కరీంనగర్లో కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడి దివ్య క్షేత్రానికి తొలి అడుగు పడింది. నగరంలోని పద్మనగర్లో పదెకరాల్లో టీటీడీ నిర్మిస్తున్న ఆ ఏడుకొండలవాడి ఆలయ నిర్మాణానికి వైభవంగా అంకురార్పణ జరిగింది. వేదమంత్రాలు, భాజాభజంత్రీలు, గోవిందనామ స్మరణ నడుమ బుధవారం ఉదయం వెంకన్న గుడికి శంకుస్థాపన చేశారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, రాజ్యసభ సభ్యుడు దీవకొండ దామోదర్ రావు, టీటీడీ ఎల్ఏసీ సభ్యుడు భాస్కర్ రావు భూమిపూజలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. రాత్రి 8గంటల తర్వాత శ్రీనివాసుడి కల్యాణాన్ని వైభవంగా జరిపించగా, దాదాపు 15వేల మంది భక్తులు తరలివచ్చి కనులారా తిలకించారు. – కమాన్చౌరస్తా, మే 31
కరీంనగర్ కమాన్చౌరస్తా, మే 31 : కరీంనగర్లో కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడి దివ్య క్షేత్రానికి తొలి అడుగు పడింది. వేద మంత్రోచ్ఛారణలు, గోవింద నామస్మరణ, భాజా భజంత్రీల మధ్య ఆలయ నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. పద్మనగర్లో పదెకరాల స్థలంలో నిర్మించే తిరుమలేశుడి ఆలయానికి బుధవారం ఉదయం శంకుస్థాపన, భూమి పూజ కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, రాజ్యసభ సభ్యుడు, నమస్తే తెలంగాణ ఎండీ దీవకొండ దామోదర్ రావు, టీటీడీ ఎల్ఏసీ సభ్యుడు భాస్కర్ రావు, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, మేయర్ వై సునీల్ రావు, పలువురు ప్రముఖులు, అశేషంగా హాజరైన భక్త జనం మధ్య భూమిపూజ కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ క్రమంలో టీటీడీ ప్రధాన ఆలయ అర్చకుడు వేణుగోపాల దీక్షితుల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం, పలువురు వైదిక పురోహితులు హోమాది కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా, ఉదయం విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, అగ్ని ప్రణయం, కుంభారాధన, విశేష హోమాలు, ఫిలేష్టికలు, శంఖువుకు, అభిషేకం చేసి అనంతరం వేదమంత్రాలతో శంకుస్థాపన చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న గజరాజులు భక్తులకు ఆశీర్వాదం అందజేశాయి. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లాయీస్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సీపీ సుబ్బారాయుడు, బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్, ఎఫ్డీసీ చైర్మన్ అనిల్ కుర్మాచలం, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, టీటీడీ ఏల్ఏసీ సభ్యురాలు మయూరి, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి హరిశంకర్, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా శ్రీనివాస కల్యాణం
ఆలయం నిర్మించే ఆలయ ప్రాంగణంలో శ్రీనివాసుడి కల్యాణం వైభవంగా నిర్వహించారు. టీటీడీ నుంచి హాజరైన పండితులు తిరుమల సంప్రదాయం ప్రకారం వేదమంత్రోచ్ఛారణల మధ్య కల్యాణం జరిపించారు. రాత్రి 8గంటల నుంచి 10గంటల వరకు వివాహఘట్టం జరిపించగా, దాదాపు 15 వేల మంది భక్తులు తిలకించి తన్మయత్వం చెందారు. దాతల సహకారంతో టీటీడీ నుంచి తెప్పించిన లడ్డూ ప్రసాదం, కంకణాలను భక్తులకు అందజేశారు. అంతకుముందు సాయంత్రం ఆరు గంటల సమయంలో మంకమ్మతోట వేంకటేశ్వర ఆలయం నుంచి పద్మశాలీలు పద్మావతి అమ్మవారికి సారె తీసుకొని ఊరేగింపుగా పద్మనగర్లోని కల్యాణ వేదిక వద్దకు చేరుకున్నారు. మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు విదోద్కుమార్, రాజ్యసభ సభ్యుడు దీవకొండ దామోదర్ రావు, టీటీడీ ఏల్ఏసీ భాస్కర్ రావు, మేయర్ వై సునీల్రావు దంపతులు పద్మశాలీలతోపాటు సారెను తీసుకువచ్చారు. గోగుల ప్రసాద్ బృందం ఆధ్వర్యంలో అన్నమాచార్య కీర్తనలు అలరించాయి. దాదాపు 12వేల మందికి అన్నదానం చేశారు.
