Support Price | రామగిరి, ఏప్రిల్ 24 : రైతులు పండించిన వరి ధాన్యానికి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర (MSP) కొనుగోలు కేంద్రాల ద్వారానే లభిస్తుందని కమాన్పూర్ ఏఎంసీ చైర్మన్ వైనాల రాజు, రత్నాపూర్ సర్పంచ్ పల్లె ప్రతిమ పీవీ రావు తెలిపారు. రత్నపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వారు శుక్రవారం సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు మధ్యవర్తులపై ఆధారపడకుండా నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తమ ధాన్యాన్ని తీసుకురావాలని సూచించారు.
ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కనీస మద్దతు ధరను అమలు చేస్తున్నదని, అందువల్ల రైతులు నష్టం వాటిల్లదని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం, నాణ్యత పరీక్షలు పారదర్శకంగా నిర్వహించబడతాయని, రైతులకు చెల్లింపులు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు. ఏవైనా సమస్యలు తలెత్తిన పక్షంలో స్థానిక అధికారులను సంప్రదించాలని సూచించారు. రైతులు తమ పంటను సకాలంలో తీసుకువచ్చి విక్రయించుకోవాలని, కేంద్రాల్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలను వినియోగించుకోవాలని కోరారు.