కమాన్పూర్, మే 16: వందలాది రకాల ఔషధ గుణాలున్న మొక్కలకు నిలయమైన రామగిరి ఖిల్లాను పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుతామని రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్టీడీసీ) చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఇక్కడ కాకాతీయ, శాతవాహనుల తదితర రాజ వంశీయుల చరిత్రతో కూడిన ఖిల్లాగా రామగిరి ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకుందన్నారు. ఇలాంటి అద్భుత ప్రదేశాన్ని పర్యాటక కేంద్రంగా రూపుదిద్దేందుకు సీఎం కేసీఆర్తో చర్చించి చర్యలు తీసుకుంటామన్నారు. మంగళవారం కమాన్పూర్ మండల కేంద్రంలోని ఆదివరాహస్వామిని దర్శించుకుని ప్ర త్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వా గతం పలికారు. పూజల అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ ఇనగంటి ప్రేమలత శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో పర్యాటక రంగం అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నదన్నారు.
సీఎం కేసీఆర్ కళల సౌధామినియైన కాళేశ్వరం ప్రాజెక్ట్ను పర్యాటక రంగంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం 760 కోట్ల నిధులను కేటాయించిందని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. పనులు పూర్తయితే పర్యాటకులు చారిత్రాత్మక నేపథ్యం కలిగిన, సహజసిద్ధంగా వెలిసిన ఇక్కడి ఆదివరాహస్వామిని దర్శించుకున్నాకే కాళేశ్వరం ప్రాజెక్ట్ను తిలకించేలా ఇక్కడి క్షేత్రాన్ని కూడా అద్భుతంగా తీర్చిదిద్దుతామన్నారు. కమాన్ఫూర్ మండల కేంద్రంలోని ఆదివరహస్వామి క్షేత్రం సహజ సిద్దంగా వెలిసిన ఆలయంగా బాసిల్లుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల వారీగా ఉన్న చారిత్రాత్మక ప్రదేశాలను గుర్తించి వాటి నేపథ్యాన్ని విద్యార్థులకు తెలియజేసేలా సిలబస్లో చేర్చి వాటిని పిక్నిక్ ప్రదేశాలుగా మార్చుతామన్నారు. జిల్లాల వారీగా పర్యాటక రంగ అభివృద్ధి కోసం చేపట్టే చర్యల గురించి సీఎం కేసీఆర్తో చర్చిస్తామని వెల్లడించారు.
రాష్ట్ర ఉద్యమ సమయంలో ఇక్కడి ఆదివారహ స్వామిని మొదటిసారిగా దర్శించుకున్నానని, ఇప్పుడు రెండోసారి దర్శించుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివరాహ స్వామి దేవస్థానం చైర్మన్ ఇనగంటి ప్రేమలత, పీఏసీఎస్ చైర్మన్ ఇనగంటి భాస్కర్రావు, మాజీ జడ్పీటీసీ గంట వెంకట రమణారెడ్డి, మేకల సంపత్ యాదవ్, బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు పిన్రెడ్డి కిషన్రెడ్డి, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు ఉప్పరి శ్రీనివాస్ యాదవ్, ప్రజాప్రతినిధులు నీలం సరిత శ్రీనివాస్, బొల్లపెల్లి శంకర్గౌడ్, తాటికొండ శంకర్, కోలేటి చంద్రశేఖర్, బొజ్జ రాజసాగర్, జాబు సతీష్, బీఆర్ఎస్ నాయకులు ఇనగంటి రామారావు, గడప కృష్ణమూర్తి, నీలం శ్రీనివాస్, కాస రవి, జంగపెల్లి లక్ష్మణ్, కమ్మగోని అనిల్ గౌడ్, జంగపెల్లి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.