Huzurabad | హుజురాబాద్ రూరల్, ఫిబ్రవరి 23 : అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఖూనీ చేస్తుందని బీజేపీ హుజురాబాద్ పట్టణ శాఖ అధ్యక్షుడు తూర్పాటి రాజు అన్నారు. బీజేపీ హుజురాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అక్రమ అరెస్టును నిరసిస్తూ హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ మాట్లాడుతూ ఒకవైపు బీజేపీ ఎమ్మెల్యేలపై దాడులు, మరోవైపు హిందువులపై దారుణమైన అకృత్యాలు జరుగుతున్న ఈ అరాచకాలను తీవ్రంగా ఖండిస్తున్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను అక్రమంగా అరెస్టు చేయడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు. ప్రశ్నించిన వారిని అక్రమ అరెస్టు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ కక్షసాధింపు చర్య మానుకోవాలని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కొలిపాక శ్రీనివాస్, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు తూముల శ్రీనివాస్, నరాల రాజశేఖర్, యాంసాని శశిధర్, ఓడ్నాల విజయ్, బొరగాల సారయ్య, గంట సంపత్, ఐలయ్య, కొడిమ్యాల పవన్ కుమార్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.