Sultanabad | సుల్తానాబాద్ రూరల్, ఫిబ్రవరి 14 : విద్యార్థులు చదువుతోపాటు క్రమశిక్షణను అలవర్చుకోవాలని శ్రీవాణి కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ రేకులపల్లి శశాంక అన్నారు. సుల్తానాబాద్ మండలంలోని నర్సాయిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని విజయ గార్డెన్లో శనివారం సుల్తానాబాద్ శ్రీవాణి జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో కళాశాల వార్షికోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి శశాంక ముఖ్య అతిథిగా హాజరై ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతీ ఒక్క విద్యార్థి అంకితభావంతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. అంతకుముందు విద్యార్థులు చేసిన నృత్యాలు పలువురిని అల్లరించాయి. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ రేకులపల్లి సుష్మ, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బాలసాని శ్రీనివాస్, డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపల్ బండారి కమలాకర్, అధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.