కరీంనగర్, జూన్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉద్యమానికి ఆది నుంచీ అండగా నిలిచిన ఉమ్మడి జిల్లా, రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఊహించని విధంగా అభివృద్ధి చెందింది. బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి రాష్ట్ర సాధన వరకు జరిగిన ప్రతి ఘట్టానికి వేదికై, ప్రగతి పరుగులు తీసింది. అధినేత కేసీఆర్కు సెంటిమెంట్గా నిలిచిన ఈ గడ్డపై ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు.. పథకాలు పురుడుపోసుకొని విజయవంతంగా అమలవుతున్నాయి. గడిచిన తొమ్మిదేళ్లలో ఉమ్మడి జిల్లానే కాదు, రాష్ట్రం రూపురేఖలే మారిపోగా, సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను భావి తరాలు గుర్తుంచుకునేలా నిర్వహించుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 2న జెండా ఆవిష్కరణతో వేడుకలు మొదలై, 22న అమరుల సంస్మరణతో ముగియనుండగా.. 21 రోజులపాటు రోజుకో కార్యక్రమం పండుగలా నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. తెలంగాణ ఘనకీర్తిని చాటేలా.. భావితరాలు గుర్తుంచుకునేలా.. అమరుల త్యాగాలను స్మరిస్తూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉత్సవాలు జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. ఆ మేరకు మంత్రులు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు ఇప్పటికే సన్నాహక సమావేశాలను నిర్వహించి దిశానిర్దేశం చేశారు. మరోవైపు గడిచిన తొమ్మిదేళ్లలో సాధించిన విజయాలను ప్రతి ఒక్కరికీ తెలిసేలా శాఖల వారీగా ప్రగతి నివేదికలు, కరపత్రాలను రూపొందించారు.
కరువునేల సస్యశ్యామలం
సమైక్య రాష్ట్రంలో కరీంనగర్ అంటేనే కరువు జిల్లా.. ఎటుచూసినా నెర్రలుబారిన భూములు, అడుగంటిన భూగర్భ జలాలు, అన్నదాతల అగచాట్లు, ఆత్మహత్యలు ఇలా గతాన్ని తలుచుకుంటేనే వణుకు పుడుతుంది. ఆ కష్టాలను నెమరేసుకుంటే కళ్లలో నీళ్లు తిరుగుతాయి. కానీ, స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత ఉమ్మడి జిల్లా ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. తొమ్మిదేండ్ల కాలంలో ఎంతో మార్పు కనిపిస్తున్నది. సీఎం కేసీఆర్ దూరదృష్టితో ప్రాజెక్టుల రీడిజైనింగ్లో భాగంగా కాళేశ్వరం ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టి మూడేళ్లలో పూర్తి చేశారు. దాంతో సాగు, తాగునీటి కష్టాలు పూర్తిగా దూరమయ్యాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. సాగునీటి రంగం సమూలంగా మారిపోయింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో నాలుగు జీవధారలు ఏర్పడ్డాయి. 250 కిలోమీటర్ల పొడవునా గోదావరి జీవం పోసుకున్నది.
180 కిలోమీటర్ల పొడవు ఉన్న మానేరు, 124 కిలోమీటర్ల పొడవున్న వరదకాలువ నిత్య ప్రవాహంతో కళకళలాడుతున్నాయి. నిజానికి ఇన్ని సాధ్యమా..? అంటూ ప్రతిపక్షాలు చేసిన విమర్శలను పట్టించుకోకుండా ముందుకెళ్లిన ముఖ్యమంత్రి.. వాటన్నింటినీ కళ్ల ముందు సాక్షాత్కరింపజేశారు. మిషన్ కాకతీయ కింద చెరువులను పునరుద్ధరింపజేశారు. మధ్యమానేరును నిత్య జల కల్పతరువుగా మార్చారు. ఎగువమానేరు ఎండల్లోనూ మత్తడి దూకింది. నీటికోసం కోటి కష్టాలు పడ్డ సిరిసిల్ల ప్రజల చెంతకు మానేరు తరలివచ్చింది. ఇటీవలే మల్కపేట రిజర్వాయర్ ట్రయల్న్ కూడా సక్సెస్ అయింది. ఫలితంగా వ్యవసాయం మూడింతలు పెరిగింది. ఏ గ్రామానికి వెళ్లినా ధాన్యపు రాసులే కనిపిస్తున్నాయి. ఇవే కాదు.. నాడు కరెంటు ఉంటే వార్త. నేడు కరెంటు పోతే వార్త. ఆనాడు సమైక్య రాష్ట్రంలోనూ అత్యధిక వ్యవసాయ మోటర్లు ఉన్నది కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోనే. ఇచ్చే రెండు మూడు గంటలు కూడా లోవోల్టేజీ వల్ల వేలాది మోటర్లు కాలిపోయేవి. కానీ, ఇప్పుడు కనురెప్ప పాటు కూడా కరెంటు పోవడం లేదు. రైతుల జీవితాలు మొత్తం మారిపోయాయి.
