సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉంది. 70 ఏళ్లలో జరుగని క్రీడాభివృద్ధి ఏడేళ్లలో జరిగింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన క్రీడా పాలసీతో కామన్వెల్త్ గేమ్స్లో రాష్ట్రం రెండో స్థానంలో నిలిచింది. అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధిస్తూ దేశానికే రోల్మోడల్గా నిలుస్తున్న తెలంగాణకు ప్రోత్సాహం అందించాల్సిన కేంద్రం అభివృద్ధిని అడ్డుకునేందుకు విషం చిమ్ముతున్నది. మోటర్లకు మీటర్లు పెడుతామని హెచ్చరిస్తూ వ్యవసాయాన్ని కుంటుపడేలా చేసేందుకు కుట్ర పన్నుతున్నది. కరీంనగర్లో క్రికెట్ స్టేడియం అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి స్టేడియం నిర్మించేందుకు చర్యలు తీసుకుంటాం.
కొత్తపల్లి, డిసెంబర్ 23 : దేశంలోనే సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం ముందుందని, గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 7800 గ్రామీణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని కరీంనగర్ ప్రాంతీయ క్రీడా పాఠశాలలో రూ.7.50 కోట్లతో ఖేలో ఇండియా పథకంలో భాగంగా నిర్మించిన 400 మీటర్ల సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ను సహచర మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ఉద్యమాల ఖిల్లా కరీంనగర్ జిల్లాపై సీఎం కేసీఆర్కు ప్రత్యేక అభిమానం ఉందన్నారు. తెలంగాణలో నాటి అభివృద్ధికి, నేటి అభివృద్ధికి తేడా చూడాలన్నారు. గత పాలకులైన చంద్రబాబునాయుడు, వైఎస్ఆర్ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడారని, తెలంగాణ పదాన్ని ఉచ్ఛరిస్తేనే నేరంగా పరిగణించే పరిస్థితులు అప్పుడు ఉండేవన్నారు.
మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ప్రత్యేక చొరవతో దేశ విదేశాలకు దీటుగా పర్యాటక శోభ సంతరించుకునేలా అద్భుతమైన మానేరు రివర్ఫ్రంట్ నిర్మాణాన్ని చేపట్టారన్నారు. గ్రామీణ స్థాయి క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా 7800 గ్రామాల్లో క్రీడా మైదానాలను ఏర్పాటు చేశామని వివరించారు. రాష్ట్రంలోని 90 నియోజవర్గాల్లో ఇండోర్ స్టేడియాల నిర్మాణాలకు శ్రీకారం చుట్టామని, ఇప్పటివరకు 45 పూర్తిచేసుకోగా, మిగిలినవి పురోగతిలో ఉన్నాయన్నారు. 70 ఏళ్లలో జరుగని క్రీడాభివృద్ధి ఏడేళ్లలో జరిగిందని, తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన క్రీడా పాలసీతో కామన్వెల్త్ గేమ్స్లో రాష్ట్రం 2వ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. క్రీడలతో పాటు విద్యకు ప్రాధాన్యమిచ్చి రూ.7500 కోట్లతో పాఠశాలలను అభివృద్ధి చేయడంతో పాటు రా్రష్ట్రంలో వెయ్యి గురుకులాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా భారతదేశంలో అత్యధిక మెడికల్ కళాశాలలున్న రాష్ట్రంగా తెలంగాణ ముందు వరుసలో ఉందని, దేశానికి వైద్యులను ఎక్కువగా అందించడంలో సైతం మనమే ముందుంటామని చెప్పారు.
