కార్పొరేషన్, ఫిబ్రవరి 3: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్కుమార్ కేంద్ర ప్రభుత్వం నుంచి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని మాజీ మేయర్, కార్పొరేటర్ సర్దార్ రవీందర్ సింగ్ సవాల్ విసిరారు. నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ కేంద్ర బడ్జెట్పై విమర్శలు చేస్తే బీజేపీ రాష్ట్ర నాయకులు పరేషాన్ అవుతున్నారని ఎద్దేవా చేశారు. బడ్జెట్లో ఎక్కడా కూడ పేదలు, బడుగు, బలహీన వర్గాలు, తెలంగాణ రాష్ర్టానికి న్యాయం జరుగలేదన్నారు. కేంద్రం రాష్ర్టానికి మొండి చేయి చూపితే బండి సంజయ్ ఎందుకు మాట్లాడడం లేదన్నారు. కేంద్ర బడ్జెట్లో పేదల కోసం ఒక్క సంక్షేమ పథకం అయినా ఉందా అని ప్రశ్నించారు.? టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి విషయంపై పూర్తిస్థాయిలో చర్చ జరగాలని కోరుకుంటే బీజేపీ నాయకులు మాత్రం రచ్చ చేయడమే నేర్చుకున్నారని విమర్శించారు. బండి సంజయ్ తన పదవిని కాపాడుకోవడానికే దీక్షల పేరుతో డ్రామాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. భీం దీక్ష పేరుతో బీజేపీ ప్రచురించిన పోస్టర్లపై ఆ పార్టీకి చెందిన గిరిజన, దళిత ఎంపీ ఫొటో ఎందుకు పెట్టలేదని నిలదీశారు. దీనిని బట్టి బీజేపీ నాయకులకు దళిత, గిరిజనులపై ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుందన్నారు. బండి సంజయ్కి రాజ్యాంగంలోని ఏ ఒక్క ఆర్టికల్ పైన అయినా చర్చించే దమ్ము ఉందా అని ప్రశ్నించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. బండి సంజయ్కి దమ్ముంటే రాష్ట్ర, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు గుంజపడుగు హరిప్రసాద్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.