ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లుపై బ్రాహ్మణ సమాజం ఆనందం వ్యక్తం చేస్తున్నది. స్వరాష్ట్రంలో తమకు గుర్తింపు లభిస్తున్నదంటూ సంతోషపడుతున్నది. హైదరాబాద్ విప్రహిత బ్రాహ్మణ సదనం ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ధర్మపరిరక్షకుడు, గొప్ప ఆధ్యాత్మిక వేత్త, గొప్ప దార్శనికుడు కేసీఆర్ అంటూ కొనియాడుతున్నది. నిరుపేద బ్రాహ్మణులను ఆదుకునేందుకు ఆయన అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శమని, ఆయన పేరు ఆచంద్రార్కం నిలిచిపోతుందని తమ ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయని దీవిస్తున్నది.
-కరీంనగర్, జూన్ 1 (నమస్తే తెలంగాణ)
కేసీఆర్ ప్రభుత్వమే ఎప్పటికీ ఉండాలి
బ్రాహ్మణులను ఆదరిస్తున్న సీఎం కేసీఆర్ చరిత్రను పునరావృతం చేస్తున్నరు. ఇలాంటి సత్యాలు ఒకప్పుడు చరిత్రలో చదివాం. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. బ్రాహ్మణ సమాజంలో కఠిన పేదరికాన్ని అనుభవిస్తున్న వాళ్లెందరో ఉన్నరు. ప్రభుత్వం అందిస్తున్న సేవలు వారికి ఎంతో ప్రయోజనం కలిగిస్తయ్. దీప, ధూప, నైవేద్యాల కింద అందిస్తున్న భృతి కోసం నెలనెలా ఎదురు చూసే కుటుంబాలు 93 శాతానికి పైనే ఉన్నయ్. ఉమ్మడి రాష్ట్రంలో చివరి ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి దీప, ధూప, నైవేద్యాలను రద్దు చేసినప్పుడు ఎంతో పోరాడి పునరుద్ధ్దరించుకున్నం. ఇప్పుడు కేసీఆర్కు విన్నవించుకోకున్నా అన్నీ చేసి పెడుతున్నరు. మేం ఎలా బతుకున్నామో ఆయన ప్రత్యక్షంగా చూస్తున్నరు గనుకనే ఇంత మంచి నిర్ణయాలు తీసుకుంటున్నరు. కేసీఆర్ ప్రభుత్వం ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నం. ఆశీస్సులు అందిస్తున్నం.
– ఏటూరి ఆంజనేయాచార్య, తెలంగాణ ధూప, దీప, నైవేద్య సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు
కరీంనగర్, జూన్ 1 (నమస్తే తెలంగాణ) : ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన అర్చక సమాజం క్రమంగా ప్రాభవాన్ని కోల్పోతూ వచ్చింది. వేదాలు ఘోషించిన చోట పేదరికంతో అల్లాడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతూ వచ్చింది. దేవాలయాల్లో ధూప, దీప, నైవేద్యాలు సమర్పించి ఆలనా పాలనా చూసిన అయ్యగార్ల ప్రాధాన్యత తగ్గిపోయింది. పురాతన కాలం నాటి దేవాలయాలు శిథిలమైపోతుంటే పట్టించుకోని నాటి ప్రభుత్వాలు అర్చకుల జీవనాన్ని దెబ్బతీశాయి. అర్చకత్వానికి ఆలయాలు కరువై బతుకుదెరువు కోల్పోతున్న బ్రాహ్మణులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు గొప్ప పథకాన్ని తెచ్చారు. ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యాల కోసం, ఆయా ఆలయాలపై ఆధారపడి జీవిస్తున్న ఆర్చకుల కోసం ఒక పథకాన్ని తెచ్చి వారికి జీవనోపాధి కల్పించారు. ధూప, దీప, నైవేద్యాలకు రూ.2 వేలు, అర్చకులకు రూ.4 వేల చొప్పున 2015 జనవరి 9 నుంచి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది.
