Siricilla | రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్, జూన్ 22: రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో చిన్న నిర్లక్ష్యం అధికార యంత్రాంగం పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. జిల్లా డిప్యూటీ డీఎంహెచ్వోగా పనిచేసిన డాక్టర్ రజిత బదిలీపై వెళ్లి వారం రోజులు గడిచినా, ఆమె పేరుతో ఉన్న నేమ్ప్లేట్ మాత్రం ఇంకా కార్యాలయ ద్వారంపై అలాగే దర్శనమిస్తోంది.
ఇదిలా ఉండగా, నూతన డిప్యూటీ డీఎంహెచ్వోగా డాక్టర్ ఏంజెల ఆల్ఫ్రెడ్ ఇప్పటికే బాధ్యతలు స్వీకరించి విధులు నిర్వహిస్తున్నారు. అయితే కలెక్టరేట్లోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో కార్యాలయ బయట ఉన్న బోర్డుపై మాత్రం పాత అధికారి పేరే కొనసాగుతుండటం సందర్శకులను అయోమయానికి గురిచేస్తోంది.
సాధారణంగా అధికారుల బదిలీలు జరిగిన వెంటనే కార్యాలయ రికార్డులు, నేమ్ప్లేట్లు, సమాచార బోర్డులు నవీకరించడం పరిపాలనా బాధ్యతగా భావిస్తారు. కానీ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో మాత్రం ఈ ప్రక్రియ నిర్లక్ష్యానికి గురైనట్లు కనిపిస్తోంది.
‘అధికారి మారినా.. గుర్తింపు మారలేదా..?’ అంటూ కార్యాలయానికి వచ్చే ప్రజలు, సిబ్బంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చిన్న విషయమే అయినప్పటికీ, ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార నిర్వహణ ఎంత నిర్లక్ష్యంగా ఉందో ఈ ఘటన అద్దం పడుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నూతన అధికారిణి పేరుతో నేమ్ప్లేట్ ఏర్పాటు చేసి, కార్యాలయ సమాచారాన్ని నవీకరించాలని ప్రజలు కోరుతున్నారు.