జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం చారిత్రాత్మక, పర్యాటక ప్రదేశాల చిత్రమాలికతో కనువిందు చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని కలెక్టరేట్ కార్యాలయాలన్నింటినీ ఒకే మోడల్లో నిర్మించగా, కలెక్టర్గా ముజమ్మిల్ఖాన్ మరింత కళ తీసుకువచ్చారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత రోజు నుంచే కలెక్టరేట్పై ప్రత్యేక దృష్టిని సారించిన ఆయన, పలు వినూత్న నిర్ణయాలు తీసుకుంటున్నారు.
అందులో భాగంగా ఇప్పటికే 54 ప్రభుత్వ శాఖల అధికారులు భోజనం చేసేందుకు పురుషులు, మహిళలకు వేర్వేరుగా భోజన శాలలు ఏర్పాటు చేశారు. అలాగే సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ఉండే అధికారులు, సిబ్బందికి, వచ్చీపోయే ప్రజల కోసం మెస్, క్యాంటీన్లను ఏర్పాటు చేయించారు. అలాగే కలెక్టరేట్ ఎడమ,కుడి వైపు వెళ్లే రెండు ప్రాంగణాల్లో ప్రజలకు స్వాగతం పలికేలా అందమైన పెయింటింగ్స్, బతుకమ్మ, జానపద కళలు ప్రతిబింబించేలా పెయింటింగ్స్ వేయించారు.
రాముడు నడయాడిన నేల రామగిరి ఖిల్లా, కాకతీయుల నాటి అమరేశ్వర ఆలయం, త్రికూటాలయం, ధర్మాబాద్లోని ముక్తేశ్వర స్వామి, రంగనాయక స్వాముల ఆలయాలు, ఓదెల మండల కేంద్రంలోని మల్లన్న దేవస్థానం ఇలా పెద్దపల్లి జిల్లాలోని చారిత్రక సంపదకు కొత్త కళ వచ్చింది. కలెక్టర్ ముజామ్మిల్ఖాన్ చొరవతో జిల్లా సమీకృత కలెక్టరేట్ గోడలపై చిత్రమాలికగా రూపుదిద్దుకున్నది. అధికారులు, ప్రజలు కార్యాలయాల్లోకి రాగానే ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుండగా, కలెక్టర్పై ప్రశంసల జల్లు కురుస్తున్నది.
– పెద్దపల్లి, సెప్టెంబర్ 29(నమస్తే తెలంగాణ)