నాటి పాలనలో కుదేలైన చేనేత పరిశ్రమకు జీవం పోసిన రాష్ట్ర సర్కారు, కార్మికులకు కొండంత అండగా నిలుస్తున్నది. 50 ఏండ్లు నిండిన ప్రతి కార్మికుడికి 2016 పింఛన్, రైతు బీమా మాదిరి 5 లక్షల బీమాతో భరోసానిస్తున్నది. అలాగే త్రిప్టు పథకం కింద కార్మికుడు జమ చేసిన దానికి మరో సగం కలుపుతూ ప్రోత్సహిస్తున్నది. ఇంకా రంగులు, రసాయనాలకు 50 శాతం సబ్సిడీ ఇవ్వడమే కాదు, తాజాగా చేనేతమిత్ర పథకం కింద జియోట్యాగింగ్ అయిన ప్రతి మగ్గం కార్మికుడి బ్యాంకు ఖాతాలో ప్రతినెలా రూ.3వేల చొప్పున నగదు జమచేస్తున్నది. శుక్రవారం తొలి సాయం జమ కావడంతో నేతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని పథకాలు తమకోసం అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దేవుడంటూ వేనోళ్ల కొనియాడుతున్నారు.
రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): సమైక్య పాలనలో చిక్కి శల్యమైన చేనేత రంగానికి తెలంగాణ సర్కారు జీవం పోసింది. చేనేత, మరమగ్గాల కార్పొరేషన్లు వేర్వేరుగా ఏర్పాటు చేసి బడ్జెట్లో 1200 కోట్లు కేటాయించింది. నాటి పాలకులు మరమగ్గాలు, చేనేత పరిశ్రమను ఒకే గూటి కిందకు చేర్చి నామమాత్రంగా నిధులు బడ్జెట్లో కేటాయించే వారు. అప్పుడు బడ్జెట్లో చేనేతకు 300 కోట్లు మాత్రమే కేటాయిస్తే తెలంగాణ ప్రభుత్వం ఏకంగా 1200 కోట్లకు పెంచింది. అంతే కాకుండా దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది. ప్రతి సోమవారం ప్రజాప్రతినిధులు, అధికారులందరూ చేనేత మగ్గాలపై తయారైన వస్ర్తాలనే ధరించాలని నిబంధనలు అమలు చేసింది. చేనేతలక్ష్మి పథకం కింద టెస్కో సంస్థ ద్వారా ప్రత్యేక వస్త్ర అమ్మకాల దుకాణాలను ఏర్పాటు చేసింది. చేనేత కార్మికులకు చేతి నిండా పని కల్పించి, చేనేత రంగాన్ని నిలదొక్కుకునేలా రంగులు, రసాయనాలు, నూలుపై 50 శాతం సబ్సిడీ ఇచ్చి అండగా నిలిచింది. చేనేత కార్మికులకు భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో త్రిఫ్ట్ పథకాన్ని పునఃప్రవేశ పెట్టింది. కార్మికులు చేసిన పొదుపునకు మరో సగం సర్కారు చెల్లించి బ్యాంకులో జమచేస్తున్నది. కరోనా విపత్తులో చేనేత రంగం మూతపడగా, మూడేళ్ల పొదుపు కాలపరిమితి ఉన్నప్పటికీ, కార్మికులకు రెండేళ్లకే పొదుపు పైసలు బ్యాంకులు తిరిగి చెల్లించేలా చేసి ఆదుకున్నది.
