గ్రూప్స్తోపాటు ఇతర పోస్టులకు ఉచిత శిక్షణ
ఉద్యోగ, నైపుణ్యాభివృద్ధిపై తర్ఫీదు
దరఖాస్తులు ఆహ్వానిస్తున్న ఎస్సీ, బీసీ స్టడీ సర్కిళ్లు
ఈ నెల 16 వరకే గడువు
ఎంపికైన వారికి ఉపకార వేతనం
ఉమ్మడి జిల్లా ఉద్యోగార్థులకు సదవకాశం
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్న నేపథ్యంలో ఎస్సీ, బీసీ స్టడీ సర్కిళ్లు ఉచిత శిక్షణకు సిద్ధమవుతున్నాయి. ఎస్టీ అభ్యర్థులకు సైతం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనుండగా, స్టడీ సర్కిళ్ల ద్వారా ఉచిత శిక్షణకు ఎంపికైన నిరుద్యోగులకు ఉపకార వేతనం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రైవేట్ శిక్షణ కేంద్రాలకు వెళ్ల లేక, నిరాశకు లోనయ్యే ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉద్యోగార్థులకు ప్రభుత్వం ఈ అవకాశాన్ని కల్పించింది. ఈ స్టడీ సర్కిళ్లు ఇప్పటికే వాట్సాప్, టెలిగ్రాం యాప్ల ద్వారా ఉద్యోగార్థులకు శిక్షణ ఇస్తుండగా, ప్రభుత్వ ఆదేశాలతో ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలని నిర్ణయించి నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాయి.
కరీంనగర్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కొలువుల జాతరకు త్వరలో తెరలేవనుండడంతో నిరుపేద నిరుద్యోగ అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేందుకు ఎస్సీ, బీసీ స్టడీ సర్కిళ్లు రెడీ అవుతున్నాయి. ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాయి. ఎంపికైన వారికి ప్రభుత్వం ఉపకార వేతనం అందించనుండగా, ఉద్యోగార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
బీసీ స్టడీ సర్కిల్ పరిధిలో..
రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే బీసీ స్టడీ సర్కిల్ను ఇటీవలనే మంత్రులు కేటీ రామారావు, గంగుల కమలాకర్ కరీంనగర్లో ప్రారంభించారు. రాష్ట్రంలోనే అత్యాధునిక సదుపాయాలతో ఈ స్టడీ సర్కిల్ను నిర్మించారు. డిజిటల్ తరగతులు నిర్వహించే సదుపాయాలు ఈ కేంద్రంలో ఉన్నాయి. ఇందులో ఇప్పుడు గ్రూప్-1, 2, 3, 4తో పాటు ఎస్ఐ, పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం హాజరయ్యే నిరుద్యోగ అభ్యర్థులకు ఉపకార వేతనంతో కూడిన ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ మంతెన రవికుమార్ తెలిపారు. ఇందుకు WEBSITE:http//tsbc study circles. cgg.gov.inలో ఈనెల 16న ఉదయం 10 గంటల లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, అదే రోజు ఉదయం 11 గంటల నుంచి ఆన్లైన్ పరీక్ష నిర్వహించి, మెరిట్ ప్రకారం అభ్యర్థులను శిక్షణకు ఎంపిక చేస్తామని డైరెక్టర్ వెల్లడించారు. ఎంపికైన గ్రూప్-1 అభ్యర్థులకు రూ.5 వేల ఉపకార వేతనం ఇస్తూ ఆరు నెలల పాటు ఉచిత శిక్షణ ఇస్తామని, మిగతా పోస్టుల అభ్యర్థులకు రూ.2 వేల ఉపకార వేతనంతోపాటు 3 నెలల ఉచిత శిక్షణ ఇస్తామని డైరెక్టర్ రవికుమార్ తెలిపారు. ఆసక్తి గల ఉమ్మడి జిల్లా అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. మరిన్ని వివరాల కోసం 0878-2268686 ఫోన్ నంబర్లోగానీ, పని వేళల్లో బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలోగాని సంప్రదించాలని కోరారు..
ఎస్సీ స్టడీ సర్కిల్ పరిధిలో..
