జగిత్యాల, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ యేడాది మార్చిలో అసెంబ్లీ వేదికగా ఉద్యోగాల భర్తీపై సవివరమైన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెచ్చుకున్న తెలంగాణలో తొలి ఎనిమిదేళ్ల వ్యవధిలో రాష్ట్ర ప్రభుత్వం 1.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, త్వరలోనే మరో 80 వేలకు పైచిలుకు ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించిన విషయం విదితమే. కరోనాతోపాటు రాష్ట్ర ఏర్పాటు అనంతరం స్థానిక ఉద్యోగాలు స్థానికులకే దక్కాలన్న ఉద్దేశంతో తీసుకువచ్చిన జోనల్ సిస్టం అమల్లో జరిగిన జాప్యం వల్ల ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వలేకపోయామని సీఎం చెప్పారు.
త్వరలోనే కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణతోపాటు ప్రభుత్వోద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ఈ ప్రకటనకు అనుగుణంగా మార్చి నుంచి ఇప్పటి వరకు దాదాపు 40 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లను ప్రభుత్వం జారీ చేసింది. గ్రూప్-1తో పాటు యూనిఫాం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయడంతో పాటు, ప్రిలిమినరీ పరీక్షలు పూర్తి చేసి, మలిదశ పరీక్షలకు ఏర్పాట్లు చేస్తున్నది. ఇక పంచాయతీరాజ్, మున్సిపల్, విద్యుత్ శాఖల్లో ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి సైతం ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చింది. తాజాగా 1300ల జూనియర్ లెక్చరర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జారీ చేసింది.
ఈ తరుణంలో యువత సైతం ఉద్యోగ సాధన కోసం అదే స్థాయిలో సన్నద్ధమవుతున్నది. ఇప్పటికే ప్రభుత్వం జగిత్యాలతోపాటు సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లా కేంద్రాల్లో బీసీ, ఎస్సీ స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేసి నిపుణులైన శిక్షకులతో ఉద్యోగార్థులకు శిక్షణ ఇప్పించింది. ఇక మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు తమతమ నియోజకవర్గ కేంద్రాల్లో గ్రూప్-1తో పాటు కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులకు ప్రిపేరయ్యే విద్యార్థులకు దాదాపు మూడు నుంచి నాలుగు నెలల పాటు శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసి, ప్రిలిమినరీ పరీక్షలకు సన్నద్ధం చేసిన విషయం తెలిసిందే.
ఉదయం నుంచి రాత్రి వరకు గ్రంథాలయాల్లోనే..
ప్రిలిమినరీ పరీక్షలు ముగిసి, మెయిన్ పరీక్షలకు అర్హుల జాబితా సిద్ధమవుతుండడం, మరో వైపు కొత్త నోటిఫికేషన్లు జారీ అవుతుండడంతో జగిత్యాలతోపాటు పలు పట్టణాల్లో యువత ఉదయం నుంచి రాత్రి వరకు గ్రంథాలయాల్లోనే గడుపుతున్నారు. అందులో గ్రంథాలయ సంస్థ చైర్మన్లు, కార్యదర్శులు ఉద్యోగార్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్తోపాటు, ఇతర రెఫరింగ్ బుక్స్, అట్లాస్, మ్యాపింగ్ పాయింట్స్, కుర్చీలు, బల్లలను అందుబాటులో ఉంచారు. జగిత్యాల గ్రంథాలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు 70 మంది పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు వస్తున్నారు. ఉదయం 9 గంటల వరకే చేరుకుని మధ్యాహ్నం ఒకటి, రెండు గంటల వరకు ప్రిపేర్ అవుతున్నారు. సమయం వృథా కాకుండా అక్కడే మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. రాత్రి 8 గంటల వరకు అక్కడే పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. జగిత్యాల గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ గొల్లపల్లి చంద్రశేఖర్గౌడ్ విద్యార్థుల కోసం కుర్చీలు, బెంచీలు, మంచినీటి వసతి సౌకర్యం కల్పించడంతో పాటు, కొన్ని జర్నల్స్ను సైతం అందు బాటులో ఉంచారు.
టైం వేస్ట్ కావద్దని
నేను డిగ్రీ పూర్తి చేసిన. ఇంతలోనే మన గవర్నమెంట్ జాబ్స్కు నోటిఫికేషన్ ఇచ్చింది. జాబ్ సాధించాలంటే కోచింగ్ తీసుకుందామని అనుకున్న. అయితే కోచింగ్ కోసం హైదరాబాద్, కరీంనగర్ వంటి దూరప్రాంతాలకు వెళ్లాల్సి రావడం ఇబ్బందిగా ఉండేది. దీనికి తోడు ప్రైవేట్ కోచింగ్ కేంద్రాలకు డబ్బులు చెల్లించే స్థోమత లేదు. ఇదే టైమ్లో జగిత్యాలలో బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ ఏర్పాటు చేసిన్రు. ఇందులో మాకు మంచి అనుభవం కలిగిన ఫ్యాకల్టీ శిక్షణ ఇచ్చిన్రు. స్టడీ మెటీరియల్ కూడా ఇచ్చిన్రు. గ్రూప్-1 ప్రిలిమ్స్లో అర్హత సాధించిన. మెయిన్స్కు ఎంపికవుతానన్న నమ్మకం ఉన్నది. ప్రస్తుతం మెయిన్స్తోపాటు ఇతర గ్రూప్స్కు సంబంధించిన సెలబస్ను లైబ్రరీలో చదువుతున్న. మా విలేజ్ నుంచి ఎర్లీ మార్నింగే వస్తున్న. వచ్చేటప్పుడే మధ్యాహ్నం లంచ్ బాక్స్ తెచ్చుకుంటున్న. నేనే కాదు, దాదాపు 40 మంది వరకు వేరే విలేజ్ల నుంచి వస్తూ బాక్స్లు తెచ్చుకుని ఇక్కడే తింటున్నరు. భోజనానికి ఇంటికి వెళ్లడం, తిరిగి రావడం ఇబ్బందిగా ఉంటుంది. టైం వేస్ట్ అవుతుంది. అందుకే లంచ్ తెచ్చుకొని తింటున్నం. ఇక్కడే నైట్ వరకు ప్రిపేర్ అవుతున్నం.
