బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలకు అందని విధంగా దూసుకుపోతున్నారు. ఎక్కడ చూసినా జనం నీరాజనం పడుతున్నారు. ఒక పక్క నామినేషన్ల పర్వం ప్రారంభమైనప్పటికీ కొన్ని పార్టీలు ఇంకా తమ అభ్యర్థులను కూడా ప్రకటించని పరిస్థితుల్లో ఉండగా, బీఆర్ఎస్ అభ్యర్థులు నిత్యం జనంలోనే ఉంటూ వారి మన్ననలు పొందే ప్రయత్నంలో ఉన్నారు. జిల్లాలోని కరీంనగర్, చొప్పదండి, మానకొండూర్, హుజూరాబాద్తో పాటు హుస్నాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థులే కాకుండా వాళ్ల తరఫున కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు కూడా మద్దతు కూడగడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను, ఆ పార్టీ ఇచ్చిన మ్యానిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు.
– కరీంనగర్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ)
కరీంనగర్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో బీఆర్ఎస్ ప్రచారం ఊపందుకున్నది. ప్రత్యర్థి పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించడంతో పాటు బీ ఫాంలు ఇవ్వడంతో అభ్యర్థులు గ్రామ గ్రామాన, వాడ వాడనా ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుస్తూ దూసుకెళ్తున్నారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖల మంత్రి, బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ ఇప్పటికే అనేక చోట్ల ప్రచారం నిర్వహించారు. శనివారం కరీంనగర్ మండలంలోని చేగుర్తి, నల్లగుంటపల్లిలో ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ప్రజలు మంత్రికి బ్రహ్మ రథం పట్టారు. అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. ఇంటింటికీ వెళ్లి మంత్రి ఓట్లు అభ్యర్థించారు. అనంతరం కరీంనగర్లోని పద్మనాయక కల్యాణ మండపంలో భవన నిర్మాణ కార్మికులు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. సాయంత్రం నుంచి రాత్రి వరకు కరీంనగర్లోని పలు డివిజన్లలోనూ విస్తృత ప్రచారం నిర్వహించారు.
చొప్పదండి నియోజకవర్గంలో ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్ శనివారం చొప్పదండి పట్టణంలోని పలు డివిజన్లలో విస్తృతంగా ప్రచారం చేశారు. గంగాధర మండలం మధురానగర్లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ తనయుడు ప్రతీక్ రావు, ఎమ్మెల్యే తనయుడు దీక్షిత్ బీఆర్ఎస్ను గెలిపించాలని ప్రచారం చేశారు. మరోపక్క రామడుగు మండల కేంద్రంలో రవిశంకర్ సతీమణి దీవెన కూడా ఇంటింటా ప్రచారం నిర్వహించారు. సాయంత్రం చొప్పదండిలో ఎమ్మెల్యే రవిశంకర్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.
చిగురుమామిడి మండలంలోని నవాబుపేట, గాగిరెడ్డిపల్లి, బొల్లోనిపల్లి, బరిగెలపల్లి, గునుకుపల్లి, ఓగులాపూర్, ఇందుర్తి, లంబాడిపల్లి, సీతారాంపూర్ గ్రామాల్లో హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ ఉదయం నుంచి రాత్రి వరకు విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలికారు. ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చి మద్దతు తెలిపారు. సైదాపూర్ మండలంలోని అమ్మనగుర్తిలో సతీశ్కుమార్కు మద్దతుగా హన్మకొండ జడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ కూడా ఇంటింటా ప్రచారం చేశారు.
జమ్మికుంట మండలం నగురం, నాగారం, వావిలాల, పాపక్కపల్లి గ్రామాల్లో హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్రెడ్డి విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఆయా గ్రామాల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం హుజూరాబాద్ మండలంలోని శాలపల్లి-ఇందిరానగర్, చెల్పూర్, రాజాపల్లి గ్రామాల్లోనూ ప్రచారం చేశారు. ఆయన సతీమణి శాలినీరెడ్డి కూడా హుజూరాబాద్లోని పలు వార్డులు, వ్యాపార కూడళ్లలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. మానకొండూర్ ఎమ్మెల్యేగా రమసయి బాలకిషన్ను మరోసారి గెలిపించాలని కోరుతూ తిమ్మాపూర్, మానకొండూర్, శంకరపట్నం మండలాల్లోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.