Geeta Vidyalayam | జగిత్యాల, సెప్టెంబర్ 28 : వారంతా 20 ఏళ్ల క్రితం జగిత్యాల పట్టణంలోని గీతా విద్యాలయం పాఠశాలలో విద్య నభ్యసించారు. ప్రస్తుతం దేశ, విదేశాలలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ జీవితములో స్థిరపడ్డారు. విద్యాబుద్ధులు నేర్పి, జీవితంలో తాము ఉన్నత స్థానంలో నిలవడానికి కారణమైన తల్లి లాంటి పాఠశాలకు తమ వంతుగా ఏదైనా సహాయం చేయాలని సంకల్పించారు. వారి ఆలోచనలకనుగునంగా పాఠశాల ఆవరణలో పూర్వ ప్రాథమిక విద్యార్థుల కోసం క్రీడా ప్రాంగణాన్ని తయారు చేసి చిన్నపిల్లలను పాఠశాలకు ఆకర్షించే విధంగా ఆకర్షణీయమైన ఆట వస్తువులు, క్రీడా సామాగ్రిని ఏర్పాటు చేశారు.
ఆదివారం గీతా విద్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 1994-95 ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమం సందర్భంగా పూర్వ ప్రధాన ఆచార్య న్యాలమడుగు శంకరయ్య చేతుల మీదుగా క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభింప చేశారు. ఈ సందర్భంగా పలువురు పూర్వ విద్యార్థులు తమ బాల్య స్మృతులను గుర్తు చేసుకొని క్రీడా ప్రాంగణంలో చిన్న పిల్లల మాదిరిగా ఆడు కున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ గీతా విద్యాలయం పాఠశాలలో తమకు విద్యతో పాటు క్రమశిక్షణ, అనుశాసనం దేశభక్తి లాంటి విషయాలను ఆచార్యులు బోధించడం వల్లే తాము జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగామని తెలిపారు. ముందు ముందు కూడా పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారాన్ని అందిస్తామన్నారు.
పాఠశాలకు బాలల క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటుచేసిన పూర్వ విద్యార్థులను పాఠశాల కమిటీ సభ్యులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నగర సంఘచాలక్ జిడిగే పురుషోత్తం, గీతా విద్యాలయం కమిటీ సభ్యులు లక్ష్మణరావు, అశోక్ రావు, మహిపాల్ రెడ్డి, అరుణ్ పాఠశాల ప్రధానాచార్య శివకుమార్, పూర్వ విద్యార్థులు పాక శ్రీనివాస్, వూట్కూరి రామకృష్ణారెడ్డి, బొడ్డుపల్లి శ్రీనివాస్, కందుకూరి శ్రీనివాస్, అనంత్, భాగ్యలక్ష్మి, షర్మిల, శ్రీలత, నక్కల రవీందర్ రెడ్డి, రేగొండ ప్రసాద్, పూర్వ ఆచార్యులు రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.