విద్యుత్ వెలుగు విరజిమ్ముతున్నది. దశాబ్దాల నాటి సమైక్య పాలనా చీకట్లను చీల్చుకొని సమైక్య రాష్ట్రంలో నిరంతర కాంతి ప్రసరిస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ ఉంటే వార్త.. లేకపోతే మరోవార్త.. ఇలా ఎప్పుడు వస్తుందో..? ఎప్పుడు పోతుందో..? తెలియని దుస్థితి ఉండేది. ఇచ్చిన షెడ్యూలు కూడా అమలు చేయని దౌర్భాగ్య పరిస్థితుల్లో.. ఇటు పంటలు ఎండి పోయి రైతులు, అటు పరిశ్రమలు మూతపడి చిన్న, మధ్య తరహా పారిశ్రామిక వేత్తల బతుకు ఆగమైంది. కానీ, స్వరాష్ట్రంలో తొలి ప్రభుత్వంలోనే సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యలతో రాష్ట్ర విద్యుత్ రంగంలో సరికొత్త విప్లవం మొదలైంది. ఏండ్లనాటి అంధకారాన్ని దూరం చేసుకొని వెలుగుల్లోకి వచ్చింది. ఈరోజు పల్లె నుంచి పట్టణం దాకా ఎక్కడ చూసినా రెప్పపాటు అంతరాయం లేకుండా సరఫరా జరుగుతున్నది. ఇక వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తుండడంతో వ్యవసాయ రంగ స్వరూపమే మారిపోయింది. పారిశ్రామిక ప్రగతి రెట్టింపు కాగా, తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం విద్యుత్ విజయోత్సవ వేడుకలు నిర్వహించనున్న సందర్భంగా ‘నమస్తే’ అందిస్తున్న ప్రత్యేక కథనమిది. – కరీంనగర్, జూన్ 4 (నమస్తే తెలంగాణ)/ముకరంపుర
ఒకప్పుడు కరెంటు కష్టాలు కంటి మీద కునుకు లేకుండా చేసేవి. ఎప్పుడు వస్తుందో ఎపుడు పోతుందో తెలియని గందరగోళ పరిస్థితులు ఉండేవి. వ్యవసాయానికి సరిపడా కరెంట్ లేక రైతులు అష్ట కష్టాలు పడేవారు. రాత్రి వేళ కరెంట్ వినియోగించుకునేందుకు వెళ్లి బావుల వద్ద కరెంట్ షాక్లతో, పాము కాట్లతో మృత్యువాత పడేవారు. కరెంట్ కోసం నిత్యం రోడ్డెక్కేవారు. సబ్ స్టేషన్లను, విద్యుత్ కార్యాలయాలను ముట్టడించేవారు. పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా కరెంట్ కోతలు విధించేవారు. పరిశ్రమలకు పవర్ హాలిడేస్ ఇచ్చే వారు. పీక్ అవర్స్లో విద్యుత్తు వాడకూడదని పరిశ్రమలపై ఆంక్షలు సైతం విధించే వారు. గ్రామాలకైతే రాత్రి కేవలం లైటింగ్ కోసమే సరఫరా చేసేవారు. పొద్దంతా గ్రామాల్లో కరెంట్ ఉండేది కాదు. పట్టణాల్లో ఎక్కడ చూసినా పొద్దంతా జనరేటర్ల మోతలే వినిపించేవి. ముఖ్యంగా వ్యాపార, వాణిజ్య దుకాణ సముదాయాలపై అధిక భారం పడేది. కరెంట్ లేక వ్యాపారాలు సాగేవి కాదు. తీవ్ర నష్టాలను చవి చూసేవారు. గృహ వినియోగదారులకు నిత్యం కోతలు విధించే వారు. కరెంట్ లేక ఇంట్లో ఉండని పరిస్థితి కనిపించేది. ఇలా అన్ని రంగాలు కరెంట్ కోసం అష్టకష్టాలు అనుభవించాయి.
