జ్యోతినగర్(రామగుండం), జనవరి 13 : రామగుండం రైల్వేస్టేషన్ సమీపంలోని యార్డు ఏరియాలో గూడ్స్ ఖాళీ వ్యాగన్లు యుటిలిటీ ట్రాక్ వెహికిల్ను ఢీకొట్టాయి. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం కానీ, ఆస్తి నష్టం కానీ జరుగలేదు. వివరాల్లోకి వెళితే.. రామగుండం రైల్వేస్టేషన్లోని యార్డు ఏరియాలో 46 ఖాళీ వ్యాగన్లకు మరమ్మతులు పూర్తి చేసిన అధికారులు, వాటిని ఆర్ఓహెచ్ సిక్లైన్ నుంచి రన్నింగ్ లైన్లోకి తీసుకొచ్చారు.
అయితే, అవి నిలపాలనుకున్న పాయింట్ నుంచి ఓ 100 మీటర్లు ముందుకు దూసుకెళ్లి ముందున్న యుటిలిటీ ట్రాక్ వెహికిల్ను ఢీకొట్టాయి. దీంతో ఆ వెహికల్ సైతం ముందుకు వెళ్లి అడ్డుగా ఉన్న సిమెంట్ గోడ పైకి ఎక్కింది. విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. వ్యాగన్లకు ఉన్న ఇంజెన్ కనెక్షన్ను కట్చేసే లోపు రోల్ జరిగి ఉండొచ్చని, బ్రేక్ పవర్ చివరి వరకు లేకపోవడంతో క్లపింగ్ ఆన్ క్లపింగ్ జరుగడం మరో కారణం కావచ్చని అభిప్రాయపడ్డారు.