Jagtial | జగిత్యాల, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ) : మొదలు ఏదో.. ఊడలు ఏవో తెలియనంతగా విస్తరించిన మహావృక్షం అది! సూర్య కిరణాలు సైతం భూమికి సోకనంత దట్టంగా పరుచుకున్న చెట్టు అది! ఒక్క ఊడ నుంచి మరో ఊడతో విస్తరిస్తూ.. ఏకంగా ఐదెకరాల స్థలాన్ని ఆవహించిందీ మహావృక్షరాజం కోరుట్ల మండలం పైడిమడుగు మర్రి! ఆ చెట్టు వయసు 800 ఏండ్లకు చేరిందని చెబుతున్నారు వృక్షశాస్త్రవేత్తలు! కాకతీయుల కాలం లో మొక్కగా ప్రస్థానాన్ని ప్రారంభించిన ఈ మర్రి, ఆసియా ఖండంలోనే అతిపెద్ద రెండో వృక్షరాజంగా ఎదిగింది! ఫైకస్ బెంగాలెన్సిస్గా చెప్పబడే ఈ చెట్టు, జగిత్యాల జిల్లాలో చారిత్రక ప్రాంతంతో పాటు విహార కేంద్రంగా పేరుగాంచింది.
పైడిమడుగుతో పాటు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ చెట్టును మర్రవ్వగా పిలుచుకుంటున్నారు. వందల ఏండ్ల చరిత్ర ఉన్న చెట్టు తమ గ్రామంలో ఉందని గర్వంగా చెప్పుకుంటున్నారు. మర్రిచెట్టుకు అమ్మతల్లి మహత్యం ఉన్నదని పైడిమడుగు వాసులు విశ్వసిస్తున్నారు. అందుకే మర్రిచెట్టుకు మరింత పవిత్రత చేకూర్చేందుకు మర్రవ్వ ఆలయం పేరిట, మర్రిచెట్టు మధ్యలో ఆలయం నిర్మించారు. అయితే, కొన్నేండ్ల నుంచి మర్రిచెట్టు ఉనికికి ప్రమాదకరంగా మారిపోయింది. కొన్నాళ్ల క్రితం జరిగిన అగ్నిప్రమాదం వల్ల మర్రిచెట్టులో చాలా భాగం కాలిపోయింది. దీనికి తోడు ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల కొంత చెట్టు ఊడలు, వేర్లు విరిగిపోయి, చెట్టు కూలిపోయింది.
చాలా మర్రి ఊడలు భూమిపై ఒరిగిపోయాయి. ఐదెకరాల్లో విస్తరించిన మర్రిచెట్టు, ప్రస్తుతం ఎకరన్నర విస్తీర్ణానికి కుచించుకుపోయింది. ప్రస్తుత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ ఎంపీగా బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో మర్రవ్వ చెట్టు పరిరక్షణ ఆల య సుందరీకరణ కోసం 1.82 కోట్లను తన నిధుల నుంచి మంజూరు చేశారు. అయితే, తర్వాత మర్రిచెట్టు పరిరక్షణను పట్టించుకునేవారు లేకుండా పోయారు. పర్యాటక శాఖ సిబ్బంది సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూనే వచ్చారు. గ్రామం నుంచి విదేశాలకు వెళ్లిన వా ళ్లు, ఎన్ఆర్ఐలు మర్రిచెట్టు పరిరక్షణ కోసం చందాలు వసూలు చేసి మరీ ప్రయత్నం చేస్తున్నారు. కనీసం ఇప్పుడు ఉన్న వృక్షాన్నైనా రక్షించాలని తాపత్రయపడుతున్నారు.
చరిత్రకు సజీవ సాక్ష్యం పైడిమడుగు మర్రి చెట్టు. ఫైకస్ బెంగాలెన్సిస్ శాస్త్రీయ నామం తో చెప్పబడే ఈ చెట్టుకు అనేక ప్రత్యేకతలున్నాయి. ఈ చెట్టు కాండంతోపాటు చెట్టుకు పుట్టే ఊడలు సైతం భూమి వైపునకు పెరిగి, భూమిలో కలిసిపోయి కాండంగా పెరిగిపోతాయి. వయసు పెరిగే కొద్ది పెరిగిన ఊడలు కాండాలుగా మారిపోయి చెట్టు విస్తరిస్తూ పోతూనే ఉంటుంది. వాతావరణ కాలు ష్యం, ఇతర ప్రమాదాలు లేని పక్షంలో ఈ వృక్షం వెయ్యి సంవత్సరాలకు పైగా జీవిస్తూనే ఉంటుంది.
అయితే, ఇటీవలి కాలంలో ఈ చెట్లు ప్రమాదంలో పడుతున్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలు, మెట్రోపాలిటన్ పట్టణాల్లో మర్రిచెట్లు దెబ్బతింటున్నాయి. వాతావరణ కాలుష్యంతోపాటు నీటి ఒత్తిడి, ఆకాశ ఆవరణాలు దెబ్బతినడం మూలం గా ఇవి క్రమంగా చనిపోతున్నాయి. పైడిమడుగులో కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రారంభం కావడంతో అది క్రమం గా కుచించుకుపోయే పరిస్థితికి చేరుకుంటుంది. దీన్ని నివారించాల్సిన బాధ్యత అందరిపై ఉన్నది.
– డాక్టర్ పడాల తిరుపతి, వృక్షశాస్త్ర నిపుణుడు