రామడుగు, ఫిబ్రవరి 6 : రామడుగు మండలం గోపాల్రావుపేట అక్షర ఉన్నత, ప్రాథమిక పాఠశాల విద్యార్థులు జాతీయస్థాయి కరాటే పోటీల్లో ప్రతిభ చూపి బంగారు పతకాలు సాధించారు. ఈ నెల 5వ తేదీ ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో ఫంక్షన్హాల్లో గోజిరాయి కరాటే ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిర్వహించిన 9వ జాతీయ స్థాయి కరాటే, కుంగ్ఫూ చాంపియన్షిప్-23 పోటీల్లో అక్షర విద్యార్థులు పాల్గొన్నారు. దీనిలో భాగంగా జూనియర్ కటా విభాగంలో శ్రీమాన్తేజ, కార్తీక్, శివచరణ్, పూర్ణచంద్, వెన్నల, శ్రీవైష్ణవి, గౌతమి బంగారు పతకాలు సాధించగా, రిష్యాంత్ రజత పతకం, ప్రణిత, లాస్య కాంస్య పతకాలు సాధించినట్టు పాఠశాల కరస్పాండెంట్ మినుకుల మునీందర్ తెలిపారు. ఈ పోటీల్లో అక్షర విద్యార్థులు ఓవరాల్ చాంపియన్ షిప్ కప్పును కూడా కైవసం చేసుకున్నారన్నారు.
దీనిలో భాగంగా సోమవారం చొప్పదండిలోని సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో సీఐ గోపతి రవీందర్ పతకాలు సాధించిన విద్యార్థులతో పాటు శిక్షణ అందించిన జపాన్ కరాటే అసోసియేషన్ తెలంగాణ మాస్టర్ సుంకె రాజును అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. బాల్యంలో తానుకూడా కరాటే తరగతులకు వెళ్లినట్టు గుర్తుచేశారు. కార్యక్రమంలో అక్షర విద్యాసంస్థల కరస్పాండెంట్ మినుకుల మునీందర్, కరాటే మాస్టర్ రాజు, విద్యార్థులు పాల్గొన్నారు.
‘గోజీరాయ్’ విద్యార్ధులకు పతకాలు
కొత్తపల్లి, ఫిబ్రవరి 6 : జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో ఫంక్షన్హాల్లో ఆదివారం నిర్వహించిన జాతీయస్థాయి కరాటే పోటీల్లో ఇంటర్నేషనల్ గోజిరాయ్ కరాటే అకాడమీలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులు అత్యంత ప్రతిభ చూపి గ్రాండ్ చాంపియన్షిప్తో పాటు పలు విభాగాల్లో బంగారు, రజత, కాంస్య పతకాలు సాధించినట్లు చీఫ్ ఇన్స్ట్రక్టర్ అన్వర్ఖాన్ పేర్కొన్నారు. ఈ పోటీలకు పలు రాష్ర్టాల నుంచి 600 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు.
ఈ పోటీల్లో జిల్లాకు చెందిన ఇంటర్నేషనల్ గోజీరాయ్ అకాడమీ విద్యార్థులు కటాస్, స్పారింగ్, టీం కటా, కుమిటీ విభాగాల్లో పాల్గొని అత్యధిక పతకాలు సాధించి, ఓవరాల్ చాంపియన్షిప్ కైవసం చేసుకున్నారని తెలిపారు. అండర్-12 స్పారింగ్లో జోయాఖాన్, జరాఖాన్, అండర్-17 విభాగంలో అర్మాన్ఖాన్ సత్తాచాటి ఓవరాల్ చాంపియన్షిప్ కైవసం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించారన్నారు. విజేతలకు టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి దారం శ్రీనివాస్రెడ్డి పతకాలు అందజేశారు. పతకాలు సాధించిన క్రీడాకారులను గ్రాండ్ మాస్టర్ అక్బర్ ఖాన్, ఫమిదా ఖాతూన్, కోటేశ్వర్, పీ జయేందర్, రాజిరెడ్డి సోమవారం అభినందించారు.