General strike | పెద్దపల్లి, జూన్23: శతాబ్ద కాలంగా కార్మికవర్గం అనేక త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి వాటి అమలుకు నిరసనగా వచ్చే 9న సార్వత్రిక సమ్మె నిర్వహిస్తున్నట్లు పెద్దపల్లి కార్మిక సంఘాల జేఏసీ నాయకులు తెలిపారు. కలెక్టరేట్ మీటింగ్ హాల్లో కలెక్టర్ కోయ శ్రీహర్షకు సోమవారం సమ్మె నోటీస్ అందజేశారు.
అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. 4 లేబర్ కోడ్లను అమలు చేసేందుకు బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19(1)సీ, ఆర్టికల్ 21, 24, 39(డీ)కి విరుద్ధమైన కోడ్స్ అమలు జరిగితే కార్మికులు ఉద్యోగ భద్రత, ఉపాధి కోల్పోతారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జూలై 9న జరిగే సమ్మెలో సింగరేణి, ఎన్టీపీసీ, బసంత్నగర్ తదితర పరిశ్రమంలో పనిచేసే కార్మికులు, సంఘటిత సంఘటితరంగా కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు వీ చందర్, జిల్లా ఉపాధ్యక్షులు మేకల సతీష్, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి సీపెల్లి రవీందర్, టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇసంపల్లి రాజేందర్, జిల్లా అధ్యక్షుడు తోకల రమేష్, ఐఎఫ్టీయూ నాయకులు కృష్ణ, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.