కార్మికులకు వరం ‘చేనేత మిత్ర’
చేనేత రంగాన్ని కాపాడేందుకు దేశంలో ఎక్కడా, ఏ ప్రభుత్వమూ ప్రవేశపెట్టని విధంగా తెలంగాణ ప్రభుత్వం కొత్త పథకాలను ప్రవేశపెట్టింది. అందులో భాగంగా కార్మికులకు పింఛనుతోపాటు పరిశ్రమలకు ఇస్తున్న నూలు సబ్సిడీ పైసలు నేరుగా కార్మికుడికే చెందేలా నిర్ణయం తీసుకున్నది. మధ్య దళారీ వ్యవస్థకు చెక్పెడుతూ నేతన్నల ఖాతాల్లోనే నెలకు 3వేల చొప్పున జమ చేయనున్నది. గతంలో కార్మికుడు చేసిన పనిని బట్టి పైసలు ఇచ్చే వారు. అందులో మధ్య దళారుల ప్రమేయం ఉండేది. ఇచ్చే పైసలు సక్రమంగా కార్మికుడికి చేరడం లేదన్నది ప్రభుత్వ దృష్టికి చేరింది. ఈ నేపథ్యంలో ఇకపై జియో ట్యాగింగ్ ద్వారా ట్యాగ్ అయిన ప్రతి మగ్గం కార్మికుడికి నెలకు 3 వేల చొప్పున జమ చేయాలని, అందులో యజమానికి 2 వేలు, అతనికి సహాయకుడిగా ఉండే వారికి వేయి చొప్పున ఇవ్వాలని నిర్ణయించినట్టు మంత్రి కేటీఆర్ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్టు 7న ప్రకటించారు. ఈ నేపథ్యంలో తొలిసారిగా సెప్టెంబర్ 1న కార్మికుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1696 మందికి లబ్ధి
చేనేత మిత్ర పథకం వర్తించాలంటే త్రిఫ్ట్ పథకంలో చేరి ఉండాలి. చేనేత జౌళీశాఖ చేనేత మగ్గాలను జియో ట్యాగ్ చేసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1696 మంది చేనేత కార్మికులున్నారు. కరీంనగర్ జిల్లాలో 1372, సిరిసిల్ల జిల్లాలో 211, పెద్దపల్లి జిల్లాలో 99, జగిత్యాల జిల్లాలో 14 మంది ఉన్నారు. అందులో మగ్గం నేసే కార్మికులు 1014 మంది, అనుబంధ రంగ కార్మికులు 682 మంది ఉన్నారు. వీరందరికీ ఈనెల నుంచి చేనేత మిత్ర పథకం వర్తించనున్నది. వీరి ఖాతాల్లో నెలకు రూ.3 వేల చొప్పున ప్రభుత్వం నగదు జమ చేయనున్నది. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం కేసీఆర్ ప్రకటన చేయగా, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ చేనేత మిత్ర పథకాన్ని అమలు చేసినందుకు చేనేతల కుటుంబాల్లో సంతోషం వ్యక్తమవుతున్నది.
50 ఏండ్లకే పింఛన్
గుంట, చక్రం మగ్గాలపై వస్త్రాలు తయారు చేసేందుకు కొత్తతరం రావడం లేదు. చేనేత మగ్గాలపై చాలా వరకు 58 ఏండ్ల పైబడిన వారే పనిచేస్తున్నారు. పొద్దంతా మగ్గం నేసినా గిట్టుబాటు కూలీ రాని చేనేత కార్మికులను సమైక్య పాలకులు ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు. కనీసం పింఛను ఇవ్వలేదు. 65 ఏండ్లు నిండిన వారికే కేవలం 200 మాత్రమే ఇచ్చేది. పింఛన్ వయో పరిమితి తగ్గించలేదు. చేనేత కుటుంబాల దయనీయ స్థితిని అర్థం చేసుకున్న సీఎం కేసీఆర్ పింఛను వయో పరిమితి 50 ఏండ్లకు తగ్గించారు. నెలకు 2016 ఇచ్చి అండగా నిలిచారు. సబ్సిడీతో రంగులు, రసాయనాలు, రుణమాఫీ పథకాలతో చేనేత రంగం నేడు కొంత పుంతలు తొక్కుతున్నది. చేనేత లక్ష్మి పథకం అమలుతో చేనేత వస్ర్తాలకు డిమాండ్ పెరిగి, అమ్మకాలు పెరిగాయి. కేవలం దుస్తులే కాకుండా బెడ్షీట్లు, తువ్వాలలు, పట్టు చీరల తయారీలో చేనేత రంగం దశదిశలా విస్తరించింది.