తాజాగా, ఈ మొత్తాన్ని రూ.10 వేలకు పెంచుతూ సీఎం కేసీఆర్ ప్రకటన చేయడంతో అర్చకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మన సంస్కృతిని, సంప్రదాయాలకు పునరుజ్జీవం పోస్తున్న వేద పండితుల గౌరవ వేతనాన్ని రూ.2,500 నుంచి రూ.5 వేలకు పెంచారు. అంతే కాకుండా ఇప్పటి వరకు 75 ఏండ్లు ఉన్నవారికే ఈ గౌరవ వేతనం వర్తించేది. ఇపుడు వయోపరిమితిని 65 ఏండ్లకు తగ్గించారు. దీంతో ఎక్కువ మంది వేద పండితులకు ఈ గౌరవ వేతనంతో ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుంది. గతంలో వేద పాఠశాలలకు ఎప్పుడో ఒకప్పుడు వాటి స్థాయిని బట్టి రూ.50 వేలు, రూ.75 వేలు, రూ.లక్ష చొప్పున ఇచ్చేవారు. ఇప్పుడు ప్రతి వేద పాఠశాలకు ఏటా రూ.2 లక్షలు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడాన్ని కూడా అర్చకులు స్వాగతిస్తున్నారు. ఇది ఎంతో మంచి నిర్ణయమని హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్, వేములవాడ, రుద్రారం, తదితర చోట్ల ఉన్న వేద పాఠశాలలకు ప్రయోజనం చేకూరనున్నది.
విద్య, ఉపాధికి ప్రోత్సాహం
బ్రాహ్మణుల్లో చాలా మంది నిరుపేదలుగా జీవిస్తున్నారు. వీరి కోసం రాష్ట్ర ప్రభుత్వం 2017లో ఏర్పాటు చేసిన బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తుతో జిల్లాలో అనేక మంది నిరుపేద బ్రాహ్మణులకు ప్రయోజనం చేకూరుతున్నది. దేవాలయాల వద్ద దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం బ్రాహ్మణ ఎంపవర్మెంట్ స్కీం కింద గరిష్టంగా రూ.5 లక్షలు గ్రాంట్ అందిస్తున్నది. ఈ రకంగా ఉమ్మడి జిల్లాలో అనేక మందికి ఉపాధి లభిస్తున్నది. బ్రాహ్మణులు సొంతంగా వాహనాలు కొనుగోలు చేసుకుంటే సబ్సిడీని అందిస్తున్నది. బ్రాహ్మణుల పిల్లలు చదువుకునేందుకు విద్యా రుణాలు అందిస్తున్నది. విదేశాల్లో చదువుకునేందుకు ఓవర్సీస్ స్కాలర్షిప్స్ అందిస్తున్నది. బ్రాహ్మణ విద్యార్థుల కోసం సీఎం కేసీఆర్ తాజాగా, మరో వరాన్ని ప్రకటించారు. ఐఐఎం, ఐఐటీల్లో చదివే విద్యార్థులకు ఫీజ్రీయంబర్స్మెంట్ పథకాన్ని ప్రకటించారు. దీని వల్ల ఉన్నత చదువులు చదవాలనుకునే పేద బ్రాహ్మణుల పిల్లలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.