పెద్ద ఎత్తున కొలువులు
స్వరాష్ట్రంలో నీళ్లు, నిధులు సాకారం కావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నియామకాలపై దృష్టి పెట్టారు. పెద్ద ఎత్తున కొలువుల భర్తీకి శ్రీకారం చుట్టారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఏకకాలంలో దాదాపు 80 వేల పైచిలుకు పోస్టులను భర్తీ చేసేందుకు నిర్ణయించి విడుతల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల ఉమ్మడి జిల్లాలో సుమారు 10 నుంచి 12 వేల మందికి ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి. అంతేకాదు, కొత్త జోనల్ విధానం తేవడం వల్ల ఇక్కడి పోస్టులు ఈ ప్రాంత ఉద్యోగార్థులకు దక్కే అవకాశాలు ఏర్పడ్డాయి. ఇలా చెప్పుకుంటూ పోతే.. సమైక్య రాష్ట్రంలో దగాపడ్డ తెలంగాణ ఇప్పుడు సగర్వంగా తలెత్తుకొనే స్థాయికి చేరింది. ఇందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఏ కోణంలో చూసినా ప్రథమ శ్రేణిలో ఉంది.
ఇంటింటికీ సంక్షేమ ఫలాలు
తెలంగాణ ట్యాగ్లైనే నీళ్లు, నిధులు, నియామకాలు అని ఉద్యమ సమయంలోనే చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్.. వాటిని ఆచరణ రూపంలో పెడుతున్నారు. ముందుగా సకల సమస్యలకు మూలమైన నీటి ఇబ్బందిని తొలగించే అంశంపై దృష్టి పెట్టారు. అందుకోసం ప్రపంచమే అబ్బురపడేలా కేవలం మూడేళ్ల వ్యవధిలోనే కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడమే కాకుండా, అనేక ప్రాజెక్టులను నిర్మించారు. తెలంగాణ వ్యాప్తంగా జలసవ్వడులు వినిపిస్తున్న నేపథ్యంలో ‘బంగారు తెలంగాణ’ నిర్మాణమే లక్ష్యంగా ముందుకెళ్లారు. సకల జనుల సంక్షేమమే లక్ష్యంగా ప్రగతి పథంలో నడిపించారు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరెంట్ ద్వారా అన్నదాతల జీవితాలను మార్చారు. విద్య, వైద్య రంగాలను బలోపేతం చేశారు. పెద్ద ఎత్తున గురుకులాలు ఏర్పాటు చేశారు. ‘మన ఊరు-మన బడి’తో సర్కారు బళ్లను ఆధునీకరిస్తున్నారు. ప్రైవేట్కు దీటుగా తీర్చిదిద్ది డిజిటల్ విద్యను బోధిస్తున్నారు. మరోవైపు జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసి వైద్యం చేరువ చేస్తున్నారు. కంటి వెలుగుతో నేత్ర సమస్యలకు పరిష్కారం చూపుతున్నారు. విదేశాల్లో చదువుకునే పేద, మధ్యతరగతి వర్గాల పిల్లల కోసం ‘విదేశీ విద్య’ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇంకా అన్ని వర్గాలకు భరోసానిస్తున్నారు. రెసిడెన్షియల్ స్కూళ్లు, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్స్తో ఆడబిడ్డలకు చేయూతనిస్తున్నారు. ఆసరా పింఛన్లతో వృద్ధులకు అండగా నిలుస్తున్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా దళితబంధును తెచ్చి వేలాది మంది దళిత బిడ్డల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. మిషన్ భగీరథ కింద ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నీరు సరఫరా చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. దేశంలో బీజేపీ పాలిత రాష్ర్టాల్లో లేని ఎన్నో విప్లవాత్మక పథకాలు మన వద్ద అమలు చేస్తున్నారు.
ప్రగతి పరుగులు
70 ఏండ్ల పాలనలో కనిపించని అభివృద్ధిని సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్లలోనే మన ముందుంచారు. స్వరాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో పల్లె, పట్టణాలకు నిధుల వరద పారించారు. రోడ్లు, వంతెనలు నిర్మించడంతోపాటు మౌళిక సదుపాయాలు కల్పించారు. ఎవరూ ఊహించని విధంగా పల్లె, పట్టణ ప్రగతితో గ్రామాలు, పట్టణాల రూపురేఖలు మార్చి, దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దారు. ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టారు. పరిపాలనా సౌలభ్యం కోసం 2016లో జిల్లాల పునర్వ్యవస్థీకరణతో కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. కొత్తగా తండాలను గ్రామపంచాయతీలుగా మార్చారు. కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్లు, మున్సిపాలిటీలు ఏర్పాటు చేశారు. దాంతో పాలనా సౌలభ్యం కలిగింది.
