వనపర్తి, జూలై 31(నమస్తే తెలంగాణ): ఒకప్పుడు సర్కారు దవాఖాన అంటే చిన్న చూపు. సౌకర్యాలు లేక పేదలు సైతం వైద్యం చేయించుకునేందుకు జంకేవారు. సర్కారు దవాఖానల మీద సినిమాల్లో కూడా పాటలు వచ్చాయి. నేను రాను బిడ్డో.. సర్కారు దవాఖానకు అనే పాట నాటి పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పట్టింది. తెలంగాణ ఏర్పడ్డాక, ఉద్యమనేత కేసీఆర్ సీఎం పదవి చేపట్టాక ప్రభుత్వ దవాఖానల్లో సౌకర్యాలకు కొదువలేదు. 24/7 సేవలు అందుబాటులోకి వచ్చాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సౌకర్యాలు కొలువుదీరాయి. కార్పొరేట్కు దీటుగా వైద్యసేవలు అందుతున్నాయి. దీనికి ఉదాహరణే వనపర్తి జిల్లాలో సర్కారు దవాఖానల్లో పెరుగుతున్న ప్రసవాల సంఖ్యకు నిదర్శనం.
ఒకప్పుడు ప్రైవేట్ దవాఖానకు మాత్రమే ప్రసవాల కోసం వెళ్లే ప్రజలు ప్రస్తుతం ప్రభుత్వ దవాఖానకు క్యూ కడుతున్నారు. దీనికి సీఎం కేసీఆర్ పేరుతో ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్తోపాటు సౌకర్యాలు, సేవలు దోహదం చేస్తున్నాయి. కేసీఆర్ కిట్ ప్రవేశపెట్టిన తర్వాత 2017నుంచి ఇప్పటివరకు వనపర్తి జిల్లాలో సాధారణ, సిజేరియన్ కాన్పులు 41,313 జరుగగా ఇందులో ప్రభుత్వ దవాఖానల్లో 23,934, ప్రైవేట్ దవాఖానల్లో కేవలం 17,379 డెలివరీలు జరిగాయి. సగటున ఒక్కోరోజు ప్రభుత్వ దవాఖానల్లో 70నుంచి 90కాన్పులు జరుగుతున్నాయి అంటే ప్రభుత్వ వైద్యసేవలు ఎంత మేర మెరుగయ్యాయో అంచనా వేయొచ్చు.
సర్కారు దవాఖానల్లో సాధారణ కాన్పులు
ఒకప్పుడు కాన్పు అంటే భయపడే పరిస్థితి ఉండేది. గర్భిణులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రసవానికి దవాఖానలకు వెళ్లేవారు. తెలంగాణ రాక ముందు ప్రభుత్వ దవాఖానకు గర్భిణి ప్రసూతి కోసం వెళ్తే తల్లీబిడ్డ క్షేమంగా తిరిగివస్తారనే నమ్మకం లేదు. తప్పని పరిస్థితుల్లో ప్రైవేట్ దవాఖానకు వెళ్తే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి. భరించలేని ఆర్థికభారం ఉండేది. అంతేకాకుండా కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందని, ఆలస్యం చేస్తే తల్లీబిడ్డ ప్రాణాలకు ముప్పు అని అవసరం లేకున్నా సిజేరియన్లు చేసి డబ్బులు గుంజిన సందర్భాలున్నాయి. ప్రైవేట్ దవాఖానలకు వెళ్తే సాధారణ కాన్పు అన్న మాట ఉండేది కాదు. ఇప్పుడు ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ కాన్పులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అత్యవసరం అనుకుంటేనే సిజేరియన్లు చేస్తున్నారు. ప్రతి నెలా ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ కాన్పులు సగటున నెలలో 3500వరకు చేస్తున్నారు. ప్రైవేట్ దవాఖానల్లో నెలలో వెయ్యి కూడా సాధారణ కాన్పులు జరగడం లేదు. మొత్తం సాధారణ, సిజేరియన్ కాన్పులను పరిశీలించినా ప్రభుత్వ దవాఖానలతో పోల్చితే చాలా తక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ, సిజేరియన్ కలిపితే 23,934ఉండగా, ప్రైవేట్ దవాఖానల్లో కేవలం 17,379 డెలివరీలు జరిగాయి. దీంతో ప్రైవేట్ నర్సింగ్హోంల పరిస్థితి దారుణంగా తయారైంది. కొన్ని నర్సింగ్హోంలు మూసివేసే స్థితిలో ఉన్నాయి.