ఆయన సేవలు దేశమంతా విస్తరించాలి
ఇచ్చిన హామీలను గుర్తుంచుకొని నెరవేర్చడంలో సీఎం కేసీఆర్కు సాటి ఎవరూ లేరు. ఆయన లాంటి మనుషులు ఈ భూమిపై అరుదుగా ఉంటారు. లోక కల్యాణార్థం, లోక హితం కోసం నిత్యం ఆ భగవంతున్ని ప్రార్థించే బ్రాహ్మణుల సంక్షేమం గురించి ఆలోచించింది దేశంలో కేసీఆర్ ఒక్కరే. ధర్మ పరిరక్షణలో ఇదొక భాగం. రంగారెడ్డి జిల్లాలోని గోపన్పల్లిలో విప్రహిత బ్రాహ్మణ సదనాన్ని ప్రారంభించిన ఆయనకు బ్రాహ్మణుల తరుపున ధన్యవాదాలు. బ్రాహ్మణుల కోసం సదనం నిర్మించిన దాఖలాలు ప్రపంచంలోనే లేవు. 2003 గోదావరి పుష్కరాల సందర్భంలో ధర్మపురిలో కేసీఆర్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆకాంక్షిస్తూ హోమం నిర్వహించారు. ఆ సమయంలో “తెలంగాణ ప్రాపిరస్తు” అని ఆశీర్వదించాం. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామివారి కృప, కేసీఆర్ దీక్ష పట్టుదల వల్ల తెలంగాణ సిద్దించింది. అప్పటి నుంచి వివిధ సందర్భాల్లో ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి వారి కృపాకటాక్షాల వల్లనే తెలంగాణ రాష్ట్రం సిద్దించిందని చెప్పుకురావడం అనేది స్వామివారి పట్ల ఆయనకున్న భక్తికి నిదర్శనం. అనంతరం వచ్చిన 2015 పుష్కరాల విజయవంతానికి ధర్మపురికి అధికంగా నిధులు కేటాయించి ‘న భూతో’ అన్న రీతిలో పుష్కరాలను విజయవంతం చేశారు. అన్ని వర్గాల గురించి ఆలోచించే సీఎం కేసీఆర్ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామివారి కృపాకటాక్షాలతో ఆయురారోగ్యాలతో నిండునూరేళ్లు జీవించాలి. ఆయన సేవలు భారతదేశమంతటా విస్తరించేలా కరుణించాలని స్వామివారిని మనసారా కోరుకుంటున్నా.
-బొజ్జ రమేశ్ శర్మ, వేద పండితులు,
ధర్మపురి దేవస్థానం..
ఏ నాయకుడూ ఇలా ఆలోచించలేదు దేవాలయాల్లో ధూప, దీప నైవేద్యానికి గత ప్రభుత్వాలు రూ.2500 మాత్రమే చెల్లించేవి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.6వేలకు పెంచగా తాజాగా, దాన్ని రూ.10వేలకు పెంచారు. రూ.6 వేల ధూప, దీప నేవేద్యాల భృతితోనే నా కుటుంబాన్ని హాయిగా పోషించుకోవడంతో పాటు నా కూతురును సైతం ఉన్నతంగా చదివించుకుంటున్నా. సీఎం కేసీఆర్ బ్రాహ్మణులు పడుతున్న కష్టాలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం నిజంగా ఆనందంగా ఉంది. సీఎం కేసీఆర్ పథకాలు నాలాంటి పేద బ్రాహ్మణులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. సీఎం కేసీఆర్ లాగా ఏ నాయకుడు కూడా మా గురించి ఆలోచన చేయలేదు. ఆయన మేలు జీవితంలో మరువలేనిది.
-సంజీవ్రావు, భిక్షేశ్వర స్వామి దేవాలయం పూజారి, (మంథని)
పేద బ్రహ్మణులకు వెలుగు రేఖ
లోకా సమస్త సుఖినోభవంతు.. సర్వే జన సుఖినోభవంతు.. అంటూ కులం, మతం, జాతి అని తేడా లేకుండా సమస్త ప్రాణకోటి సుఖంగా ఉండాలని, సమాజ క్షేమం కోరే బ్రాహ్మణులను సీఎం కేసీఆర్ గుర్తించడం నిజంగా హర్షించ దగ్గ విషయం. గతంలో ఏ ముఖ్యమంత్రి, రాజకీయ నాయకుడు కూడా బ్రాహ్మణ సమాజం గురించి ఆలోచన చేయలేదు. కానీ, తెలంగాణ రథసారథి సీఎం కేసీఆర్ బ్రాహ్మణుల సేవలను గుర్తించి బీద బ్రాహ్మణుల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశ పెడుతున్నారు. వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందకు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు చైర్మన్ రమణాచారి అధ్యక్షతన ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేశారు. 75 ఏళ్ల వయసులో వయసులో కల్పించే పండిత సన్మానాన్ని 65 సంవత్సరాలకే కల్పిస్తున్నట్లు ప్రకటించారు. బ్రాహ్మణ నిరుద్యోగుల స్వయం ఉపాధి కోసం రూ.5 లక్షల రుణాలు మంజూరు చేస్తున్నారు. వీటి ద్వారా ఇప్పటికే 6500 మంది యువకులు లబ్ధి పొందారు. అంధకారంలో ఇబ్బందులు పడుతున్న బ్రహ్మణ పురోహితులకు సీఎం కేసీఆర్ ఒక వెలుగు రేఖగా మారారు.