స్వరాష్ట్రంలో కరెంట్ కష్టాలు తీరాయి. రాష్ట్రం అవతరించిన తర్వాత సీఎం కేసీఆర్ కరెంట్ సమస్యలపై ప్రధానంగా దృష్టి పెట్టారు. అనతి కాలంలోనే పరిశ్రమలకు 24 గంటల కరెంట్ ఇచ్చారు. అనంతరం గృహ వినియోగదారులకు కూడా నిరంతర విద్యుత్తును అందించారు. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి 6 గంటలు మాత్రమే కరెంట్ ఇచ్చేవారు. తెలంగాణ వచ్చిన తర్వాత 7 గంటలకు పెంచారు. అనంతరం 9 గంటలు ఇచ్చారు. 2018 జనవరి 1 నుంచి నిరంతర విద్యుత్తు సరఫరా చేస్తున్నారు. రాష్ట్రం సాధించిన గొప్ప విషయాల్లో ఇదొకటిగా నిలిచి పోయింది. రాష్ట్ర విభజన సమయంలో కరెంట్ లేక తెలంగాణ చీకటి అవుతుందని చెప్పిన ఆంధ్ర పాలకులకు చెంప పెట్టులా సీఎం కేసీఆర్ విద్యుత్తు రంగాన్ని సంస్కరిస్తూ వచ్చారు. ఇపుడు ఏ రంగానికైనా 24 గంటల విద్యుత్తు సరఫరా అందిస్తున్నారు. వ్యవసాయానికి నిరంతర సరఫరా ఉచిత విద్యుత్ను అందిస్తుండడంతో రైతులు మంచి దిగుబడులను సాధిస్తున్నారు. పరిశ్రమలు లక్ష్యానికి మించి ఉత్పత్తులు సాధిస్తున్నాయి.
ఇక్కడ కనిపిస్తున్న రైతు పేరు జంగిలి మల్లయ్య. ఊరు కొత్తపల్లి మండలం కమాన్పూర్. ఇతనికి ఇదే గ్రామ శివారులో ఆరెకరాల వ్యవసాయ భూమి ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ఉచిత కరెంట్తో ఈ మొత్తం భూమిని సాగు చేస్తున్నాడు. ఏటా రెండు పంటలు పండిస్తున్నాడు. 2014కు ముందు వ్యవసాయం చేస్తూనే ఆర్టీసీలో కండక్టర్గా పనిచేసే వాడు. ఒకప్పుడు కరెంట్ కోసం అష్ట కష్టాలు పడే వారమని, ఆరెకాల భూమిలో నాలుగెకరాలు మాత్రమే సాగు చేసేవాళ్లమని, అందులో నీళ్లు లేక, నీళ్లు ఉన్నా, కరెంట్ లేక సగం ఎండి పోయేదని చెబుతున్నాడు. ఇప్పుడు ఆ భయమనేది లేదని, కండక్టర్గా రిటైరైన తర్వాత పూర్తి స్థాయిలో వ్యవసాయం చేసుకుంటున్నానని, ఉన్న ఆరెకరాల్లో నాటేస్తున్నానని అంటున్నాడు. 24 గంటల కరెంట్తో తన లాంటి ఎందరో రైతులకు ధైర్యం వచ్చిందని చెబుతున్నారు.
మాది తంగళ్లపల్లి మండల కేంద్రం. నేను విద్యుత్ మోటార్ మెకానిక్ పనిచేస్తున్న. తెలంగాణ రాకముందు సిరిసిల్లలో విద్యుత్ సబ్స్టేషన్లు తక్కువగా ఉండేవి. 220కేవీ విద్యుత్ కేంద్రం కరీంనగర్ దగ్గర దుర్శేడ్లో ఉండడం వల్ల కరెంటు రాక, పోక తెలిసేది కాదు. అప్పటి సర్కారు లో వోల్టేజీతో ఆరుగంటల కరెంటు సరఫరా చేసేది. దీంతో ఎప్పుడూ మోటార్లు కాలిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుండేటోళ్లు. నేను నెలకు యాభై మోటర్లు రిపేరు చేసేవాన్ని. కాలిపోయిన మోటారును రిపేరు చేస్తే ఒక్క దానికి రూ.రెండువేలు ఖర్చయితుండె. అట్ల ఒక్కో రైతు ఆరునెలల కోసారి కాలిపోయిన మోటరును తెచ్చేది. 2014 తర్వాత సిరిసిల్లలో 220కేవీసబ్స్టేషన్ ఏర్పాటు చేసిండ్రు. సబ్స్టేషన్లను పెంచిండ్రు. ఇప్పుడు మోటార్లు కాలిపోవుడన్న ముచ్చటేలేదు. మంచి కరెంటు సైప్లె అవుతుంది. మోటర్లు వైండింగ్ పని చాలా తక్కువైంది. రైతులు కొత్త బోర్లు వేసుకుంటేనే మాకు పనిదొరుకుతుంది. నీళ్ల బోర్లకు కరెంటు వైరు వేయడం, స్టార్టర్లు ఫిట్ చేయడం పనులే ఉంటున్నయి. నాడు నా దగ్గర ఐదుగురు పనిచేసోటోళ్లు. ఇప్పుడు ఇద్దరే ఉన్నరు. చాలా మంది మెకానిక్లకు పనిలేకుండా పోయింది.
– కొండ శ్రీధర్, విద్యుత్ మోటార్ మెకానిక్ తంగళ్లపల్లి మండల కేంద్రం
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో విద్యుత్ విజయోత్సవాలు నిర్వహించారు. కరీంనగర్లో నిర్వహించే వేడుకల్లో మంత్రి గంగుల కమలాకర్ పాల్గొంటున్నారు. స్థానిక ఎస్ఈ కార్యాలయం నుంచి విద్యుత్తు ఉద్యోగుల ర్యాలీతో వెళ్లి రేకుర్తిలోని శుభం గార్డెన్లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మిగతా నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించే వేడుకల్లో ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొంటారు. విద్యుత్తు ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు ముందుగా ర్యాలీలు నిర్వహిస్తారు. కళాకారులతో సాంస్కృతిక ప్రదర్శనలు, ధూంధాం కార్యక్రమాలు నిర్వహిస్తారు. పదేళ్లలో సాధించిన ప్రగతిని ఈ సందర్భంగా వివరిస్తారు.
గతంలో రైతులు తమ పెట్టుబడుల్లో కాలిపోయిన విద్యుత్తు మోటార్లకే ఎక్కువ శాతం ఖర్చు చేసేవారు. అనేక ప్రాంతాల్లో లో ఓల్టేజీ సమస్య తీవ్రంగా ఉండేది. కరెంటు మోటర్లు ఎప్పుడు కాలిపోతాయో..? తెలియని పరిస్థితి ఉండేది. గ్రామాలు, పట్టణాల్లోని వైండింగ్ వర్క్షాపుల్లో నిత్యం ఇరవై ముప్పయి మోటర్లు రీ వైండింగ్కు వచ్చేవి. మోటర్లు బాగు చేసేందుకు వర్కర్లు సరిపోక నిర్వాహకులు వారం పది రోజులకుగానీ రీ వైండింగ్ చేసి ఇచ్చేవారు కాదు. ఇటు ట్రాన్స్ఫార్మర్లు కూడా ఈ సమస్య కారణంగా తరుచూ కాలిపోయేవి. కాలిన ట్రాన్స్ఫార్మర్లు సకాలంలో మరమ్మతుకు నోచుకోక పంటలు ఎండిపోయేవి. కానీ ఇపుడా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఉమ్మడి జిల్లాలో లో ఓల్టేజీ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం 165 కెపాసిటర్ బ్యాంకులను ఏర్పాటు చేసింది. ప్రణాళికాబద్దంగా లైన్లను బలోపేతం చేసింది. దీంతో ఇటు ట్రాన్స్ఫార్మర్ల ఫేల్యూర్ శాతం తగ్గింది. 2014-15లో 9 శాతం ఉన్న ఫేల్యూర్స్ ఇపుడు 1.3 శాతానికి తగ్గాయి. గాలి దుమారం, వర్షాలు కురియడం, పిడుగులు పడడం వంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగానే ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక రైతులకైతే తమ మోటర్లు కాలిపోతాయన్న చింతే లేకుండా పోయింది. మోటర్లు మునగడం, ఇతర రిపేర్లు వస్తే తప్పా తమ వద్దకు రావడం లేదని వైండర్లు చెబుతున్నారు.
అది చింతకుంట. కథలాపూర్ మండలంలోని ఒక గ్రామం. కథలాపూర్ అంటేనే నాన్ కమాండ్లో సాగు, తాగునీటి కరువుతో అల్లాడిన మండలం అని పేరుండేది. సాగు నీరు లేక, వరద కాలువ ఉన్నా ప్రయోజనం లేక, పాతాళానికి చేరిన జలాన్ని పైకి రప్పించలేక నానా అవస్థలు అనుభవించిన మండలం. అలాంటి కథలాపూర్ మండలం మూడువేలకు లోపు జనాభా ఉన్న గ్రామమే చింతకుంట. గ్రామంలో చెరువు ఉన్నా చుక్క నీరు ఉండకపోయేది. వ్యవసాయం చేద్దామంటే వర్షాన్ని లేదంటే పాతాళ జలాన్ని నమ్ముకొని ముందుకు సాగాల్సిన దుస్థితిలో కొట్టుమిట్టాడేది. ఎన్నో ఇబ్బందులు పడి బావులు తవ్వుకొని, బోర్లు వేసుకొని విద్యుత్ మోటర్లు పెట్టి వ్యవసాయం చేసుకుందామంటే అడుగంటిన జలాలు, ఎప్పుడు వస్తుందో..? ఎన్ని గంటలు ఉంటుందో తెలియని కరెంట్తో ఇక్కడి రైతులు అరిగోసపడ్డారు. ఒకటికాదు రెండు కాదు గ్రామంలో 501 బోర్లు వేసి సేద్యం సాగించిన ధైన్యం వారిది. 2014లో రాష్ట్ర ఆవిర్భావ సమయంలో గ్రామంలో 501 విద్యుత్ కనెక్షన్లతో 950 ఎకరాల్లో అష్టకష్టాలు పడుతూ వరి సాగుచేసేవారు. కానీ తెలంగాణ రాష్ట్రం రావడం కథలాపూర్ దశ తిరిగింది. వరద కాలువకు తూములు పెట్టి మండలంలోని చెరువులన్నీ నింపడంతో పాటు ఎస్సారెస్పీ పునర్జీవ పథకంతో మండలం స్వరూపమే మారిపోయింది. చెరువులు నిండడం, ఏడాది పొడవున వరద కాలువలో నీరు ఉండడంతో పాతాళలోకానికి చేరిన గంగ భూ ఉపరితలానికి ఉప్పొంగింది. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్ను ఇవ్వడం, లోఓల్టేజీ సమస్యలు పరిష్కరించడంతో చింతకుంట గ్రామ సేద్య రూపురేఖలే మారిపోయాయి. నాడు 501 ఉన్న కనెక్షన్ల సంఖ్య ఇప్పుడు ఏకంగా 1205కు పెరిగాయి. నాణ్యమైన 24 గంటల కరెంట్తో సేద్య విస్తీర్ణం ఏకంగా 2041 ఎకరానికి చేరుకుంది. 2014తో పోల్చిచూస్తే 1091 ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి వచ్చింది.
2014లో ఉమ్మడి జిల్లాలో కేవలం 218 విద్యుత్ ఉప కేంద్రాలు మాత్రమే ఉండేవి. ఇపుడు వాటి సంఖ్య 351కి చేరింది. తెలంగాణ వచ్చిన పదేళ్లలో 149 కొత్త విద్యుత్ ఉప కేంద్రాలను ఏర్పాటు చేశారు. ట్రాన్స్ఫార్మర్లు చూస్తే 2014లో కేవలం 53,247 మాత్రమే ఉండేవి. ఇపుడు 78,958కి పెరిగాయి. తొమ్మిదేళ్లలో 25,711 ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశారు. అప్పటికీ ఇప్పటికీ విద్యుత్తు వినియోగం చూసుకుంటే 2014లో కేవలం 1,093.36 మెగావాట్ల విద్యుత్తు మాత్రమే వినియోగం జరిగేది. ఇపుడు 3,328.85 మెగావాట్ల వినియోగం జరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో నెలవారీగా ఇంత పెద్ద మొత్తంలో వినియోగం పెరిగినా ఎక్కడా అంతరాయం కలగకుండా విద్యుత్తు సరఫరా చేయడం తెలంగాణ ప్రభుత్వం సాధించిన ఘనతగా చెప్పవచ్చు.
రాష్ట్రం సిద్దించిన తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విద్యుత్తు రంగాన్ని మెరుగు పర్చేందుకు రూ.650 కోట్లతో మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఇందులో ఒక్క కరీంనగర్ జిల్లాలోనే రూ.200 కోట్లు ఖర్చు చేశారు. పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామర్ధ్యం పెంచడం, విద్యుత్తు ఉప కేంద్రాల్లో అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం, పాత ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంచడం, పలు విద్యుత్తు ఉప కేంద్రాల్లో 3.15, ఏవీఏ, 5 ఎంవీఏ, 8 ఎంవీఏల సామర్థ్యం పెంచడం, అంతర్గత లైన్ల నిర్మాణం, కొత్తగా విద్యుత్తు ఉప కేంద్రాలను ఏర్పాటు చేయడం వంటి పనులు చేపట్టారు.