కేసీఆర్ కిట్తో సంతోషం
కేసీఆర్ కిట్ పథకంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టిన పథకం చాలామందికి ఆర్థిక భారాన్ని తగ్గించడంతోపాటు బిడ్డ పుట్టిన తర్వాత కావాల్సిన పోషకాహారం, తల్లీ బిడ్డకు కావాల్సిన ఇతర సౌకర్యాలు అందిస్తుండటం తో సంబురపడుతున్నారు. ఈ పథకం ప్రయోజనక రంగా ఉండటంతో ఆకర్శితులవుతున్నారు. ఈ పథకంలో గర్భిణికి రూ.12వేల ఆర్థిక చేయూత, ఆడబిడ్డ పుడితే మరో రూ.వెయ్యి అందజేస్తున్నారు. అంతేకాకుండా కిట్లో బేబీ ఆయిల్, బేబీ సోప్, దోమతెర, డ్రస్సులు, హ్యాండ్బ్యాగులు, పుట్టిన బిడ్డ ఆడుకునేందుకు బొమ్మలు, డైపర్స్, పౌడర్, షాంపూ, చీరలు, టవల్స్, న్యాప్కిన్స్ బేబీ బెడ్ అందిస్తున్నారు. ప్రైవేట్ దవాఖానకు వెళ్తే అడిగినంత ఫీజులు చెల్లించడంతోపాటు సిజేరియన్ పేరిట కోత బాధ భరిస్తూ డెలివరీ తర్వాత బాలింతకు, పుట్టినబిడ్డకు అవసరమైన వస్తువులు కొనడానికి చాలా ఖర్చు అయ్యేది. ఇప్పుడు ఆ బాధ తప్పింది. ఎలాంటి ఖర్చు లేకుండా సాధారణ ప్రసవం అయ్యే అవకాశం ఉంది. తప్పని పరిస్థితుల్లో సిజేరియన్ చేసినా నయా పైసా చెల్లించాల్సిన అవసరం లేదు. అదనంగా ఆర్థిక చేయూతతోపాటు 16రకాల వస్తువులు కేసీఆర్ కిట్ ద్వారా అందిస్తున్నారు. దీంతో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల కోసం వస్తున్నారు.
సాధారణ కాన్పులకు ప్రాధాన్యం
సాధారణ కాన్పులకు ప్రాధాన్యం ఇస్తున్నాం. జిల్లా దవాఖానతోపాటు పీహెచ్సీల్లో కూడా కాన్పులు చేస్తున్నాం. కేసీఆర్ కిట్ పథకం ప్రవేశపెట్టాక సర్కారు దవాఖానల్లో ప్రసూతికి వచ్చే వారి సంఖ్య పెరిగింది. దాదాపు తొమ్మిదిమంది గైనకాలజిస్టులు 24గంటలు అందుబాటులో ఉంటూ సగటున ప్రతిరోజూ జిల్లాలో 70నుంచి 90కాన్పులు చేస్తున్నారు. ప్రభుత్వ దవాఖానకు వచ్చిన వారు వైద్యసేవలు బాగున్నాయని ప్రశంసిస్తున్నారు. దవాఖానకు చికిత్సకు వచ్చే వారందరికీ సరిపడా సౌకర్యాలు ఉన్నాయి. మెడికల్ కళాశాల రావడంతో మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయి. వనపర్తి జిల్లాలో మరిన్ని వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి.
– రవిశంకర్, డీఎంహెచ్వో, వనపర్తి జిల్లా