అంబేద్కర్ స్టడీ మెమోరియల్ ద్వారా ఎస్సీ నిరుద్యోగ అభ్యర్థులకు శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. కలెక్టర్ల మార్గదర్శనంలో ఎస్సీ అభివృద్ధి శాఖ ఈ ఉచిత శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. టీఎస్పీఎస్సీ నిర్వహించే గ్రూప్-1, 2, 3, 4 పరీక్షల కోసం నాన్ రెసిడెన్షియల్ విధానంలో శిక్షణ ఇస్తున్నట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ బండ శ్రీనివాస్ తెలిపారు. ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులకు రెసిడెన్షియల్ విధానంలో 2 నెలల పాటు శిక్షణ ఇస్తున్నామని వెల్లడించారు. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండి టీఎస్పీఎస్సీ, పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు నియమ నిబంధనల ప్రకారం అర్హులైన ఎస్సీ అభ్యర్థులు ఈ ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పోలీసు కానిస్టేబుల్కు విద్యార్హత ఇంటర్మీడియట్ సరిపోతుంది. కుటుంబ వార్షిక ఆదాయం రూ.3 లక్షలకు మించరాదు. తహసీల్దార్ ధ్రువీకరించిన కులం, ఆదా యం సర్టిఫికెట్లు ఉండాలి. వీరు http//ts stu dy circle.co.in అనే వెట్సైట్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలని, గ్రూప్స్కయితే అభ్యర్థుల డిగ్రీ, కానిస్టేబుల్ పోస్టులకైతే ఇంటర్ మార్కుల ఆధారంగా మెరిట్ అభ్యర్థులను ఎంపిక చేస్తామని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. గ్రూప్స్ కోసం సబ్జెక్ట్ వారీగా నిష్ణాతులైన బోధకుల ద్వారా తరగతుల నిర్వహణతోపాటు రూ.1,500 విలువైన స్టడీ మెటీరియల్ ఇవ్వనున్నట్లు చెప్పారు. అలాగే, గ్రూప్స్ శిక్షణకు ఎంపికైన అభ్యర్థులకు భోజన ఖర్చుల కింద రోజుకు రూ.75 చొప్పున నెలకు రూ. 2,250 వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తామని తెలిపారు. పోలీసు ఉద్యోగ శిక్షణకు ఎంపికైన వారికి భోజనం, వసతి సౌకర్యం కల్పిస్తామన్నారు. అన్ని రకాల శిక్షణకు సంబంధించి ఒక్కో బ్యాచ్కి 100 మందిని ఎంపిక చేస్తామని, ఇలా రెండు బ్యాచ్లు చేసి శిక్షణ ఇస్తామని డైరెక్టర్ వివరించారు. ఈ నెల 7 నుంచి ప్రారంభమైన దరఖాస్తులు 12 వరకు స్వీకరిస్తున్నారు. 13న మెరిట్ లిస్ట్ విడుదల చేస్తారు. 16న సర్టిఫికెట్లు పరిశీలిస్తారు. 18 నుంచి తరగతులు ప్రారంభిస్తారు.
ఎస్టీ అభ్యర్థులకు కూడా..
ఎస్టీ అభ్యర్థులకు గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యం లో శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 100 మందికి ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఇటీవల కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు https//studycircle.cgg. gov.in/ tstw అనే వెబ్సైట్లో ఈనెల 4 నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈనెల 11న సాయంత్రం 5 గంటల వరకు ఈ దరఖాస్తులు స్వీకరించారు. గ్రూప్-1నుంచి 4వరకు కనీస విద్యార్హత డిగ్రీ ఉత్తీర్ణత పొంది ఉండి 18 నుంచి 47 సంవత్సరాలలోపు వయసు కలిగి ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.2 లక్షలలోపు ఉండాలి. వేరే ఇతర ప్రభుత్వ శిక్షణ సంస్థల్లో శిక్షణ పొందుతున్న వారు, ఉద్యోగం చేస్తూ ఇతర కోర్సుల్లో ఉన్నవారు అర్హులు కారు. శిక్షణ తరగతులను వచ్చే నెల 1 నుంచి కరీంనగర్ జిల్లా కేంద్రంలో ప్రారంభిస్తారు.