వ్యక్తిగత పనుల కోసం తరగతి గదుల్లో సెల్ఫోన్ వినియోగించడం పూర్తిగా నిషేధం. అందుకు సంబంధించి స్పష్టమైన ఉత్తర్వులున్నా పట్టించుకునే వారు లేరు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మెజార్టీ ఉపాధ్యాయులు విచ్చలవిడిగా సెల్ఫోన్లు వినియోగిస్తున్నారు. కొందరు క్లాస్ రూములోనే ఫోన్ మాట్లాడితే.. మరికొందరు బోధనను మధ్యమధ్యలో ఆపేసి బయటకు వచ్చి మాట్లాడి వెళ్తున్నారు. ఇలా చేయడం వల్ల విద్యార్థుల ఏకాగ్రత దెబ్బతింటుందన్న విషయాన్ని కూడా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తల్లిదండ్రులు, పిల్లల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. దీనిపై జగిత్యాల జిల్లాలో విద్యాధికారి జగన్మోహన్రెడ్డి స్పందించి తాజాగా స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేయగా.. మిగిలిన జిల్లాల్లో డీఈవోలు ఇంకా చోద్యం చూస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కరీంనగర్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తరగతి గదుల్లో ఉపాధ్యాయులు సెల్ఫోన్లు వాడుతుండడంతో విద్యార్థులకు నష్టం జరుగుతున్నది. దీనిని గమనించిన రాష్ట్ర విద్యాశాఖ, ఈ విషయంపై అనేక మంది విద్యాసంస్థలు, మేధావుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నది. క్లాస్ రూముల్లో సెల్ఫోన్లు వాడొద్దని 2013లోనే స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. తిరిగి 2014, 2020లోనూ మరింత పకడ్బందీగా ఆదేశాలు ఇచ్చింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత అలాగే కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో పనిచేసే ఉపాధ్యాయులు నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల ఆవరణలో సెల్ఫోన్లు ఉపయోగించరాదని స్పష్టం చేసింది. ప్రతి ఉపాధ్యాయుడు తన సెల్ఫోన్ను ఆయా విద్యాసంస్థల హెడ్మాస్టర్లు, లేదా ప్రిన్సిపాల్ వద్ద ఉంచి తరగతి గదులకు వెళ్లాలని, అధికారికంగా ఏమైనా మాట్లాడాల్సి ఉంటే.. కచ్చితంగా సంబంధిత అధిపతుల అనుమతి తీసుకొని వినియోగించాలన్న నిబంధన ఉన్నది.
కొన్నాళ్ల పాటు ఇది బాగానే అమలైనా మధ్యలో కొంత అదుపు తప్పింది. దీంతో రాష్ట్ర విద్యాశాఖ 2020లో మరోసారి మరింత పకడ్బందీగా ఆదేశాలు జారీ చేసింది. ఈ మధ్యకాలంలో మెజార్టీ ఉపాధ్యాయులు నిబంధనలు బేఖాతర్ చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇటీవల జగిత్యాల జిల్లాలో ఓ ఉన్నతాధికారి రెండు మూడు పాఠశాలలను పర్యవేక్షించినప్పుడు.. ప్రతి ఉపాధ్యాయుడు తరగతి గదుల్లోనే సెల్ఫోన్ వినియోగిస్తున్నట్టు గుర్తించారు. అంతేకాదు, కొంతమంది ఉపాధ్యాయులైతే ఏకంగా తరగతి గదిని విడిచిపెట్టి.. బయటకు వచ్చి పది నుంచి పదిహేను నిమిషాల పాటు మాట్లాడి.. మళ్లీ తరగతి గదిలోకి వెళ్తున్నట్టు గుర్తించారు. ఈ విధానం కేవలం సదరు పాఠశాలలకు మాత్రమే పరిమితం కాలేదు. ఉమ్మడి జిల్లాలోని మెజార్టీ పాఠశాలల్లో ఇదే తంతు నిత్యం కొనసాగుతున్నది.
జగిత్యాల జిల్లా విద్యాధికారి తాజాగా ఆదేశాలు జారీ చేయగా.. మిగిలిన విద్యాధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. నిజానికి క్లాస్ రూముల్లో ఉపాధ్యాయులు సెల్ఫోన్ వినియోగించడం వల్ల విద్యార్థుల చదువుపై ప్రభావం పడుతున్నదని గతంలోనే అనేక అధ్యయన సంస్థలు వెల్లడించాయి. సబ్జెక్టు బోధిస్తున్నప్పుడు సదరు టీచర్ ఫోన్ పట్టుకొని మధ్యమధ్యలో బయటకు వెళ్లడం, మళ్లీ వచ్చి బోధన చేయడం వల్ల విద్యార్థుల్లో ఏకాగ్రత దెబ్బతింటున్నదని మానసిక శాస్త్రవేత్తలు కూడా గతంలోనే హెచ్చరించారు.