2001 ఏప్రిల్ 27న కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం టీడీపీకి, తన శాసన సభా సభ్యత్వానికి రాజీనామా చేసి, టీఆర్ఎస్ ఆవిర్భావానికి నాంది పలికారు.
2001 మే17న కరీంనగర్ ఎస్సారార్ కళాశాల వేదికగా నిర్వహించిన ‘సింహగర్జన సభ’లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటును ప్రకటించారు. లక్షలాది మంది సాక్షిగా తెలంగాణ వచ్చేదాకా మడమ తిప్పబోనని ప్రతినబూనారు. ప్రపంచ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఈ సభ విజయవంతమైన ఘనత ఈ గడ్డకు దక్కింది.
2001లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 100 ఎంపీటీసీలు, 85 జడ్పీటీసీలు, 3 వేల మంది సర్పంచులు, రెండు జిల్లా పరిషత్ స్థానాలను కైవసం చేసుకున్నది. అందులో కరీంనగర్ జిల్లా పరిషత్ కూడా ఉన్నది.
2004లో యూపీఏ ప్రభుత్వానికి మద్దతు పలికిన కేసీఆర్, తనదైన శైలిలో చక్రం తిప్పి, అదే ఏడాది జూన్ 7న రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ అంశాన్ని ప్రస్తావించేలా చేశారు. ఆ సమయంలో కరీంనగర్ ఎంపీగా ఉన్నారు. ఈ ఘనత కూడా ఈ గడ్డకే దక్కింది.
2005 జనవరిలో కేంద్ర మంత్రి ప్రణబ్ముఖర్జీ ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీ ఏర్పాటు కూడా టీఆర్ఎస్ విజయమే.
2006 సెప్టెంబర్ 12న కరీంనగర్ లోక్సభ స్థానానికి కూడా కేసీఆర్ రాజీనామా చేశా రు. తెలంగాణ వాదం లేనే లేదంటూ నాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన అవహేళన మాటలతో కలతచెందిన ఆయన, పదవిని తృణప్రాయంగా భావించారు. తెలంగాణ కోసం పదవుల త్యాగానికి శ్రీకారం చుట్టిన ఘనత ఈ ప్రాంతానికి దక్కింది.
2006 డిసెంబర్ 7న కరీంనగర్ లోక్సభ ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో 2,01,582 ఓట్ల మెజార్టీనిచ్చి ఈ గడ్డ ప్రజలు కేసీఆర్ను గెలిపించారు. ప్రత్యేక తెలంగాణవాదం ఉందని నలుమూలలా చాటి చెప్పిన చరిత్ర ఉమ్మడి జిల్లా ప్రజలకు దక్కింది. ఈ ఎన్నిక టీఆర్ఎస్కు రాజకీయ పునర్జన్మనిచ్చింది.
2009 నవంబర్ 11న ప్రత్యేక తెలంగాణ సాధనే ధ్యేయంగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టేందుకు తీగలగుట్టపల్లిలోని కేసీఆర్ భవన్ నుంచి బయలుదేరిన కేసీఆర్ను అల్గునూరు చౌరస్తా వద్ద పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు ఈ ప్రాంత ప్రజలు ఎదురేగి కేసీఆర్కు మద్దతుగా నిలిచారు. ఈ గడ్డపై జరిగిన అరెస్టు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది.
2011 సెప్టెంబర్ 23న సకలజనుల సమ్మెకు కరీంనగర్ గడ్డ మీద నుంచే అధినేత పిలుపునిచ్చారు. ఎస్సారార్ కళాశాల మైదానంలో జరిగిన సభలో సకలజనుల చారిత్రక సమ్మెకు రణభేరీ మోగించారు. ఈ సమ్మె యావత్తు దేశం దృష్టిని ఆకర్షించింది.
2014 ఏప్రిల్ 13న ఆనాడు జరిగిన సార్వత్రిక ఎన్నికలకు శ్రీ రాజరాజేశ్వర కళాశాల వేదికగా జరిగిన బహిరంగ సమావేశంలో తొలి సమర శంఖారావం పూరించారు. అద్భుత విజయాన్ని సాధించి తొలిసారి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టింది.
2014 జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం
2018 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో విజయఢంకా మోగించి రెండోసారి అధికారంలోకి వచ్చింది.
స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి జిల్లాపై ఎనలేని ప్రేమ చూపారు. హరితహారం, రైతుబంధు, రైతు బీమా, రైతుబంధు సమితులు, మిషన్ భగీరథ, దళితబంధు వంటి ప్రతిష్టాత్మక పథకాలను ఈ గడ్డమీద నుంచే ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్లో భాగంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి మూడేళ్లలోనే పూర్తి చేశారు.