‘మా రాష్ట్రంల ఇట్ల పనులు ఉండయి. ఉన్నా కూలి సుతం సరిగ్గ గిట్టుబాటుకాదు. పొద్దంత పనిచేసినా రూ. 200 రావు. ఇక్కడ పనులూ, దానికి తగ్గ కూలి ఇస్తరు. అందుకనే ఇక్కడ పనిచేసుకుంటున్నం. దీనికితోడు ఇక్కడి గవర్నమెంట్ అనేక మంచి పథకాలు తెచ్చి పేదల బతుకులు మారుస్తంది. ఎవరికీ ఏ లోటు లేకుండా చూస్తంది. మేం ఎక్కడ పనికి వెళ్లినా అక్కడి ప్రజల్లో ఆనందమే తప్ప బాధ కనిపించడం లేదు. మా దగ్గర ఇసోంటి సర్కారు ఉంటే మాకీ వేదన ఉండేది కాదు. ఇలాంటి ప్రభుత్వమే మాకూ కావాలి. కేసీఆర్ సార్ పెట్టిన బీఆర్ఎస్ పార్టీని స్వాగతిస్తున్నం. మా దగ్గర అధికారంలోకి రావాలని కోరుకుంటున్నం’ అంటూ తమిళనాడుకు చెందిన తాపీ కార్మికులు ముక్తకంఠంతో చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఆలయాల నిర్మాణ పనులు చేసేందుకు వచ్చి చేతి నిండా పనిచేసుకుంటూ ఇక్కడి అభివృద్ధి, సంక్షేమం మాకూ కావాలని చెబుతున్నారు.
పెద్దపల్లి, జనవరి 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ తరహా ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు తమ రాష్ట్రంలోనూ కావాలని తమిళనాడుకు చెందిన తాపీ కార్మికులు కోరుతున్నారు. కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లోని పలు ఆలయాలు నిర్మించేందుకు వచ్చిన కార్మికులు, ఏడాదిగా ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. ప్రభుత్వం ఇంటింటికీ సంక్షేమ ఫలాలు అందించడం, రైతులకు రైతు బంధు, రైతు బీమా, ఇంకా చేపడుతున్న అభివృద్ధిని కండ్లారా చూస్తున్నారు. ఈ క్రమంలో రాగినేడు నాగలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనుల్లో 18మంది కార్మికులుగా చేరారు.
ఈ క్రమంలో ఆదివారం వారిని ‘నమస్తే తెలంగాణ’ పలుకరించగా, తమ మనోగతాన్ని ఇలా వెల్లడించారు. ‘మేము ఏడాదిగా ఇక్కడ ఉంటున్నాం. కరీంనగర్ జిల్లా చొప్పదండి సాయిబాబా ఆలయం, రాజన్న సిరిసిల్ల జిల్లా నాగారం, పెద్దపల్లి జిల్లా జూలపల్లి బీరన్నగుడి, అప్పన్నపేట రామాలయాలను నిర్మించినం. ఇప్పుడు రాగినేడు నాగలింగేశ్వర స్వామి ఆలయాలన్ని కడుతున్నం. ఏడాదిగా పని చేస్తున్న మాకు ఇక్కడి అభివృద్ధి, సంక్షేమం చూస్తుంటే సంబురమైతంది.
బీఆర్ఎస్ సర్కారు అందరికీ మేలు చేస్తంది. ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందిస్తోంది. కల్యాణలక్ష్మి, రైతు బంధు, రైతు బీమా, ఉచిత కరెంట్, కేసీఆర్ కిట్లు ఎన్నో రకాలుగా ప్రజలకు మేలు చేస్తంది’ అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘తెలంగాణ సర్కారు లెక్క మా ప్రభుత్వం పనిచేస్తే మాకీ బాధలు ఉండేవి కాదు. తెలంగాణ లాంటి పథకాలు మా రాష్ట్రంలో కావాలి. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని స్థాపించి జాతీయ రాజకీయాల్లోకి వచ్చినందుకు సంతోషిస్తున్నం. మా తమిళనాడులో రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కోరుకుంటున్నం’ అని చెప్పారు.
మా ఊరోళ్లందరికీ చెప్పి ఓట్లేయిస్తం..
తెలంగాణ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నరు. ఇక్కడి ప్రభుత్వం అనేక పథకాలతో అండగా ఉండి ఏ లోటూ లేకుండా చూసుకుంటున్నది. ఇక్కడి మాదిరి సర్కారే మా తమిళనాడులోనూ రావాలి. అలా వస్తేనే ఇక్కడి ప్రజలకు అందుతున్న పథకాలన్నీ మాకూ అందుతాయి. మేం ఇలా వలస వచ్చే బాధ తప్పుతది. కష్టాలు తీరుతాయి. కన్నీళ్లు ఆగుతాయి. మా ఊరోళ్లందరికీ చెప్పి వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కే ఓటేయిస్తం.
-తిైల్లె గోవిందన్ దొరయప్పన్, వీరచాళాపురం కాటుమన్నార్కోయిల్, కడలూర్ జిల్లా (తమిళనాడు)
ఇక్కడ అందరికీ మేలవుతున్నది..
తెలంగాణ ప్రభుత్వం ఇక్కడి ప్రజలందరికీ మేలు చేస్తున్నది. ప్రతి ఇంటికీ ప్రభుత్వ సంక్షేమ పథకం అందుతున్నది. అందరిలో ఆనందం కనిపిస్తున్నది. మా రాష్ట్రంలో ఇలా ఇన్ని పథకాలు లేవు. ఇలాంటి ప్రభుత్వమే మా తమిళనాడులోనూ రావాలి. ప్రజలందరికీ మేలు జరుగాలి. పుట్టిన బిడ్డ నుంచి మొదలుకొని పండు ముసలి దాకా ప్రభుత్వం మేలు చేస్తంది. ఇలా సాయం చేసే ప్రభుత్వం నాకు తెలిసి దేశంలో ఎక్కడా లేదు. ఇలాంటి పనులు మా రాష్ట్రంలో అమలుకావాలంటే బీఆర్ఎస్ అధికారంలోకి రావాలి.
– గణేషన్ రమేశ్, వీరచాళాపురం కాటుమన్నార్కోయిల్, కడలూర్ జిల్లా (తమిళనాడు)