ధర్మారం మోడల్ స్కూల్ విద్యార్థులు తమ మేధస్సుకు పదునుపెట్టారు. సైన్స్ టీచర్ సహకారం, స్కూల్ ప్రిన్సిపాల్ ప్రోత్సాహంతో రాకెట్, శాటిలైట్ నమూనాలను రూపొందించారు. వీరి మాడల్స్ను చూసి తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు అభినందించారు.
ధర్మారం, జనవరి 28: పెద్దపల్లి జిల్లా ధర్మారం మోడల్స్కూల్లో విద్యార్థులకు శాస్త్రపరిజ్ఞానంపై ఆసక్తిని పెంపొందించేందుకు ఐడియా శాట్-డీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సహకారంతో ఐడియా బాక్స్లను ఏర్పాటు చేశారు. అందులో పలువురు విద్యార్థులు తమ శాస్త్రీయమైన ఆలోచనలతో కూడిన వివరాలను రాతపూర్వకంగా వేశారు. దీని ఆధారంగా సైన్స్ టీచర్ శివకృష్ణ శాస్త్ర పరిశోధనపై అభిరుచి కలిగిన పదోతరగతి చదువుతున్న హరిబాబు, విష్ణువర్ధన్, వెంకటేశ్, యశ్వంత్ సాయిని ఎంపిక చేశారు. వీరికి శాస్త్రసాంకేతికతపై అవగాహన కల్పించారు.
దీంతో ఆ విద్యార్థులు నమూన రాకెట్, శాటిలైట్ నమూనాలను తయారు చేశారు. వీటికి ‘ఐడియా శాట్-డీ’గా నామకరణం చేశారు. నమూనాలపై తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ), టీ- హబ్ చిహ్నాలను అమర్చారు. ఈ మోడల్స్ను శనివారం స్కూల్లో ప్రదర్శించగా ప్రిన్సిపాల్ దీన, ఉపాధ్యాయులు, పాఠశాల విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. సైన్స్ టీచర్ శివకృష్ణతో పాటు విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, విద్యార్థులు మరిన్ని నమూనాలు తయారు చేయాలని, భవిష్యత్తులో గొప్ప సైంటిస్ట్లుగా ఎదగాలని ఆకాంక్షించారు.