Nominations | కోల్ సిటీ, జనవరి 31: రామగుండం నగర పాలక సంస్థ అధికారుల తీరు మారడం లేదు. రాష్ట్రమంతటా ఒకలా ఉంటే రామగుండంలో అధికారుల తీరు మరోలా వ్యవహరిస్తున్నారని ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి. సాధారణ రోజుల మాదిరిగానే ఎన్నికల వేళ సైతం నిర్లక్ష్యం వీడటం లేదని పలువురు రాజకీయ పార్టీల అభ్యర్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
రామగుండం నగర పాలక సంస్థకు సంబంధించి నామినేషన్ల గడువు శుక్రవారం సాయంత్రం 5 గం.లతో ముగిసింది. కానీ శనివారం రాత్రి వరకు కూడా నామినేషన్లకు సంబంధించి ఏలాంటి సమాచారం ప్రకటించలేదు. నగరంలోని 60 డివిజన్లలో 706 నామినేషన్లు దాఖలు కాగా, డివిజన్ల వారీగా ఏఏ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారన్న కనీస సమాచారం కూడా శనివారం రాత్రి వరకు అధికారుల వద్ద లేదని చెప్పడం గమనార్హం. రామగుండం నగర పాలక పరిధిలో ఎక్కడికక్కడే 8 నామినేషన్ స్వీకరణ కేంద్రాలు ఏర్పాటు చేయగా 30 మంది రిటర్నింగ్ అధికారులకు బాధ్యతలు అప్పగించారు. ఐనప్పటికీ ఎన్నికలకు సంబంధించి కనీస సమాచారం ఇవ్వడంలో అధికారులు జాప్యం చేస్తుండటం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి.
శనివారం రాత్రి వరకు సైతం పోటీలలో ఉన్న అభ్యర్థులకు గానీ, మీడియాకు గానీ ఏలాంటి సమాచారం ఇవ్వలేదు. నామినేషన్ల వివరాలకు సంబంధించి అధికారులకు ఫోన్లు చేస్తే ఎత్తడం లేదని పలువురు బాహాటంగా ఆరోపిస్తున్నారు. మీడియా ప్రతినిధుల ఫోన్లకు కూడా స్పందించకపోవడం గమనార్హం. శనివారం నామినేషన్ల పరిశీలన ప్రక్రియకు సంబంధించి కూడా సమాచారం ఇవ్వడంలో తాత్సారం చేయడం విమర్శలకు తావిచ్చింది. ఇప్పటికైనా కలెక్టర్, ప్రత్యేక అధికారి జోక్యం చేసుకొని తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.