రామడుగు, డిసెంబర్ 6 : యాసంగిలో పంట మార్పిడిపై దృష్టి పెట్టాలని, ఇతర పంటలపై గ్రామాల్లో సర్పంచులే రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ కర్ణన్ సూచించారు. రామడుగు మండలం వెంకట్రావుపల్లి అనుబంధ గ్రామం కిష్టంపల్లిలో రైతు మిట్ట రాకేశ్ రెండెకరాల వరిపొలం అడుగులో మక్కజొన్న సాగు చేయగా, సోమవారం కలెక్టర్ పరిశీలించారు. మక్క ఎన్ని రోజుల్లో కోతకు వస్తుందని అడుగగా, 90 నుంచి 120 రోజుల్లో వస్తుందని, ప్రస్తుతం తాను వేసిన మక్క నెలరోజులైందని రైతు సమాధానమిచ్చారు. ఈ నెల రోజుల్లో రెండుసార్లు మందు వేశానని, కత్తెరపురుగు బెడద అధికంగా ఉందని తెలిపారు. కీటకాల బెడద ఎలా పోతుందని జిల్లా వ్యవసాయ అధికారి వాసిరెడ్డి శ్రీధర్ను కలెక్టర్ ప్రశ్నించగా గుడ్డు దశలో ఉన్నప్పుడే మొగుల్లో గుళికలను వేయడం ద్వారా నిర్మూలించవచ్చని ఆయన సమాధానమిచ్చారు. అనంతరం సర్పంచు జవ్వాజి శేఖర్తో మాట్లాడుతూ పంటమార్పిడిపై రైతులు దృష్టి సారించేలా నడుం కట్టాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం యాసం గిలో వరిధాన్యం కొనుగోలు చేయడంలేదని, రాష్ట్ర ప్రభుత్వం కూడా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయదని చెప్పారు. ఒకవేళ వరిసాగు చేసే రైతులు ముందస్తుగా మిల్లర్లు, సీడ్ కంపెనీలతో ఒప్పదం కుదుర్చుకోవాలన్నారు. వరికి బదులుగా మినుములు, కందులు, జొన్నలు, నువ్వులు తదితర లాభసాటి పంటలను సాగు చేసుకోవాలని, సరిపడా విత్తనాలను అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
గాయత్రీ పంప్హౌస్ సందర్శన
లక్ష్మీపూర్ గాయత్రీ పంపుహౌస్ను కలెక్టర్ కర్ణన్ సందర్శించారు. సర్వీస్బేలో పంపులను పరిశీలించి, ప్రాజెక్టు అధికారులతో కలిసి సొరంగ మార్గం ద్వారా సర్జిఫూల్ చేరుకున్నారు. అక్కడినుంచి పంపుహౌస్కు చేరుకొని పైనుంచి పంపులను పరిశీలించారు. అక్కడినుంచి సుమారు 200 అడుగులకు పైగా కిందకు వెళ్లి మోటార్లోపలి భాగాలైన షాప్టును పరివీలించారు. దీనిపై ప్రాజెక్టు డీఈఈ రాంప్రసాద్ కలెక్టర్కు వివరించారు. అనంతరం రామడుగు పీహెచ్సీకి చేరుకొని వైద్యాధికారి శ్రీనివాస్ను మండలంలో కరోనా పరిస్థితి, వ్యాక్సినేషన్ గురించి అడిగి తెలుసుకున్నారు. ఇంకా 300ల మంది వ్యాక్సినేషన్ వేసుకోవాల్సి ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే వందశాతం కావాలని, అవసరమైతే పోలీసుల సహాయం తీసుకోవాలన్నారు. అనీమియా ముక్త్ కరీంనగర్లో భాగంగా ఎంతమంది మహిళలకు పరీక్షలు నిర్వహించారని అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ డీఏవో శ్రీధర్, తహసీల్దార్ కోమల్రెడ్డి, ఎంపీడీవో ఎన్నార్ మల్హోత్రా, ఏడీఏ రామారావు, ఏవో యాస్మిన్, డిప్యూటీ డీఎంఅండ్హెచ్వో సుధాకర్రెడ్డి, వైద్యాధికారి శ్రీనివాస్, కాళేశ్వరం ప్రాజుక్టు డీఈఈ రాంప్రసాద్, మెఘా ప్రతినిధి శ్రీకాంత్, సర్పంచు జవ్వాజి శేఖర్, ఉప సర్పంచు మార్కొండ నర్సింహారెడ్డి ఉన్నారు.
చల్మెడలో అధికారుల సందర్శన
కరీంనగర్ రూరల్: డిసెంబర్ 6 : కరీంనగర్లోని చల్మెడ ఆనందరావు వైద్య కళాశాలను కలెక్టర్ ఆర్వీ కర్ణన్, పోలీసు కమిషనర్ సత్యనారాయణ, జిల్లా వైద్య అరోగ్య వైద్యాధికారి జువేరియా సోమవారం సందర్శించారు. కళాశాల చైర్మన్ చల్మెడ లక్ష్మీనరసింహారావు, ప్రిన్సిపాల్ ఆసీమ్ అలీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వైద్య విద్యార్థుల పరిస్థితి, కరోనా రావడానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు.
కమిషనరేట్ వ్యాప్తంగా పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేసి, వైద్య సిబ్బంది సహకారంతో వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు సీపీ సత్యనారాయణ తెలిపారు. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ సారథి, వైద్యకళాశాల చైర్మన్ చల్మెడ లక్ష్మీనరసింహారావు , వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ అనిత, రూరల్ ఏసీపీ విజయసారథి తెలిపారు.