మెట్పల్లి రూరల్, జూలై 8: మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామానికి చెందిన మరిపెల్లి ప్రవీణ్ ఆఫ్రికా ఖండంలోనే ఎత్తయిన పర్వతం కిలిమంజారోను అధిరోహించాడు. అక్కడ సూర్యనమస్కారాలు చేసి మువ్వెన్నెల జెండా ను ఆవిష్కరించి మన దేశ కీర్తిని దశదిశలా చాటాడు.
ఈ నెల 4న టాంజానీయ దేశంలోని కిలిమంజారో పర్వతారోహణ ప్రారంభించిన అతడు 34 కిలోమీటర్ల మేర ట్రెక్కింగ్ చేస్తూ ఈ నెల 7న శిఖరానికి చేరుకున్నాడు. 5895 మీటర్ల ఎత్తులో, మైనస్ 9 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 39.20 నిమిషాల్లో 108 సూర్య నమస్కారాలను పూర్తి చేశాడు. అనంతరం మన జాతీయ జెండాను ఆవిష్కరించాడు. కాగా, ఇప్పటి వరకు ప్రవీణ్ 19 ఎత్తయిన పర్వతాలను అధిరోహించి 108 సూర్య నమస్కారాలను ప్రదర్శించాడు.