తెలంగాణకు ప్రోత్సాహం అందించాల్సిన కేంద్రం అభివృద్ధిని అడ్డుకునేందుకు విషం చిమ్ముతుందని విమర్శించారు. మోటర్లకు మీటర్ల పెడుతామని హెచ్చరిస్తూ వ్యవసాయాన్ని కుంటుపడేలా చేసేందుకు కుట్ర పన్నుతుందన్నారు. కొత్తగా ఏర్పాటైన రాష్ర్టానికి జాతీయ ప్రాజెక్టును ఇప్పటివరకు మంజూరు చేయలేదన్నారు. కులం, మతం పేరిట తెలంగాణలో అలజడి సృష్టించేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారన్నారు. వ్యవసాయ రంగంలో సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో దేశానికి కరువస్తే అన్నం పెట్టే స్థాయికి రాష్ట్రం చేరుకోవడం మనందరం గర్వించాల్సిన విషయమన్నారు. క్రీడలు, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఉద్యోగ నియామకాల్లో 2 శాతం రిజర్వేషన్ అమలు చేస్తుండడంతో పాటు ఉన్నత విద్యలో సైతం 0.5 రిజర్వేషన్లను అమలు చేస్తున్నామన్నారు. కోచ్ల నియామకంతో పాటు జీతాల పెంపుపై సీఎంతో చర్చిస్తాన్నారు. కులవృత్తులకు పూర్వవైభవం తీసుకురావడంతో పాటు దళితబంధు పథకం ద్వారా వారిని ఆర్థికంగా వృద్ధిలోకి తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రహం ఏర్పాటు చేయడంతో పాటు సచివాలయానికి ఆయన పేరు పెట్టుకుంటామని తెలిపారు. అవసరం ఉన్నచోట ఎయిర్పోర్టులను నిర్మించుకుంటున్నామని చెప్పారు. కరీంనగర్లో క్రికెట్ స్టేడియం అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
విద్య, వైద్యంతోపాటు క్రీడలకు పెద్దపీట: గంగుల
మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. సమైక్య పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో వివక్షకు గురైందని, క్రీడలు, క్రీడాకారులను ప్రోత్సహించలేదని పేర్కొన్నారు. స్వయం పాలనలో విద్య వైద్యంతో పాటు క్రీడా రంగాన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. రీజినల్ స్పోర్ట్స్ స్కూల్లో ఏర్పాటు చేసిన సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ తెలంగాణాలోనే నాలుగవదని, ఈ సింథటిక్ ట్రాక్ జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడలకు సిద్ధమయ్యేవారికి ఉపయోగపడుతుందన్నారు. పాత పీజీ కళాశాలకు చెందిన 12 ఎకరాల స్థలంలో క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని, క్రీడా పాఠశాల విద్యార్థుల కోసం కోచ్లను నియమించేలా చర్యలు తీసుకోవాలని క్రీడా శాఖ మంత్రిని కోరారు. కరీంనగర్ను విద్య, వైద్యంతో పాటు అధ్యాత్మికంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులు సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ను సద్వినియోగం చేసుకొని జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో రాణించాలని మంత్రి సూచించారు.
ఐదేళ్లలో క్రికెట్ స్టేడియం నిర్మాణం: వినోద్కుమార్
కరీంనగర్ అంటే సీఎం కేసీఆర్కు ప్రత్యేక అభిమానంతో అభివృద్ధి చేస్తున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ తెలిపారు. నాడు కరీంనగర్ ఎంపీగా ఉన్న సీఎం కేసీఆర్ ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎన్నో ప్రణాళికలు సిద్ధం చేసినా నాటి పాలకులు పట్టించుకోలేదని పేర్కొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కరీంనగర్ ఎంపీగా గెలిచిన తాను సీఎం కేసీఆర్ ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా కృషి చేశానన్నారు. కరీంనగర్లో క్రికెట్ స్టేడియం నిర్మాణం కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వారు డబ్బులు ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఐదేళ్లలోగా కరీంనగర్లో క్రికెట్ స్టేడియం నిర్మాణాన్ని పూర్తి చేసి రంజీ ట్రోఫీ ఆడేలా ముందుకు సాగుదామన్నారు.
నగర మేయర్ వై సునీల్రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర సివిల్ సైప్లె కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్, అసిస్టెంట్ కలెక్టర్ లెనిన్, నగరపాలక సంస్థ కమిషన్ సేవా ఇస్లావత్, జిల్లా యువజన క్రీడాశాఖాధికారి కీర్తి రాజవీరు, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు నందెల్లి మహిపాల్, గసిరెడ్డి జనార్దన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు తుమ్మల రమేశ్రెడ్డి, పెటా టీఎస్ ప్రధాన కార్యదర్శి అంతడుపుల శ్రీనివాస్, ఎస్జీఎఫ్ కార్యదర్శి పోతన శ్రీనివాస్, మాజీ కార్యదర్శి కనకం సమ్మయ్య, శాట్స్ డీడీ స్పోర్ట్స్ ధనలక్ష్మి, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.