు, సిబ్బంది నమోదు చేయనున్నారు.
గతంలో ఇలా..
క్షేత్రస్థాయిలో 20 మందికి పైగా కూలీలు పనిచేస్తే సిబ్బంది ఆ ప్రాంతానికి వెళ్లి కూలీల వివరాలను తీసుకునేవారు. వారి ఫొటోలు, హాజరు వివరాలను ప్రత్యేక పోర్టల్ (నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం) ద్వారా నమోదు చేసేవారు. 20 మంది కన్నా తకువ కూలీలు ఉంటే వారి వివరాలను తర్వాత నమోదు చేసేవారు. ఒకరికి బదులు మరొకరు పనులకు హాజరు కావడం, కొన్నిచోట్ల పనిచేసిన వారి పేర్లను నమోదు చేయకపోవడం, కూలీల సంఖ్య పెంచి రాయడం మొదలైన అంశాలను క్షేత్రస్థాయిలో అధికారులు గుర్తించారు. ప్రత్యేక మండల సామాజిక తనిఖీ ఆడిటింగ్లో ఇలాంటి తేడాలు కనిపించేవి.
కూలీలకు ప్రయోజనం..
మండలంలో 8 వేల జాబ్ కార్డులకు గాను 5,300 మంది కూలీలు ఈజీఎస్ పనులకు హాజరవుతున్నారు. నేటి నుంచి ఉపాధి హామీ ఉద్యోగులు పనుల వద్దకు వెళ్లి కూలీల హాజరును సెల్ ఫోన్లో నమోదు చేసి భద్రపరచనున్నారు. దీంతో ఆర్థికపరమైన అవకతవకలను నివారించే అవకాశం ఉంది. ఎన్ఎంఎంఎస్ పోర్టల్ ద్వారా నమోదైన కూలీలకు సరైన వేతనం అందుతుంది.
అర్హులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం కృషి
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈజీఎస్ పనులకు హాజరయ్యే కూలీలు, పనుల చిత్రాలను క్షేత్రస్థాయిలో ఆన్లైన్లో నమోదు చేయాలి. క్షేత్రస్థాయిలో పనిచేసే కూలీలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం కృషి చేస్తున్నది. పేదవారికి ఉపాధి కల్పించేందుకు అనేక పనులను ఈజీఎస్లో ప్రభుత్వం కేటాయించింది. ఈజీఎస్ జాబ్ కార్డు కలిగిన వారందరూ పనులను సద్వినియోగం చేసుకోవాలి.
– కొత్త వినీతా శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ, చిగురుమామిడి