Odela | ఓదెల, జులై 25 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో నూతన తహసిల్దార్ భవనాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరామరావు, పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష శనివారం ప్రారంభోత్సవం చేశారు. రూ.75 లక్షలతో నూతనంగా తహసీల్దార్ కార్యాలయాన్ని నిర్మించగా ప్రారంభించారు. దాదాపు 40 సంవత్సరాల తర్వాత ఓదెలలో తహసీల్దార్ కార్యాలయం సొంత భవనంలోకి మారింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ సూపర్ ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు అధిక నీటి అవసరమయ్యే వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసి నష్టాలను నివారించుకోవాలని సూచించారు.
గత రెండున్నర సంవత్సరాలుగా పెద్దపల్లి జిల్లాలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఓదెలలో కోర్టు మంజూరైందని, త్వరలోనే నూతన కోర్టు భవన నిర్మాణాన్ని కూడా చేపడతామని చెప్పారు. ఇటీవల కురిసిన వర్షాలను చూసి నీటి సమస్య ఉండదనే అపోహలో రైతులు ఉండొద్దని సూచించారు. పెద్దపల్లి జిల్లా విద్యాశాఖ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిందని అన్నారు. గత రెండేళ్లలో ఓదెల మండలంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రూ.5.5 కోట్ల నిధులు వెచ్చించామని తెలిపారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవతో పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిందని విజయ రమణారావు పేర్కొన్నారు.
కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు ప్రభుత్వం దశలవారీగా భూ పునఃసర్వే చేపట్టిందన్నారు. పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన గ్రామాల్లో నిర్వహించిన పునఃసర్వే ద్వారా వచ్చిన అనుభవాల ఆధారంగా ప్రస్తుతం ప్రతీ జిల్లాలో మొదటి దశలో 70 గ్రామాల్లో భూ పునఃసర్వే చేపడుతున్నట్లు తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో ఇప్పటికే 23 గ్రామాల్లో భూ పునఃసర్వే ప్రారంభించామని కలెక్టర్ తెలిపారు. ముందుగా గ్రామ సరిహద్దులను ఖరారు చేసి, అనంతరం ఆధునిక సాంకేతిక పరికరాలతో భూముల సర్వే నిర్వహిస్తామని చెప్పారు. సర్వే పూర్తయిన అనంతరం రైతులకు పూర్తి వివరాలు తెలియజేసి, అభ్యంతరాలు స్వీకరించి, వాటిని పరిశీలించి అవసరమైన సవరణలు చేసిన తర్వాతే తుది భూ వివరాలను పోర్టల్లో నమోదు చేస్తామని తెలిపారు. ఈ భూ పునఃసర్వే ద్వారా దాదాపు 99 శాతం భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, రైతులు పూర్తి సహకారం అందించాలని కోరారు. గత ఏడాదితో పోలిస్తే జిల్లాలో భూగర్భ జలాలు సుమారు 2.5 మీటర్ల మేర తగ్గాయని తెలిపారు. నీటి లభ్యత తగ్గడంతో జలవిద్యుత్ ఉత్పత్తి తగ్గి విద్యుత్ సరఫరాపై ప్రభావం పడుతోందన్నారు. గ్రామాల్లోని చెరువుల్లో ప్రస్తుతం కేవలం 15 నుంచి 20 శాతం మాత్రమే నీటి నిల్వలు ఉన్నాయని, అందుబాటులో ఉన్న నీటిని అత్యంత పొదుపుగా వినియోగించాలని రైతులకు సూచించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీరాములు, తహసీల్దార్ బానోత్ వనజ నాయక్, ఎంపీడీవో వెన్నెపు రెడ్డి అనిల్ రెడ్డి, సర్పంచ్ కనికి రెడ్డి సతీష్, సర్పంచులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.