గోదావరిఖని కోల్ బెల్ట్ ఏరియా కాలుష్యపు కోరల్లో చిక్కుకున్నది. పట్టణంలోని ప్రధాన నాళాల నుంచి వచ్చే వ్యర్థపు నీటిని భారీ ఎస్టీపీ ప్లాంట్ ద్వారా శుద్ధి చేసి సింగరేణి నర్సరీలు, సమీప పంట పొలాలు, స్థానిక అవసరాలతో పాటు నీటి సరఫరా చేయాలని యాజమాన్యం నిర్ణయించినా, దానిని అధికారులు గాలికొదిలేశారు. రామగుండం రీజియన్-1 పరిధిలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిర్వహణ లేక కోల్ బెల్ట్ ప్రాంత ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు.
పెద్దపల్లి, మార్చి 21(నమస్తే తెలంగాణ) : గోదావరిఖని పట్టణం నుంచి వచ్చే మురుగు నీటిని శుద్ధి చేసి, సింగరేణి అవసరాలకు వాడుకోవాలని.. తద్వారా పర్యావరణం పరిరక్షించవచ్చని 2 ఇంకె్లైన్ వద్ద రెండు ఎస్టీపీ(సేవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్)ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సుమారు రూ.80 లక్షల వ్యయంతో 2/100 కేఎల్డీ ఎస్టీపీని ఏర్పాటు చేసి 2022 ఏప్రిల్ 20న నిర్వహణలోకి తీసుకొచ్చారు. దీనికి సంబంధించి మూడేళ్ల నిర్వహణ బాధ్యతను ఒక ప్రైవేటు కాంట్రాక్టర్కు అప్పగించారు. అది పనిచేస్తున్న క్రమంలోనే 2024 అక్టోబర్ 27న ఆ ఎస్టీపీలోని 2.3 హెచ్పీ, 2.2 హెచ్పీ మోటర్లు చోరీకి గురయ్యాయి. దీంతో ఎస్టీపీ కాంట్రాక్టర్, సింగరేణి అధికారులు గోదావరిఖని టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే నిందితులను పట్టుకొని మోటర్లను రికవరీ చేశారు. అయితే, రికవరీ చేసి 17 నెలలైనా వాటిని సింగరేణి అధికారులు ఎస్టీపీకి తీసుకువచ్చి బిగించలేదు.
అధికారుల నిర్లక్ష్యంతో పూర్తికాని మరో ఎస్టీపీ
ఒక ఎస్టీపీ నిర్మాణం జరుగుతున్న సమయంలోనే మరో ఎస్టీపీ నిర్మాణానికి సంస్థ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రూ.17 కోట్ల వ్యయంతో 17 ఎంఎల్డీ (17 మిలియన్ లీటర్ ఫర్ డే) కెపాసిటీ గల ఎస్టీపీ నిర్మాణ పనులను అప్పటి ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో 2023 జనవరి 24న ప్రారంభించారు. అయితే, నిర్మాణ పనులు ప్రారంభించి మూడేళ్లయినా.. యాజమాన్యం సరైన నిధులు కేటాయించకపోవడం, ఆలనా పాలనా చూడకపోవడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం గొప్పల కోసం రూ.కోట్ల కొద్ది డబ్బులను ఖర్చు చేస్తున్న సింగరేణి సంస్థ కార్మికుల అవసరాలను మాత్రం పట్టించుకోవడం లేదు.
‘ఖని’ కాలుష్యమయం
ఎస్టీపీల నిర్వహణ లేక గోదావరిఖని ప్రాంతంతో పాటు పట్టణ సమీప ప్రాంతమైన జనగామ, సుందిల్ల చెరువు కాలుష్యమయంగా మారుతున్నాయి. చెరువుల్లో కలుషిత నీరు చేరి చేపలు చనిపోతున్నాయి. పంట పొలాలకు కలుషిత నీరు చేరి రకరకాల తెగుళ్లతో దిగుబడి తగ్గుతున్నది. ఇప్పటికే సింగరేణి కోసం వందలాది ఎకరాల భూములు కోల్పోయి నష్టపోగా.. ఇప్పుడు ఈ కాలుష్యపు నీటి వల్ల కూడా మరింత నష్టపోతున్నట్టు స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సింగరేణికి పొల్యూషన్ బోర్డు నోటీసులు
ఆర్జీ-1 పరిధిలో నిర్మించిన ఎస్టీపీ మోటర్లు చోరీకి గురై మూత పడిన విషయంలో సింగరేణి అధికారులు చొరవ చూపడం లేదని, వెంటనే దాన్ని పునఃప్రారంభించాలని రామగుండం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ భిక్షపతి గతంలో నోటీసులు జారీ చేశారు. కానీ, ఇప్పటి వరకు యాజమాన్యం స్పందించలేదు. ఉన్న ఎస్టీపీని వినియోగంలోకి తేవడం లేదు. కొత్తగా నిర్మిస్తున్న ఎస్టీపీ నిర్మాణ వేగాన్ని పెంచడం లేదు.
సింగరేణి నిర్లక్ష్యానికి ప్రతీక
సింగరేణి నిర్లక్ష్యానికి గోదారిఖనిలోని ఎస్టీపీలే నిదర్శనం. చోరీకి గురైన మోటర్లు రికవరీ అయి 17 నెలలైనా.. వాటిని బిగించడం లేదంటే కార్మికుల ప్రాణాలను గాలికి వదిలేసినట్టే కదా. ఆర్జీ-1 యాజమాన్యం తమాషా చూస్తున్నది. ఒక వైపు సెక్యూరిటీ వైఫల్యం, మరో వైపు నూతన ఎస్టీపీ నిర్మాణంలో నిర్లక్ష్యం దారుణం. ఉత్పత్తి కావాలి తప్ప కార్మికుల ప్రాణాలు ఏమైతే ఏంది అన్నట్లుగా ఉంది యాజమాన్యం తీరు. ఈ విధానాలకు చరమ గీతం పాడాలి.
– మిర్యాల రాజిరెడ్డి, టీబీజీకేఎస్ అధ్యక్షుడు (గోదావరిఖని)
వారం రోజుల్లో పంపులను బిగిస్తాం
ఎస్టీపీలో చోరీకి గురైన పంపులను తీసుకురావడంలో కొంత జాప్యం జరిగింది. వారం రోజుల్లో వాటిని తీసుకువచ్చి బిగిస్తాం. ఎస్టీపీని పునఃప్రారంభిస్తాం. మురుగు నీటి వ్యవస్థను అరికట్టడంలో భాగంగా 170 లక్షల నీటిని శుద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కొత్తగా నిర్మిస్తున్న ఎస్టీపీ నిర్మాణంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల జాప్యం జరుగుతున్నది. ఆ పనులు కూడా వేగవంతంగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తాం.
– లలిత్ కుమార్, ఆర్జీ-1 జీఎం(రామగుండం)