అలాగే, ఉపాధ్యాయులు పాఠశాలల్లో నడుచుకునే విధానాన్ని పిల్లలు అనుసరిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతుండగా, వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. అయితే, వాటిని అమలు చేయడంలో జిల్లాల యంత్రాంగం తరచుగా విఫలమవుతున్నది. ఇప్పటికే అంతంత మాత్రంగా నడుస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లో ఇటువంటి కార్యకలాపాలు నివారించకపోతే.. అసలు ఉనికికే ముప్పు వాటిల్లుతుందన్న అభిప్రాయాలను పలువురు ఉపాధ్యాయులే వ్యక్తం చేస్తున్నారు. విద్యాధికారులందరూ ఈ కోణంలో చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
పాఠశాలల పర్యవేక్షణ అనేది ఉన్నతాధికారులు గాలికొదిలేశారు. ప్రతి జిల్లా విద్యాధికారి, ఉపవిద్యాధికారి, మండల విద్యాధికారి నెలలో కొన్ని పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీలు చేయాలన్న నిర్దిష్ట నిబంధనలున్నా ఆ దిశగా తనిఖీలు కరువయ్యాయి. కొన్ని చోట్ల మొక్కుబడిగా జరుగుతున్నా.. మరికొన్ని జిల్లాల్లో అధికారులు అసలు పర్యవేక్షణకే వెళ్లడం లేదన్న విమర్శలున్నాయి. దీని వల్లే మెజార్టీ ఉపాధ్యాయులు సెల్ఫోన్లను విచ్చలవిడిగా వాడుతున్నారనే విమర్శలున్నాయి. కొంతమంది టీచర్లు నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటున్నా… మెజార్టీ ఉపాధ్యాయులు అనుసరిస్తున్న విధానం వారికి కూడా చెడ్డ పేరు తెచ్చిపెడుతున్నది. నిబంధనల ప్రకారం.. సెల్ఫోన్లు అప్పగించి వెళ్లాలని ఎవరైనా ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్ అడిగితే… పలువురు టీచర్లు బూతుపురాణం అందుకుంటూ తిరుగుబాటు చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.
ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో..? అన్న చందాన వ్యవహరిస్తున్నట్టు తెలుస్తున్నది. అలాగే, ఈ తరహా నడుచుకునే పంతుళ్లకు కొన్నిసంఘాలు కూడా వంతపాడుతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉపాధ్యాయులు క్లాస్ రూముల్లో సెల్ఫోన్లు వాడుతుండడం, ఇష్టానుసారం వినియోగిస్తుండడం వంటివి విద్యార్థులపై ప్రభావం చూపుతున్నాయి. ఈ విషయంపై ఇటీవల కొంతమంది తల్లిదండ్రులు సైతం ఫిర్యాదు చేశారు. దీంతో జగిత్యాల జిల్లా డీఈవో జగన్మోహన్రెడ్డి తాజాగా, ఆ జిల్లాలోని అన్ని పాఠశాలలకు ఆదేశాలు జారీ చేశారు.
గత ప్రభుత్వ జీవోలను పేర్కొంటూ.. వాటి ప్రకారం ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్ అనుసరించాల్సిన నియమ నిబంధనలను గుర్తు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. గతంలో ఉన్న ఆదేశాల ప్రకారం తరగతి గదుల్లో విద్యార్థుల ఫేస్ రికగ్నైజేషన్ చేయాల్సి వచ్చినప్పుడు, ఇంటర్నెట్ వినియోగించి ఏదైనా పాఠం చెప్పాల్సి వచ్చినప్పుడు, అలాగే అధికారిక సమాచారం ఏదైనా ఇవ్వాల్సి ఉన్నప్పుడు మాత్రమే సదరు విద్యాసంస్థ ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్ అనుమతి తీసుకొని సెల్ఫోన్ వినియోగించాలని సదరు ఆదేశాల్లో డీఈవో స్పష్టం చేశారు. మిగిలిన సమయాల్లో ఉపాధ్యాయుల సెల్ఫోన్లను ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్ వద్ద ఉంచాలని ఆదేశించారు.