20 కోట్లతో ఆలయ నిర్మాణం
కరీంనగర్లో టీటీడీ ఆలయ నిర్మాణానికి 20 కోట్ల నిధులు కేటాయించాం. వీటితోపాటు భక్తు ల విరాళాలతో ఆలయాన్ని రెండేళ్లలో పూర్తి చే స్తాం. ఈ ఆలయ నిర్మాణం కోసం మంత్రి గం గుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపా ధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, రాజ్యసభ సభ్యుడు దీవకొండ దామోదర్ రావు, టీటీడీ ఎల్ఏసీ సభ్యుడు భాస్కర్ రావు కోరగా, పదెకరాల స్థలం కేటాయించి సహకారం అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు. ఇక్కడ నిర్మించే ఆలయంలో తిరుమల తరహాలో సేవా కార్యక్రమాలు ఉంటాయి. అర్చకులు, ప్రసాద పోటుకు ప్రత్యేక గదుల నిర్మాణం చేపడతాం. ఈ ఆలయ నిర్మాణంలో తిరుమలలో ఉండే వి ధంగా ఆలయం, అమ్మవార్ల ఆలయాలు, నాలు గు మాఢ వీధులు, ప్రసాద పోటు ఉంటాయి.
– వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ చైర్మన్
భక్తుడిగా సంతోషిస్తున్నా..
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని టీటీడీ ఆధ్వర్యంలో కరీంనగర్లో నిర్మిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఇది జిల్లా వాసులు చేసుకున్న అదృష్టం గా భావిస్తున్నా. ఏటా బ్రహ్మోత్సవాలకు స్వామి వారు వస్తున్నారని నగర వాసులు నమ్ముతున్నారు. కానీ, ఇప్పుడు ఆలయం నిర్మించుకుని ఇక్కడే ఉండేందుకు వస్తున్నట్లుంది. ఈ ఆలయానికి 10 ఎకరాల స్థలం మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, విజ్ఞప్తిని మన్నించి టీటీడీ ఆలయం నుంచి 20 కోట్లు మంజూరు చేయించిన ఏపీ సీఎం జగన్కు ధన్యవాదాలు. ఆలయ నిర్మాణంలో పాలుపంచుకోవడం వెయ్యేళ్లకు దొరకని అదృష్టం. శ్రీవారి ఆశీర్వాద బలమే ఈ ఆలయం. ఆలయానికి ముందు భాగంలో ఉన్న సహజసిద్ధమైన కోనేరు నుంచే స్వామివారి సేవకు నీటిని ఉపయోగించేలా ఉంది. ఈ స్థలంలో నిండుగా శ్రీవారికి ఇష్టమైన చింత చెట్లు ఉండగా, వేంకటేశ్వరస్వామే స్వయంగా ఈ స్థలం ఎంపిక చేసుకున్నట్లు ఉంది.
– గంగుల కమలాకర్, రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి
ఆధ్యాత్మికంగా పరిఢవిల్లుతుంది
టీటీడీ ఆధ్వర్యంలో నిర్మాణాలు రాష్ట్ర రాజధానిలోనే చేపడతారు. కానీ, కరీంనగర్లో పెద్ద స్థాయిలో ఆలయ నిర్మాణానికి ముందుకు రావడం సీఎం కేసీఆర్, రాజ్యసభ సభ్యుడు దీవకొండ దామోదర్ రావు, మంత్రి గంగుల కృషి వల్లే సాధ్యమైంది. ఈ ఆలయ నిర్మాణంతో కరీంనగర్ జిల్లా ఆధ్యాతికంగా పరిఢవిల్లుతుంది. నగరానికి ఆలయం తూర్పు ముఖంలో ఉండి నగరం మొత్తం ఆయన ముందునిల్చినట్లు ఉంటుంది. ఇక్కడ ఆలయ నిర్వహణ మొత్తం తిరుమల తిరుపతి ఆలయం ఆధ్వర్యంలో ఉంటుంది.
– బోయినపల్లి వినోద్కుమార్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు