Huzurabad MLA Kaushik Reddy | హుజురాబాద్, ఏప్రిల్ 7 : సిర్సపల్లిలో ఏర్పాటు చేయనున్న డంపు యార్డ్ రద్దు చేయాల్సిందేనని, లేకుంటే ఆందోళన తప్పదని హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి రాష్ర్ట ప్రభుత్వాన్ని హెచ్చరించారు. డంప్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ప్రజా ఉద్యమం మరింత ఉదృతమవుతోంది. మంగళవారం నిర్వహించిన 24 గంటల నిరాహార దీక్షలో భాగంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అమరవీరులను స్మరించుకుని నిరాహార దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రభుత్వం విరమించుకోకపోతే ఉద్యమాలు ఉదృతం చేస్తామని పేర్కొన్నారు.
ప్రజల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటు వల్ల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడటమే కాకుండా భూగర్భ జలాలు కలుషితమయ్యే ప్రమాదం ఉందని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యం, భవిష్యత్, పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టిన ఈ నిరసనకు విశేష స్పందన లభించింది. పెద్ద ఎత్తున మహిళలు స్వచ్చందంగా ముందుకు వచ్చి దీక్షలో పాల్గొన్నారు. వివిధ గ్రామాల నుంచి భారీగా తరలివచ్చిన ప్రజలు, యువత, మహిళలు దీక్షా తరలివచ్చి ఉద్యమానికి తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ దీక్షా శిబిరానికి మాజీ ఎంపీ వినోద్ కుమార్ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కమిటీ సభ్యులు, ప్రజా సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.