కౌలు రైతు బతుకు దుర్భరంగా మారుతున్నది. కాంగ్రెస్ సర్కారు మోసంతో దిక్కుతోచని స్థితిలోకి పడిపోయింది. ఎన్నికల ముందు ఎకరానికి రూ.15వేల పెట్టుబడి సాయం అందజేస్తామని మేనిఫెస్టోలో పెట్టి నమ్మించింది. అధికారంలోకి వచ్చి రెండేండ్లు దాటినా అమలు చేయకుండా చేతులెత్తేయడంతో రైతులు ఆగమవుతున్నారు. ఈ సారైనా లాభం జరుగకపోదా..? సర్కారు సాయం చేయకపోతుందా..? కాలం సహకరించకపోతుందా..? అని ఏటా పంటలు వేస్తూ నీళ్లు లేక, యూరియా అందక నష్టపోతున్నారు. అటు పెట్టుబడులు, ఇటు కౌలు మునుగుతూ ఆర్థికంగా చితికిపోతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
ఎల్లారెడ్డిపేట, మార్చి 17: ఎన్నికల ముందు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో రైతులతోపాటు కౌలు రైతులకు మేలు కలిగేలా చూస్తామని హామీ ఇచ్చింది. రైతులకు రైతు బంధు ఎలాగూ వస్తది కాబట్టి కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరాకు 15వేలు ఇచ్చి ఆదుకుంటామని హామీ ఇచ్చింది. కానీ, గద్దెనెక్కి రెండేండ్లు దాటినా అమలు చేయకుండా చోద్యం చూస్తున్నది. ప్రభుత్వం సాయం చేస్తుందని ఎన్నో ఆశలతో పంటలు వేస్తున్న రైతులకు ఏటా అన్యాయమే జరుగుతున్నది. ఓ వైపు సాగు నీళ్లు రాక, బోరుబావుల్లో నీళ్లు ఎల్లక పంటలు ఎండిపోతుండడంతో అరిగోసపడుతున్నారు. గొర్రెల కాపరులకు మేతకోసం వదిలిపెడుతున్న దయనీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంకా సన్నవడ్ల బోనస్కు సర్కారు మంగళం పాడడంతో మరింత నష్టపోతున్నారు. ఇంకా గతంలో కౌలు రైతులకు పీఏసీఎస్ గోదాముల వద్దే యూరియా దొరికేది. కానీ, ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ఫర్టిలైజర్ యాప్ ఇబ్బందులు తెచ్చింది. యూరియా బుక్ చేసుకునేందుకు భూ యజమాని ఓటీపీ అవసరం ఉంటుంది. అయితే యజమానులు అందుబాటులో ఉండకపోవడం, ఓటీపీ చెప్పలేని పరిస్థితుల్లో చాలా మంది కౌలు రైతులు యూరియా కోసం అవస్థలు పడ్డారు.
ఈ కింది చిత్రంలో ఎదగని వరి పొలం వద్ద నిల్చున్న కౌలు రైతు పేరు వంగాల నర్సింహారెడ్డి. ఊరు ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి. ఎవుసాన్నే నమ్ముకుని బతుకుతున్నడు. సాగులో వినూత్న పద్ధతులతో తోటి రైతులకు మార్గదర్శకంగా నిలువడమే కాదు, ఆదర్శ రైతుగా గుర్తింపు పొందిండు. గ్రామంలో 30 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వివిధ రకాలు పంటలు సాగు చేస్తున్నడు. గత సీజన్లో 20 ఎకరాల్లో పత్తి పంట వేసిండు. సాధారణంగా 250 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా, యూరియా దొరక 105 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. అలాగే 10ఎకరాల్లో వరి వేస్తే 250 క్వింటాళ్ల దిగుబడికి కేవలం 160 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. అందులో ఐదెకరాలలో సన్నవడ్లు సాగు చేస్తే బోనస్ కూడా రాలే. ‘ఈ యాసంగిల ఆరెకరాల్లో వరి, మరో ఆరెకరాల్లో మక్క వేసిన. యూరియా దొరకదేమోనని మరో నాలుగెకరాల్లో సేంద్రియ పద్ధతిలో జొన్న పెట్టిన. కనీసం వరికి, మక్కకు అయినా తగినంత యూరియా దొరుకుతదో లేదో. పంటలు చేతికిరాకపోతే యజమానులకు ఏం చెప్పాలో..? అర్థమైతలేదు’ అని నర్సింహారెడ్డి ఆవేదన చెందుతున్నడు. సర్కారు సాయం అందించడం, బోనస్ ఇవ్వడం కల్లేనని వాపోతున్నడు.
ఈ చిత్రంలో ఎండిన పొలాన్ని చూపిస్తున్న రైతు పేరు కోల మహేశ్. ఊరు ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్. సొంతంగా ఎకరంనర పొలం ఉంది. మరో ఎకరంనర భూమిని కౌలుకు తీసుకున్నడు. పంట పంటకూ 10వేల కౌలు చెల్లిస్తున్నడు. అంతేకాదు, ఈ యాసంగిలో 40వేల పెట్టుబడి పెట్టిండు. అయితే ఎండల తీవ్రతకు కౌలుకు తీసుకున్న పొలం వద్ద బోరుబావిలో నీళ్లు అడుగంటినయి. పొలానికి నీళ్లు పెట్టేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా చుక్క నీరు రాకపోవడంతో తల్లడిల్లుతున్నడు. కండ్ల ముందే పంట ఎండిపోవడం చూడలేక మేతకోసం గొర్రెల కాపరులకు ఇచ్చిండు. నా సొంత పొలం పరిస్థితీ ఇలాగే ఉందని, కొద్దోగొప్పో ఎల్లుతున్న నీటితో తడులు అందిస్తున్నానని ఆవేదనగా చెబుతున్నడు.