– ఇట్టె మల్లేశ్, బీఎస్సీ (గుట్టలపల్లె)
కొలువుల సాధన కోసం వచ్చాం
‘సార్.. మమ్మల్ని చూసి కూలీకి వచ్చి, మధ్యలో సద్ది తింటున్నామని అనుకోకండి. మేము కూలీ పనికి రాలేదు. సర్కార్ కొలువు సాధించడానికి ఇక్కడికి వచ్చాం’ అని చెబుతున్నాడు సారంగాపూర్కు చెందిన మాలోతు చంద్రశేఖర్. బీటెక్ పూర్తి చేసిన ఆ యువకుడు గ్రూప్-1తోపాటు ఇంజినీరింగ్ శాఖల్లో ఇచ్చిన ఏఈఈ పోస్టు కోసం ప్రిపేరవుతున్నాడు. గురువారం మధ్యాహ్నం ‘నమస్తే తెలంగాణ’ గ్రంథాలయానికి వెళ్లిన సమయంలో అక్కడే ఆరుబయట కూర్చొని కొందరు యువకులు టిఫిన్ బాక్స్లు ఓపెన్ చేసి భోజనం చేస్తుండడం కనిపించింది. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ.. సర్కారు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నదని, యువత సమయం వృథా చేసుకోకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నాడు. దాదాపు మూడున్నర నెలలుగా ప్రిపేర్ అవుతున్నామని, ఎస్సీ స్టడీ సర్కిల్లో శిక్షణ పొందామని చెబుతున్నాడు.
సీరియస్గా సిద్ధమవుతున్న
ఒకేసారి ఇన్నివేల జాబ్స్ భర్తీ చేసేందుకు సిద్ధమైన సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి థ్యాంక్స్ చెబుతున్న. గతంలో ఏ ప్రభుత్వం ఇన్ని జాబ్స్ ఒకేసారి భర్తీ చేయలేదు. గ్రూప్-1 నుంచి మొదలు కొని అన్నిరకాల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నది. ఇది యువతకు సువర్ణావకాశం. ఇప్పుడు జారవిడిస్తే భవిష్యత్తులో మరోసారి ఇలాంటి అవకాశం రాదు. అందుకే గట్టిగా చదువుతున్నం. లైబ్రరీలోనే పొద్దంతా గడుస్తున్నది. జగిత్యాల లైబ్రరీలో 70 మంది వరకు సీరియస్గా ప్రిపేర్ అవుతున్నరు. ఇక్కడ ఉన్న వాతావరణం చూస్తుంటే ఈసారి యువత తమ లక్ష్యాన్ని సాధించి తీరుతుందని అనిపిస్తున్నది.
– రజనీకాంత్, బీఎస్సీ(బీజడ్సీ), హన్మాజీపేట
మూణ్నెళ్ల నుంచి ప్రిపేరవుతున్నం
జగిత్యాల లైబ్రరీ ఆవరణలో మూణ్నెళ్ల నుంచి ప్రిపేరవుతున్నం. మా ఊరి నుంచి రోజూ మార్నింగ్ వస్తున్నం. ఇక్కడ సౌకర్యాలు బాగున్నయి. ఇక్కడే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఉండి ప్రిపేరవుతున్నం. స్టడీ మెటిరియల్ అందుబాటులో ఉన్నది. బీసీ, ఎస్సీ స్టడీ సర్కిల్స్తోపాటు ప్రజాప్రతినిధులు ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరాల్లో ఇచ్చిన పోటీ పరీక్షల సిలబస్కు సంబంధించిన స్టడీ మెటిరియల్ ఉన్నది. గవర్నమెంట్ జాబ్ సాధించడానికి ఇదే మంచి అవకాశం. మాకు తెలిసి ఇన్ని ఉద్యోగాలు గతంలో ఎప్పుడూ పడలేదు. ఈసారి ఎలాగైనా జాబ్ సాధిస్తామన్న నమ్మకమైతే ఏర్పడింది. ప్రిపరేషన్కు అవకాశం కల్పించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ సార్కు, గ్రంథాలయ సంస్థకు థ్యాంక్స్.
– బొమ్మకంటి శ్రీకాంత్, బీకామ్ (జాబితాపూర్)