-రామగుడు మారుతి, బ్రాహ్మణ పరిషత్ రాష్ట్ర కో-ఆర్డినేటర్, (మంథని)
కేసీఆర్ వల్లే సాధ్యమైంది
తెలంగాణ రాష్ట్రం రాకముందు నుంచి అర్చకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈక్రమంలో స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అర్చకులకు రూ.2500 నుంచి 6వేలు ధూపదీప నైవేద్యాల కింద అందేలా కృషి చేశారు. ఆయనే ఇప్పుడు న్న పరిస్థితులను గుర్తించి ఆ నిధులు రూ.10వేలకు పెంచారు. ఇది చాలా సంతోషించదగ్గ విషయం. బ్రాహ్మణులు కేసీఆర్ పైన పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయలేదు. ఆయన ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ, రాష్ర్టాన్ని భారతదేశంలో ప్రథమ స్థానంలో నిలుపుతారు. ప్రతి బ్రాహ్మణుడు హర్షించదగ్గ విషయం.
– శ్రీనివాస సుదర్శన్, అర్చకుడు
బ్రాహ్మణులపై ప్రత్యేక శ్రద్ధ
బ్రాహ్మణులపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. మాకు కావాల్సిందేమిటో గుర్తించి మరీ చేస్తున్నారు. దీప, ధూప, నైవేద్యాల గురించి అప్పటి టీఆర్ఎస్ మేనిఫెస్టోలో పెట్టించాం. అప్పుడు ఎంతో సంతోషంగా ఒప్పుకున్న కేసీఆర్ తూ.చ తప్పక అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే అర్చకులను ఆదుకోవడంగానీ, విప్రహిత బ్రాహ్మణ సదనం నిర్మాణంగానీ జరుగుతున్నాయి. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తుకు ఏడాదికి రూ.100 కోట్లు ఇస్తున్నారు. ఈ నిధులతో బ్రాహ్మణులకు అవసరమైన సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నారు. విప్రహిత సదనాన్ని ప్రారంభించినపుడు కూడా అనేక వరాలు ఇచ్చారు. ఎంతో సంతోషంగా ఉంది. ధూప, దీప, నైవేద్యాల భృతిని పెంచడం వల్ల ఎంతో మంది అర్చకులకు మేలు జరుగుతుంది. మాకు కావాల్సిన ఇంకా కొన్ని విషయాలను ఆయన దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం.
– జక్కాపురం నారాయణ స్వామి, అర్చక ఉద్యోగ వెల్ఫేర్ బోర్డు సభ్యులు
కేసీఆర్ గొప్ప దార్శనికుడు
సీఎం కేసీఆర్ గొప్ప దార్శనికుడు. స్వస్తి ‘ప్రజాభ్యఃపరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహిషా,:గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యమ్, లోకాసమస్తాత్ సుఖినోభవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథ్వి సస్యశాలిని, దేశాయం క్షోభ రహితో బ్రాహ్మణానంతు నిర్భయాః’ ఈ పై శ్లోకాన్ని యధార్థంగా అమలుపరిచే దిశలో కేసీఆర్ ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేస్తున్నది. కేసీఆర్ బ్రాహ్మణ పక్షపాతి. బ్రాహ్మణ సంక్షేమ కార్యక్రమంలో భాగంగా ధూప, దీప నైవేద్య పథకంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు సీఎం కేసీఆర్ వేతనాలు పెంచడం హర్షనీయం. విప్రహిత బ్రాహ్మణ సదనం ప్రారంభోత్సవ సందర్భంగా కేసీఆర్ బ్రాహ్మణ సంక్షేమంలో భాగంగా ఎన్నో వరాలు కురిపించారు. ముఖ్యంగా అనువంశిక అర్చక హక్కుల పునరుద్ధరణ విషయంలో సానుకూలంగా స్పందించి క్యాబినెట్తో చర్చ జరిపి పరిష్కరించే దిశగా కేసీఆర్ సభాముఖంగా చెప్పడం వేములవాడ అర్చక బ్రాహ్మణులందరికీ చాలా సంతోషదాయకం.
