జగిత్యాల, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ)/ మెట్పల్లి : రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు శుక్రవారం జగిత్యాల జిల్లా కోరుట్ల, సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలో పర్యటించారు. ముందుగా మధ్యాహ్నం 3.20 గంటల తర్వాత హెలిక్యాప్టర్లో కోరుట్లకు చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గాన ఐబీ రోడ్డులో ఉన్న నూతన వంద పడకల దవాఖానకు చేరుకున్నారు.
స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు, బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేశ్, కోరుట్ల మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య, కలెక్టర్ యాస్మిన్భాషా తదితరులు స్వాగతం పలికారు. 16.80కోట్ల వ్యయంతో నిర్మించిన ఆ దవాఖానను మంత్రి ప్రారంభించి, స్థానిక మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు హాజరయ్యారు.
అనంతరం సాయంత్రం 4.45 గంటలకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ వ్యవసాయ మార్కెట్ను ప్రారంభించి, 21 కోట్ల వ్యయంతో 50 పడకల దవాఖాన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత మహిళా సంఘం భవనం, పల్లె దవాఖానను ప్రారంభోత్సవాలు చేసి, బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. కోరుట్ల, ఇల్లంతకుంట సభలకు జనం నీరాజనం పలికారు. కోరుట్ల, మానకొండూర్ నియోజకవర్గాల నుంచి వేలాదిగా తరలివచ్చారు.
కుల సంఘాలు, యువజన సంఘాలు, మహిళా సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో వచ్చారు. అమాత్యుడు హరీశ్రావు వేదికలపైకి రాగానే చప్పట్లతో స్వాగతించారు. ఒక్కో చోట దాదాపు 15 నిమిషాలకు పైగా ప్రసంగించి, విశేషంగా ఆకట్టుకున్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రనౌట్ అవుతుందని, బీజేపీ డకౌట్ అవుతుందని, సీఎం కేసీఆర్ సిక్సర్ కొట్టి హ్యాట్రిక్ సాధిస్తారని చెప్పడంతో సభికులు కేరింతలు కొట్టారు.
‘కేసీఆర్ అంటే నమ్మకం. కాంగ్రెస్ అంటే నాటకం’ అని వ్యాఖ్యానించడంతో హర్షధ్వానాలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలించింది ఒక్క సీటేనని, ఈ సారి ఆ సీటు గల్లంతు కావడం ఖాయమని, ఎన్ని జాకీలు పెట్టి లేపిన తెలంగాణలో లేవబోదని ఎద్దేవా చేడయంతో ఒక్క సారిగా చప్పట్లు కొట్టారు.
తన ప్రసంగంలో కరెంట్ కష్టాలు, రైతుల గోసలు, నాటి పరిస్థితులను ఒకసారి కండ్లకు కట్టినట్టి వివరించారు. కాంగ్రెస్ పుర్రె గుర్తు పెట్టి.. ఉన్న శాట గుంజుకునే ప్రయత్నం జేసిందని, బీజేపీ మూలిగే నక్కపై తాటి పడ్డు చందంగా బీడీ పరిశ్రమపై జీఎస్టీ వేసి దెబ్బతీసిందని, కానీ, బీడీ కార్మికులను ఆదుకున్నది సీఎం కేసీఆరేనంటూ బీడీ కార్మికులు, టేకేదార్ల పరిస్థితిని వివరించడంతో మహిళలు ఒక్కసారిగా హర్షధ్వానాలు వ్యక్తం చేశారు.
ప్రజా సంక్షేమం కోసం బీఆర్ఎస్ అమలు చేస్తున్న పథకాలు, కాంగ్రెస్, బీజేపీ పార్టీల కుట్రలను అర్థవంతంగా వివరించారు. మానకొండూర్, కోరుట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, డాక్టర్ సంజయ్ కల్వకంట్లను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేయగా, సభికులంతా జేజేలు పలికారు. మొత్తంగా హరీశ్రావు సభకు రైతులు, మహిళలు, యువత, ముఖ్యంగా బీడీ కార్మికులు పెద్ద సంఖ్యలో రావడం, విజయవంతంతో గులాబీ శ్రేణుల్లో నూతనోత్సాహం మొదలైంది.
కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ మంచి వైద్యుడు. ఆయన చెయ్యి పడితే నయం అవుతుందని రోగుల నమ్మకం. సిద్ధిపేట నుంచి కూడా నేను ఎంతో మందిని యశోదాలో సంజయ్ వద్దకు పంపించా. చేతి నిండా పని, జేబు నిండా పైసలు విడిచిపెట్టుకుని ప్రజాసేవ కోసం వచ్చాడు. విద్యావంతుడు, సమాజం తెలిసిన యువకుడు, ఉత్సాహవంతుడైన సంజయ్ను ఆశీర్వదించాలి. భారీ మెజార్టీతో గెలిపించాలి.
– మంత్రి హరీశ్రావు
ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మానకొండూరు నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారు. అభివృద్ధి కోసం పట్టిన పట్టువిడవరు. పని పూర్తయ్యే వరకు విశ్రమించకుండా పనిచేస్తారు. ఇల్లంతకుంటలో 30 పడకల దవాఖాన కావాలని రసమయితోపాటు మంత్రి కేటీఆర్ పట్టుబట్టారు. తప్పనిసరి కావాలని ఇద్దరూ ఒత్తిడి తెస్తే 50 పడకల దవాఖానను మంజూరు చేశా. నిరంతరం ప్రజా సంక్షేమం కోసం తపిస్తున్న రసమయిని భారీ మెజార్టీతో గెలిపించండి.
– మంత్రి హరీశ్రావు