ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అన్ని ఏర్పాట్లు
పేపర్-1కు 136, పేపర్-2కు 133 పరీక్షా కేంద్రాలు
పేపర్-1కు 32,114. పేపర్-2కు 30, 690 మంది అభ్యర్థులు
అరగంట ముందే హాల్లోకి అనుమతి
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్)కు అంతా సిద్ధమైంది. ఈ సారి పేపర్-1 రాసేందుకు బీఈడీ పూర్తి చేసిన వారికి కూడా అవకాశం ఇవ్వడంతో దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగింది. త్వరలోనే టీచర్ల భర్తీకి సర్కారు నోటిఫికేషన్ విడుదల చేయనున్న నేపథ్యంలో అభ్యర్థుల మధ్య పోటీ పెరిగింది. ఉమ్మడి జిల్లాలో పేపర్-1కు 32,114 మందికి 136 కేంద్రాల్లో, పేపర్-2 కోసం 30, 690 మందికి 133 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5 వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు.
కరీంనగర్ (నమస్తే తెలంగాణ)/ జగిత్యాల కలెక్టరేట్/సిరిసిల్ల కలెక్టరేట్/తెలంగాణచౌక్ (సిరిసిల్ల) జూన్ 10: ఉమ్మడి జిల్లాలో టెట్కు అధికార యంత్రాంగం అంతా సిద్ధం చేసింది. జగిత్యాల జిల్లాలో పేపర్-1కు 36 సెంటర్లను ఏర్పాటు చేయగా 8,334 మంది, పేపర్-2కు 39 సెంటర్లను ఏర్పాటు చేయగా 9,356 మంది, రాజన్నసిరిసిల్ల జిల్లాలో 29సెంటర్లలో పేపర్-1కు 6,844, పేపర్-2కు 5,941 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతారు. పరీక్షకు అరగంట ముం దు హాల్లోకి అనుమతిస్తున్నారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు.
అధికసంఖ్యలో దరఖాస్తులు
‘టెట్-2022’లో బీఈడీ వారికి ఫస్ట్ పేపర్ రాసేందుకు అవకాశం కల్పించడంతో దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో తీవ్ర పోటీ నెలకొన్నది. గతంలో అరకొర మార్కులతో అర్హత సాధించినవారు ప్రస్తుతం డీఎస్సీలో వెయిటేజ్ పెంచుకునేందుకు మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కొత్తగా బీఈడీ పూర్తి చేసిన వారు ఒకేసారి రెండు పేపర్లు రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు.
కరీంనగర్లోనే అత్యధికం
టెట్ నిర్వహణకు అధికారులు కరీంనగర్లోనే అధిక సంఖ్యలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. నగరం చుట్టు పక్కల ఉన్న కొత్తపల్లి, తిమ్మాపూర్ మండలాల్లోని విద్యా సంస్థల్లో కూడా సెంటర్లను ఏర్పాటు చేశారు. కరీంనగర్లోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో పేపర్-1 కోసం 43, పేపర్-2 కోసం మరో 43 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్క జిల్లా కేంద్రంలోనే 10 వేల మందికిపైగా అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. ఆ తర్వాత తిమ్మాపూర్, కొత్తపల్లి మండలాల్లో ఎక్కువ మంది అభ్యర్థులు పరీక్షలు రాయబోతున్నారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన 43 కేంద్రాల్లో 10,320 మంది అభ్యర్థులు పేపర్-1 మధ్యాహ్నం నిర్వహించే పేపర్-2 కోసం మరో 10,320 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. కొత్తపల్లి మండలంలో ఏర్పాటు చేసిన 6 కేంద్రాల్లో పేపర్-1కు 1,440, పేపర్-2కు మరో 1,440 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. తిమ్మాపూర్లో ఏర్పాటు చేసిన 13 కేంద్రాల్లో పేపర్-1 కోసం 3,120, పేపర్-2 కోసం మరో 3,120 మంది హాజరుకానున్నారు. హుజూరాబాద్లో పేపర్-1 కోసం 5 కేంద్రాలు ఏర్పాటు చేయగా 1,200 మంది, పేపర్-2 కోసం 2 కేంద్రాలు ఏర్పాటు చేయగా 469 మంది మాత్రమే పరీక్షలకు హాజరు కానున్నారు. జమ్మికుంటలో పేపర్-1 కోసం 4 కేంద్రాలు ఏర్పాటు చేయగా 856 మంది పరీక్షలకు హాజరు కానున్నారు. పేపర్-2 కోసం ఒక కేంద్రం ఏర్పాటు చేయగా 44 మంది మాత్రమే పరీక్షలు రాయబోతున్నారు.
పకడ్బందీ ఏర్పాట్లు
టెట్ పరీక్షలకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధిస్తున్నారు. సెంటర్ల చుట్టూ 200 మీటర్లలోపు నలుగురు లేదా అంతకన్నా ఎక్కువ మంది వ్యక్తులు, ఊరేగింపులు, సౌండ్ సిస్టమ్స్ను నిషేధిస్తూ కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశాల మేరకు తహసీల్దార్లు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే పరీక్షా కేంద్రాలకు 200 మీటర్ల దూరంలో ఉన్న జిరాక్స్ సెంటర్లను కూడా మూసివేయిస్తున్నారు.
హాల్ టికెట్లో తప్పులు ఉంటే..
టెట్ దరఖాస్తుల్లో తప్పుల సవరణకు అధికారులు అవకాశం ఇచ్చారు. అయితే కొందరు రెండోసారి దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుదారులందరికీ హాల్ టికెట్లు మంజూరు చేసినట్లు తెలుస్తున్నది. దరఖాస్తు సమయంలో పేరు, తండ్రి పేరు, తల్లి పేరు, పుట్టిన తేదీ, జెండర్, డిసెబులిటీ వంటి వివరాలు తప్పుగా ఉన్నట్లయితే పరీక్షాకేంద్రంలో నామినల్ రోల్ కమ్ ఫొటో ఐడెంటిటీ ఫారం ద్వారా సవరణకు అవకాశం ఇచ్చారు. ఏదైనా టెక్నికల్ సమస్య వలన ఫొటో, సంతకం రానివారు లేటెస్టు ఫొటోను అతికించి ఆధార్కార్డు జతచేసి గెజిటెడ్ అధికారితో అటెస్టేషన్ చేయించుకుని సంబంధిత పత్రాలను జిల్లా విద్యాధికారికి అందించాలి.
ఈ సూచనలు పాటించండి