కార్పొరేషన్, డిసెంబర్ 17: కరీంనగర్ నగరపాలక సంస్థలో ద్విచక్ర వాహనాల పేరిట రూ.12 లక్షల బిల్లులు తీసుకున్నారని ఆరోపించిన ఎంపీ బండి సంజయ్ దానిని నిరూపించాలని మేయర్ యాదగిరి సునీల్రావు సవాల్ చేశారు. ఈ ఆరోపణలను నిరూపిస్తే తాను మేయర్ పదవికి రాజీనామా చేస్తానని, లేకపోతే ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేయాలని సవాల్ చేశారు. ఆరోపణలను నిరూపించకపోతే భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులపై ఆరోపణలు చేస్తూ అవమానిస్తున్నారని విమర్శించారు. నగరపాలక సంస్థలో అవినీతి జరిగిందని ఆరోపణలు చేస్తున్న బండి సంజయ్ దమ్ముంటే తన సవాల్ను స్వీకరించాలని పేర్కొన్నారు.
నగరంలోని ఎస్బీఎస్ ఫంక్షన్ హాల్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బండి సంజయ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి అసహనంతో ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో తన వద్ద రూపాయి లేదని చెప్పి గెలిచిన బండి సంజయ్ ఇప్పుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రూ.50 కోట్లు ఎలా ఖర్చు చేశారో చెప్పాలన్నారు. గుట్కా, గంజాయి వ్యాపారులను వెంట వేసుకొని తిరుగుతున్న బండి సంజయ్ వచ్చే ఎన్నికల్లో గెలుస్తానని అనుకోవడం ఆయన భ్రమే అవుతుందన్నారు.
బండి సంజయ్కి ప్రజలను మోసం చేయడం, రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవడం వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. ఇవి ఏవి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పని చేయలేదని, దీంతో దిక్కుతోచక అసహనంతో నిరాధరమైన ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. బల్దియా పాలకవర్గం సమన్వయంతో పని చేసి బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ను గెలిపించుకున్నామని తెలిపారు. తామంతా ప్రజల మధ్యలోనే ఉంటున్నామని, కానీ బండి సంజయ్ ఏ రోజు కూడా ప్రజల మధ్యలో లేరని అన్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్కు చెందిన కొంత మంది ప్రజాప్రతినిధులను, నాయకులను లక్షల రూపాయలు ఇచ్చి కొనుగోలు చేశారని విమర్శించారు.
ఇందులో కొంత మంది నాయకులు ప్రలోభాలకు లొంగకపోవడంతో ఇప్పుడు వారిపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఐదేళ్లుగా ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఇప్పటి వరకు ఎందుకు అవినీతిపై ప్రశ్నించలేదని నిలదీశారు. అవినీతి జరిగినప్పుడే ఎందుకు ఫిర్యాదు చేయలేదని, దద్దమ్మల్లా ఎందుకు కూర్చున్నారని ప్రశ్నించారు. తమ పాలకవర్గంలో నగరం ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. ఎంతో గొప్పగా కరీంనగర్ను తీర్చిదిద్దామన్నది ప్రజల కళ్ల ముందు సజీవ సాక్ష్యంగా నిలిచిందన్నారు. ఎంపీగా బండి సంజయ్ ఐదేళ్లలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కార్పొరేటర్లు గంట కళ్యాణి, కుర్ర తిరుపతి, ఐలేందర్, వాల రమణారావు, నాయకులు గందె మహేశ్, సల్ల రవీందర్, కోల సంపత్, తదితరులు పాల్గొన్నారు.