మాకు ఎంతో మేలు చేసిన్రు
చేనేత మిత్ర పథకం ద్వారా మాకు కేసీఆర్ సారు ఆసరా అవుతున్నడు. నెలకు రూ.2 వేల ఆర్థిక సాయం వస్తంది. కేసీఆర్ నాయకత్వంలో అందరూ సల్లగ బతుకుతున్నరు. నేత కార్మికుల కోసం కేటీఆర్ సార్, కేసీఆర్ సారు ఎంతో మేలు చేసిన్రు. చేనేత కార్మికుల కోసం తెచ్చిన చేనేత మిత్ర మా జీవితాలకు భరోసానిస్తంది. కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి ఉంటే కార్మిక లోకం అంతా సంతోషంగా ఉంటది.
– సట్కురి దుర్గయ్య, చేనేత కార్మికుడు, మహేశ్వర చేనేత సహకార సంఘం (సిరిసిల్లటౌన్)
అంతా కేటీఆర్ సారు దయనే..
నాటి పాలకులు జెయ్యవట్టి మగ్గాలు పోయినయి. కొత్తతరం వస్తలేదు. నాడు పట్టుచీరలు, తువ్వాలలు, దోతులు రకరకాల బట్టలు నేసినం. నాటి సర్కారు ఈ రంగాన్ని బాగా నిర్లక్ష్యం చేసింది. పనిలేక కార్మికులు ఉరేసుకుని సచ్చినా పట్టించుకోలె. ఏమి జెయ్యాలన్న సోయి లేని అప్పటి పాలకుల వల్ల చేనేత పూర్తిగా అంతరించే స్థాయికి చేరింది. తెలంగాణ వచ్చినంక మా బతుకులు మారినయ్. కేటీఆర్సార్ చేనేత, జౌళీ శాఖ మంత్రి అయినందుకే చేనేత మగ్గాలకు, మాకు మంచి రోజులచ్చినయని గర్వ పడుతున్నం. ఆయన రాంగనే లోను మాఫీ చేసిండు. రంగులు, నూలుకు సబ్సిడీ ఇత్తన్నడు. మగ్గాలపై నేసిన బట్టలే తొడగాలని అందరికీ చెప్పిండు. మగ్గాలు నేసోటోళ్లందరికీ రూ.2016 పింఛను ఇస్తున్నడు. బీమా కల్పించిండు. ఇప్పుడు నెలకు రూ.3 వేలు ఖాతాల వేస్తున్నడు. కాటికి కాళ్లు జాపిన మాకు కేటీఆర్, కేసీఆర్ సార్లే దిక్కని రోజూ మొక్కుకుంటున్నం. సార్తోనే చేనేత రంగం ఇంకా డెవలప్ అయితదన్న నమ్మకం ఉంది.
– తౌటి నాగయ్య, రాజీవ్నగర్ (సిరిసిల్ల)
కార్మికుల కష్టానికి ప్రతిఫలం
చేనేత కార్మిక వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి ఏ ప్రభుత్వాలు, ఏ నాయకుడు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. నాలుగు మెతుకులు నోట్లోకి పోలేని దుర్భర స్థితిలో ఉండి వేల మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నరు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి సీఎం కేసీఆర్ మా బాధలు అర్థం చేసుకొని పనికి తగ్గ వేతనం అందిస్తూ మాకు అండగా నిలుస్తున్నరు. మా కోర్కల్ చేనేత సహకార సంఘంలో మొత్తం 120 కార్మికులు పనిచేస్తరు. వారిలో జియో ట్యాగింగ్ కలిగిన వారు 85 మంది, అనుబంధ కార్మికులు 30 మంది ఉన్నరు. వారికి చేనేత మిత్ర పథకం ద్వారా డబ్బులు ఖాతాలో జమైతున్నయ్. రెక్కాడితే కానీ డొక్కాడని చేనేత కార్మికులకు చేనేత మిత్ర పథకంతో ప్రతిఫలం దక్కింది. జియో ట్యాగ్ కలిగి ఉన్న వారికి రూ.2 వేలు, అనుబంధ కార్మికులకు రూ.వెయ్యి వారి ఖాతాల్లో జమ చేయడం హర్షించదగిన విషయం.
