రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ బాగుందని, సకల జనుల సంక్షేమానికి అద్దం పట్టిందని ప్రజాప్రతినిధులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, అన్ని వర్గాల ప్రజలు ముక్తకంఠంతో ఆమోదించారు. అన్ని వర్గాల సంక్షేమంతో పాటు విద్య, వైద్యం, వ్యవసాయం వంటి రంగాలకు భారీగా నిధులు కేటాయించి ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచిందంటూ కొనియాడారు. పలుచోట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేసి, కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’తో తమ అభిప్రాయాలు పంచుకున్నారు.
– కరీంనగర్, మార్చి 7 (నమస్తే తెలంగాణ)
7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థినులకు ఉచితంగా హెల్త్ అండ్ హైజెనిక్ కిట్లను పంపిణీ చేయాలని నిర్ణయించడం గొప్ప నిర్ణయం. సీఎం కేసీఆర్ సార్ గొప్ప నిర్ణయం తీసుకున్నరు. వ్యక్తిగత పరిశుభ్రతకు ఎంతగానో దోహద పడుతుంది. చాలా మంది చదువుకు దూరం కాకుండా ఉంటరు.
– బీ అంజలి, 10వ తరగతి విద్యార్థిని, కన్నాల (పాలకుర్తి)
మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళా యూనివర్సిటీని ప్రారంభిస్తామని చెప్పడం సంతోషంగా ఉంది. దేశంలో 29 రాష్ర్టాలు ఉండగా ఇంతవరకు 14 యూనివర్సిటీలు మాత్రమే ఉన్నాయి. దేశంలో మరిన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. వీటి ద్వారా మహిళల విద్యకు ప్రాధాన్యం పెరుగుతుంది. ప్రతి రాష్ట్రం కూడా తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా మహిళా యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది.
– బైరి రోహిత, బీజడ్సీ, మూడో సంవత్సరం (జగిత్యాల విద్యానగర్)
దేశం గర్వించేరీతిలో పథకాలను అమలు చేస్తున్న సీఎం కేసీఆర్, మహిళలు ఆర్థికంగా మరింత ప్రగతి సాధించేందుకు బడ్జెట్లో పెద్దపీట వేయడం సంతోషకరం. పావలా వడ్డీ స్కీమ్ను ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు వర్తింపజేయడానికి, మహిళలు చిన్నతరహా పరిశ్రమలను ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించడానికి రూ.137 కోట్లు కేటాయించడం గొప్ప విషయం. దీని ద్వారా మహిళలకు మరింత ఉపాధి దొరుకుతుంది.
– కొప్పెర రాధ, మాజీ అధ్యక్షురాలు, ఉజ్వల మండల మహిళ సమాఖ్య (కోరుట్ల)
సీఎం కేసీఆర్.. వ్యవసాయాన్ని ఒక పండుగలా మార్చారు. దేశంలో మరెక్కడా లేని విధంగా రైతు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. ప్రతి బడ్జెట్లో ఈ రంగానికి అధిక నిధులను కేటాయిస్తూ రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా కృషి చేస్తున్నారు. ఈ సారి అన్నింటికంటే ఎక్కువగా వ్యవసాయ రంగానికి రూ.24,254 కోట్లు కేటాయించడం సీఎం కేసీఆర్కు రైతుల మీద ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం.
– అట్ల రాజిరెడ్డి, రైతు, ర్యాలపల్లి (గంగాధర)
ముఖ్యమంత్రి కేసీఆర్ పుణ్యాన పురాతన ఆలయాలు పూజలకు నోచుకుంటున్నయ్. ధూప దీప నైవేద్యాల పథకంలో మాకు రూ.6 వేలు అందుతున్నయ్. మేం దైవ సేవలో భాగస్వాములమవుతున్నం. సనాతన సంప్రదాయాన్ని మరుగున పడకుండా కాపాడిన మహనీయుడు సీఎం కేసీఆర్. గుడులకు పూర్వ వైభవం తీసుకొచ్చిన ఘనత ఆయనదే. ఈసారి బడ్జెట్లో కొత్త దేవాలయాలను చేర్చడాన్ని స్వాగతిస్తున్నం.
– జంగం విద్యాసాగర్, పూజారి (సిరిసిల్ల్ల)
పారిశుధ్య కార్మికులకు జీతాలు పెంచుతామని నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్ సారుకు రుణపడి ఉంటం. రూ.12 వేలు ఉన్న జీతాన్ని ఇటీవల 30 శాతం పెంచి రూ.15,600 చేసిన్రు. మరోసారి జీతాలు పెంచుతమని చెప్పినంక మాకు సంతోషమనిపించింది. సఫాయి కార్మికుల తరఫున సారుకు కృతజ్ఞతలు.
-వెల్పుల అనిత, పారిశుధ్య కార్మికురాలు (కోరుట్ల)
సీఎం కేసీఆర్ అభినవ అంబేదరుడు. దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి పైలెట్ ప్రాజెక్టుగా మా హుజూరాబాద్ నియోజకవర్గంలో విజయవంతంగా అమలు చేస్తున్నడు. ఈసారి బడ్జెట్లో రూ.17,700 కోట్లు కేటాయించడం చరిత్రలో నిలిచిపోతుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ పథకానికి రూపకల్పన చేసిన సీఎం కేసీఆర్ గొప్ప నాయకుడిగగా నిలిచిపోతాడు. ఈ పథకం అమలుతో దళితులు ఆర్థికంగా ఎదుగుతారు.
– బత్తుల రాజలింగం, దళితబంధు లబ్ధిదారుడు, (హుజురాబాద్టౌన్)