తెలంగాణచౌక్, అక్టోబర్ 15: తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అధిక శాతం ఉన్నారని, చట్టసభల్లో రిజర్వేషన్లతోనే వారికి రాజ్యాధికారం సాధ్యమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని క్యాంపు కార్యాలయంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ స్టేడియంలో వచ్చే నెల 4న నిర్వహించనున్న తెలంగాణ ప్రజాగర్జన మహాసభ పోస్టర్ను నగర మేయర్ సునీల్రావు, తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం నాయకులతో కలిసి ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో 90 శాతం బడుగు బలహీన వర్గాల ప్రజలు ఉన్నారని తెలిపారు. వెనుకబడిన సామాజిక వర్గాలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేయించారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బడుగు వర్గాల ప్రజలు భూమిని నమ్ముకొని జీవిస్తున్నారని, వారి ఆర్ధికాభివృద్ధి కోసమే ప్రభుత్వం రైతుబంధు, రైతు బీమా పథకాలను తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల అభివృద్ధి కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. మార్కెట్ కమిటీల్లో కూడా ఎస్సీ రిజర్వేషన్లు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు.
సామాజికంగా వెనుకబడిన వర్గాల ప్రజల అభివృద్ధి గురించి నిరంతరం ఆలోచన చేసే నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ ప్రజాగర్జన మహాసభ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు సముద్రాల అజయ్కుమార్, కుల సంఘాల జేఏసీ చైర్మన్ జీఎస్ ఆనంద్, కలర్ సత్తన్న, బషీర్, స్వరూప, నర్సయ్య, లత, ఆనందం, మహ్మద్ శుక్రుద్దీన్, శ్రీనివాస్ పాల్గొన్నారు.