– అడిగొప్పుల సత్యనారాయణ, మాజీ ఆప్కోడైరెక్టర్, రెడ్డిపల్లి గ్రామం(వీణవంక)
భరోసా కల్పించిన్రు
చేనేత మిత్రతో చేనేత కార్మికులకు భరోసా కల్పించింది. రోజువారి కూలీ పనితోపాటు జియో ట్యాగింగ్ కలిగిన కార్మికులకు అదనంగా రూ.2 వేలు అందజేయడం నిజంగా సీఎం కేసీఆర్ నిబద్ధ్దతకు నిదర్శనం. తెలంగాణ రాక ముందు రుణమాఫీలు లేక, సరైన బతుకుదెరువు లేక చాలీచాలని జీతాలతో పని చేయలేక ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నరు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డయ్. చేనేత కార్మికుల బాధలు అర్థం చేసుకున్న ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్. నర్సింగాపూర్ సహకార సంఘంలో మొత్తం 85 మంది కార్మికులు పనిచేస్తరు. వీరిలో జియో ట్యాగింగ్ కలిగిన 35 మందికి రూ.2 వేలు, అనుబంధ కార్మికులు 15 మందికి రూ.వెయ్యి చొప్పున ఇప్పటికే వారి బ్యాంక్ ఖాతాల జమైనయ్. మా కష్టాలను అర్థం చేసుకున్న సీఎం కేసీఆర్కు అండగా ఉంటం.
– జడల రమేశ్, నర్సింగాపూర్ చేనేత సహకార సంఘం చైర్మన్ (వీణవంక)
కేసీఆర్ సారుతోనే చేనేతకు మనుగడ
ఒకప్పుడు చేనేత రంగం వైభోపేతంగా ఉండేది. వేలాది మంది కార్మికులు పనిచేసిన్రు. ఎక్కడ చూసినా లడీలు ఎండేసి, సర్లు చేసే టోళ్లు కనిపించేటోళ్లు. కాంగ్రెస్ సర్కారు చేనేతను పట్టించుకోలె. మొత్తం రంగం కుంటు పడిపోయింది. మగ్గం సడుగులిరిగేలా చేసింది. బడ్జెట్లో పెట్టిన నిధులన్నీ ఆంధ్రాకే పెట్టింది. ఇక్కడున్న మగ్గాలు ఆంధ్రాలో కూడా లేకుండె. నాడు రామబాణం చీరలు ఎంతో ఫేమస్ ఉండె. అలాంటి చీరలు, బట్టలు ఇప్పుడు తయారైతలేవు. చేనేత కార్మికులను ప్రోత్సహించేందుకు ఒక్క పథకం పెట్టలేదు. తెలంగాణ సర్కారు వచ్చినంక సీఎం కేసీఆర్ జెయ్యవట్టి చేనేత బతికి బట్టకట్టింది. చేనేత మిత్ర పథకం అమలు చేసి ఖాతాల రూ.మూడు వేలు వేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సార్తోనే చేనేత రంగం మనుగడ ఉంటుంది.