-ఉపాధ్యాయుల సాంబశివుడు. వేములవాడ అనువంశీక అర్చక సంఘం నాయకులు (వేములవాడ)
మా సంక్షేమాన్ని ఎవరూ పట్టించుకోలె
దేశంలో ఎక్కడా లేని విధంగా బ్రాహ్మణ సమాజానికి అండగా నిలిచిన ఒకే ఒక్కడు సీఎం కేసీఆర్. విప్రహిత బ్రహ్మణ సదన్ నిర్మించి మరో ఘన కీర్తిని సొంతం చేసుకున్నారు. దేశం స్వాతంత్య్రం సాధించిన ఇన్నేళ్లలో ఏ ఒక్క రాజకీయ పార్టీ బ్రాహ్మణుల సంక్షేమాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. ఇలాంటి తరుణంలో సీఎం కేసీఆర్ బ్రాహ్మణులను అక్కున చేర్చుకుని ఆదుకుంటున్నారు. సీఎం కేసీఆర్ మాపై చూపుతున్న ప్రేమ, ఆదరణకు రుణ పడి ఉంటాం.
-కలకుంట్ల నర్సింహమూర్తి, వేద పండితుడు, జిల్లా బ్రాహ్మణ సేవా వాహిని అధ్యక్షుడు, కోరుట్ల.
ఆచంద్రార్కం నిలిచిపోతుంది
ఆలయాల అభివృద్ధితో పాటు బ్రాహ్మణుల సంక్షేమంపై దృష్టి పెట్టిన సీఎం కేసీఆర్ పేరు ఆచంద్రార్కం నిలిచి ఉంటుంది. రాష్ట్రంలో ఎన్నో శక్తిపూరితమైన దేవాలయాలున్నా నాటి ప్రభుత్వాలు పట్టించుకోలేదు. వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్న తరుణంలో సీఎం కేసీఆర్ ఆలయాలను గొప్పగా తీర్చిదిద్దారు. ఇందుకు యాదాద్రి, ధర్మపురి క్షేత్రాల అభివృద్ధే ఉదాహరణ. మారుమూల గ్రామాల్లో ఉన్న దేవాలయాల్లో ధూపదీపం కరువైన స్థితినుంచి ఈ రోజు గొప్పగా పూజలు జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలు నిర్వహించే స్థాయికి ఎదిగాయి. ధర్మ పరిరక్షణలో భాగంగా దేవాలయాల అభివృద్ధితో బ్రాహ్మణుల సంక్షేమం గురించే ఆలోచించి దేవాలయాల విశిష్టతను ప్రపంచానికి చాటిచెబుతున్నారు. 2003 గోదావరి పుష్కరాల సందర్భంగా చతుర్వేద యాగం నిర్వహించిన కేసీఆర్ ధర్మపురిలో వేదపాఠశాలను నెలకొల్పాలని సవినయంగా కోరుతున్నాం. సమస్త దేవాతానుగ్రహ సిద్ధి కలగాలని కోరుకుంటూ ఆచంద్రార్కం వంశాభివృద్ధి ఆశీస్సులు.
-మధు మహదేవ్ శర్మ, ధార్మిక వేత్త, శ్రీవైదిక జ్యోతిష్య విద్యాపీఠం, ధర్మపురి