కరీంనగర్ : ఎంపీ బండి సంజయ్ మోకాళ్ల మీద యాత్ర చేసినా కూడా రాష్ట్రంలో బీజేపీ రెండు సీట్ల కంటే ఎక్కువ గెలువలదని కరీంనగర్ మేయర్ సునీల్ రావు అన్నారు. కరీంనగర్ నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన బీజేపీపై నిప్పులు చెరిగారు. ఎన్నికల్లో ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, నల్లధనాన్ని తీసుకువస్తామని చెప్పి ప్రజలను మోసగిస్తున్న పార్టీ బీజేపీ అని సునీల్ రావు విమర్శించారు. కరీంనగర్ నుంచి గత ఎంపీ వినోద్ కుమార్ త్రిబుల్ ఐటీ కోసం ప్రతిపాదిస్తే కర్ణాటకు వెళ్లి పోయినా ఎంపీ బండి సంజయ్ పట్టించుకోలేదని ఆరోపించారు.
జగిత్యాల టూ వరంగల్ జాతీయ రహదారి విషయంలో ఇప్పటివరకు ఒక్క అడుగు ముందుకు పడకపోవడం మీ వైఫల్యం కాదా అని ప్రశ్నించారు. ప్రగల్భాలు పలకడం తప్ప ప్రజల కోసం చేసింది ఏమీ లేదని విమర్శించారు. గత ఐదేళ్ల కాలంలో రాష్ట్ర తలసరి ఆదాయాన్ని రెండింతలు చేసింది టీఆర్ఎస్ పాలన కాదా అని నిలదీశారు.
వ్యవసాయం గురించి తెలియని వారు కూడా ఇప్పుడు వ్యవసాయం గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ రైతాంగం పండిస్తున్న పంటను కేంద్రం కొనకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేయాలని కుట్ర చేస్తోందని ఆరోపించారు.
రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులకు నిధులు తీసుకురా లేని దద్దమ్మలు ఈ బీజేపీ ఎంపీలని ఘాటుగా విమర్శించారు. అబద్ధాలు, మోసపూరిత మాటలను ప్రజలు ఎల్లకాలం నమ్మరని పేర్కొన్నారు.