polytechnic education | రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్, ఆగస్టు 20 : శక్తి స్కీమ్, జీవో నెం.97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ విద్యార్థులు కళాశాల నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. పాలిటెక్నిక్ కళాశాలలను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని ఎస్ఎఫ్ఐ నాయకుడు మల్లారపు ప్రశాంత్ ఆరోపించారు. ప్రభుత్వం పాలిటెక్నిక్ విద్యను బలోపేతం చేయకుండా ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్తోందని విమర్శించారు.
ప్రభుత్వ కళాశాలల్లో మౌలిక వసతులు, అధ్యాపకుల నియామకాలు, ప్రయోగశాలల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. శక్తి స్కీమ్, జీవో నెం.97ను రద్దు చేసి, పాలిటెక్నిక్ విద్యను కాపాడాలని కోరారు. ఎస్బీటీఈటీని శక్తి స్కీమ్ ప్రభావం నుంచి రక్షించాలని, విద్యార్థుల భవిష్యత్తో ప్రయోగాలు చేయొద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు సుమారు 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు.