సర్కారు పాఠశాలలకు మహర్దశ వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం మన ఊరు-మనబడి కార్యక్రమం ద్వారా భారీగా నిధులు కేటాయిస్తుండడంతో మౌలిక వసతుల కల్పన వేగవంతమైంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు మెరుగైన సదుపాయాలతో నాణ్యమైన విద్య అందనున్నది.
– చిగురుమామిడి, డిసెంబర్ 2
మన ఊరు-మన బడి కార్యక్రమం మొదటి విడుతలో భాగంగా మండలంలోని 11 పాఠశాలలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. పది పాఠశాలకు ఒక్కొదానికి రూ.25 నుంచి రూ.30లక్షల లోపు కేటాయించింది. ఇందుర్తి పాఠశాలకు రూ. 60 లక్షల నిధులు కేటాయించింది. ఇకడ అభివృద్ధి పనుల కోసం టెండర్ల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. మిగతా 10 ప్రభుత్వ పాఠశాలల్లో పనులు వేగంగా సాగుతున్నాయి.
మండలంలోని చిగురుమామిడి, రేకొండ, సుందరగిరి, నవాబుపేట, ములనూర్ పాఠశాలల్లో ప్రస్తుతం విద్యుత్ తాగునీటి సౌకర్యం, సంపులు, డైనింగ్ హాల్, తరగతి గదుల మరమ్మతులు, ప్రహరీ, కిచెన్ షెడ్లు తదితర పనులు చేపట్టారు. అలాగే పాఠశాలలకు రంగులు వేయిస్తూ తీర్చిదిద్దుతున్నారు. ఎమ్మెల్యే సహకారంతో మండలంలోని ఎంపీపీ, జడ్పీటీసీ, స్థానిక ప్రజాప్రతినిధులు పాఠశాలల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తున్నారు. ప్రభుత్వం బడుల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తుండడంతో విద్యార్థులు ఎలాంటి సమస్య లేకుండా చదువుపై దృష్టి సారించే అవకాశం ఉంది.