మానకొండూర్, డిసెంబర్ 2: కేంద్రంలోని బీజేపీ సర్కారు కార్మికుల, కర్షకుల హక్కులను కాలరాస్తూ కార్పొరేట్ పెద్దలకు కొమ్ముకాస్తున్నదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి ధ్వజమెత్తారు. రాజ్యాంగబద్ధమైన సీబీఐ, ఈడీ. ఐటీలను రాజకీయ కక్ష సాధింపునకు వాడుకుంటున్నదని ఆరోపించారు. ఇలాంటి ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ఈ సర్కారును గద్దె దించేందుకు ‘బీజేపీ హఠావో..దేశ్కి బచావో’ నినాదం స్ఫూర్తితో ఉద్యమించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా మానకొండూర్లో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
బీజేపీ హాయాంలో దేశం లో మతోన్మాదం పెచ్చరిల్లుతున్నదని మండిపడ్డారు. పాలనను గాడికి వదిలి విద్వేషాలను రెచ్చగొట్టి పబ్బంగడుపుకుంటున్నదని దుయ్యబట్టారు. ఇలాంటి అప్రజాస్వామిక సర్కారుకు చరమగీతం పాడేందుకు పార్టీ శ్రేణులు పోరాటాలకు సిద్ధంకావాలని సూచించారు. రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనుగంటి కేదారి అధ్యక్షతన నిర్వహించిన ఈసమావేశంలో కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల కార్యదర్శులు మర్రి వెంకటస్వామి, గుంటి వేణు, మంద పవన్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బోయిని అశోక్, ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యులు టేకుమల్ల సమ్మయ్య, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి బామండ్ల యుగేంధర్ పాల్గొన్నారు.