– చేరాల శంకరయ్య, చేనేత కార్మికుడు (సిరిసిల్ల)
త్రిఫ్ట్లో చేరినవారందరికీ వర్తింపు
తెలంగాణ ప్రభుత్వం చేనేత పరిశ్రమకు అనేక రాయితీలు ఇస్తున్నది. అంతే కాకుండా కార్మికులకు చేతినిండా పనికల్పించాలన్న ఉద్ధేశంతో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టింది. గతంలో కన్నా మెరుగైన సంక్షేమ పథకాలు అమలవుతున్నయి. చేనేత రంగాన్ని ప్రోత్సహించాలన్న ఉద్ధ్దేశంతో చేనేత జౌళీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నరు. దీని వల్ల పరిశ్రమ అభివృద్ధి చెందుతున్నది. కార్మికుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని త్రిఫ్ట్ పథకాన్ని తెచ్చారు. చేనేతలక్ష్మి, చేనేతకు చేయూత, చేనేత మిత్ర వంటి పథకాలు కార్మికులకు వరమని చెప్పవచ్చు. త్రిఫ్ట్ పథకంలో చేరిన కార్మికులందరికీ వర్తించేలా చేనేత మిత్ర పథకం తెచ్చింది. ప్రతినెలా కార్మికుల ఖాతాలో రూ.మూడు వేలు జమచేస్తుంది.
– మిట్టకోల సాగర్, చేనేత జౌళీశాఖ అధికారి (సిరిసిల్ల)
త్రిఫ్ట్లో చేరాలి
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1696 మంది చేనేత వృత్తి పనిచేస్తున్న కార్మికులున్నరు. వీరందరికీ చేనేత మిత్ర పథకం వర్తిస్తుంది. వీరి ఖాతాల్లో నేరుగా ప్రభుత్వం పైసలు జమ చేస్తుంది. ఈ నెల నుంచి జిల్లాలోని కార్మికులందరి ఖాతాల్లో జమయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. కరీంనగర్ జిల్లాలో 1372 కార్మికులకు లబ్ధి చేకూరుతుంది. పెద్దపల్లి జిల్లాలో 99, జగిత్యాల జిల్లాలో 14 మంది కార్మికులున్నరు. మగ్గాలకు జియోట్యాగ్ చేశాం. తెలంగాణ ప్రభుత్వం చేనేత పరిశ్రమ అభివృద్ధి కోసం చేపట్టిన సంక్షేమ పథకాలతో పరిశ్రమ, కార్మికులకు ఎంతో మేలు చేకూరుతున్నది. కార్మికులందరూ త్రిఫ్ట్ పథకంలో చేరాలి. చేరిన వారందరికీ చేనేత బీమా కూడా వర్తిస్తుంది.
– సంపత్ చేనేత, జౌళీశాఖ అధికారి (కరీంనగర్)
నాడు అస్సలు పట్టించుకోలె..
నాడు మగ్గాలు మంచిగ నడిచినయ్. ఆంధ్రా నాయకులు వచ్చినంక మగ్గాల సడుగులు విరిసిన్రు. పని సరిగా లేక బాకీలు ఇచ్చేటోళ్లు లేక బ్యాంకుల్లో అప్పు చేసినం. బంగారం తాకట్టు పెట్టి రూ.20 వేలు తీసుకుంటే వడ్డీ కలిపి బ్యాంకోళ్లు రూ.60 వేలు జేసిండ్రు. చేసిన పనికి వచ్చిన కూలి పైసలు పొట్టకే సరిపోకపోయేవి. ఇంక బ్యాంకుల అప్పు ఎట్ల గట్టేదని రందితో బతికినం. తెలంగాణ ఉద్యమంల కేసీఆర్ సార్ తెలంగాణ వచ్చినకం మా రుణాలుజేత్తమని మాటిచ్చిండు. అన్నట్టే రాష్ట్రం వచ్చినంక కేసీఆర్ సారు మాకు రుణమాఫీ చేసిండు. త్రిఫ్ట్ పథకం, చేనేతకు చేయూత, ఇప్పుడు చేనేత మిత్ర పథకం పెట్టి ఆదుకున్నడు. సార్తోనే చేనేత జీవం పోసుకుంటున్నది. కేసీఆర్ సార్ మల్లస్తనే చేనేత మగ్గాలు మంచిగ నడుత్తయ్.
– మాదాసు మల్లేశం, బీవైనగర్, (సిరిసిల్ల)