ధర్మారం, జూలై 5 : సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అన్ని కుల సంఘాలకు సముచిత ప్రాధాన్యమిస్తున్నదని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. త్వరలో బీసీ కులాలకు చెందిన చేతివృత్తుల వారికి ఆర్థిక సహాయం అందించనున్నదని చెప్పారు. ధర్మారం మండల కేంద్రంలో బుధవారం మంత్రి పర్యటించారు. పద్మశాలీ, మున్నూరు కాపు, గంగపుత్ర, గౌడ కమ్యూనిటీ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయా కుల సంఘ నాయకులు తమ సమస్యలను విన్నవించగా మంత్రి సానుకూలంగా స్పందించారు. మొదట అసంపూర్తిగా ఉన్న పద్మశాలీ కమ్యూనిటీ భవనాన్ని ఆయన పరిశీలించారు. ఇప్పటికే ఈ భవన నిర్మాణానికి 15 లక్షల నిధులను కేటాయించామని, దీనిని త్వరగా పూర్తి చేయాలని కుల సంఘ నాయకులకు ఆయన సూచించారు. అసెంబ్లీ ఎన్నిక షెడ్యూలు వచ్చేలోగా ప్రారంభానికి సిద్ధం చేయాలని సూచించారు. మరో 10 లక్షల నిధులు ఈ భవనానికి కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మున్నూరు కాపు సామాజిక భవనాన్ని ఆయన పరిశీలించారు.
ఈ భవన నిర్మాణానికి 5 లక్షలు కేటాయించామని, వెంటనే పనులు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని సూచించారు. అనంతరం గంగపుత్ర సంఘం నాయకులు, మహిళలతో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 50 లక్షల నిధులు ఫిష్ మారెట్ నిర్మాణానికి మంజూరు చేయించినందున, ఆ షెడ్డు నిర్మాణానికి రెవెన్యూ ప్రభుత్వ స్థలం కేటాయించాలని గంగపుత్ర సంఘం నాయకులు మంత్రి ఈశ్వర్ను కోరారు. స్పందించిన మంత్రి వెంటనే తహసీల్దార్ కేవై ప్రసాద్తో ఫోన్లో మాట్లాడి ఫిష్ మారెట్కు రోడ్డుకు అనుసంధానంగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని సర్వే చేసి వెంటనే కేటాయించాలని మంత్రి ఈశ్వర్ ఆదేశించారు. గంగాదేవి గుడి ప్రహరీ నిర్మాణానికి 5 లక్షల నిధులు కేటాయిస్తామని గంగపుత్రులకు మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం మంత్రి ఈశ్వర్ రేణుక ఎల్లమ్మ దేవి గుడిని సందర్శించి పూజలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక గౌడ సంఘం నాయకులు, గీత కార్మికులు ఆయనకు ఘన స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. వారి వినతి మేరకు గుడి ప్రహరీ నిర్మాణానికి 10 లక్షల నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయాచోట్ల రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ అన్ని కుల సంఘాల వారిని సమానంగా చూస్తున్నారని, కుల సంఘాలకు కేటాయిస్తున్న నిధులే అందుకు నిదర్శమన్నారు. రాష్ట్ర రాజధానిని హైదరాబాద్లో కుల సంఘ భవనాలను నిర్మిస్తూ వారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. గొల్ల కురుమలకు ఉచితంగా గొర్రెల పంపిణీ, గంగపుత్రులకు ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేయడం, చేపలు పట్టడానికి వలలు అందజేయడం, చేపలు మారెటింగ్ చేయడానికి వ్యాన్లు, ట్రాలీ ఆటోలు, మోపెడ్లు అందజేశామన్నారు. గీత కార్మికుల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందన్నారు. సమైక్య పాలనలో గీత కార్మికులు మరణిస్తే ఆపద్బంధు ద్వారా 50 వేల ఆర్థిక సహాయం మాత్రమే అందేదని, కానీ, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత తాటిచెట్టు పైనుంచి పడి పూర్తిస్థాయి అంగవైకల్యం పొందిన గీత కార్మికులకు, మరణించిన వారికి 5 లక్షల ఎక్స్గ్రేషియా అందించి బాధిత కుటుంబాన్ని ఆదుకుంటుందని వివరించారు.
గీత కార్మికులు ఆర్థికంగా ఇంకా అభివృద్ధి చెందడానికి హైదరాబాద్ నగరం వంటి పెద్ద పట్టణంలో నీరా కేఫ్ను ఏర్పాటు చేసి ప్రోత్సాహం అందిస్తుందని మంత్రి వివరించారు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం బీసీలలో కుల వృత్తుల వారికి ఒక లక్ష ఆర్థిక సాయం అందజేయాలని ప్రణాళిక రూపొందించింది అని వివరించారు. త్వరలో ఈ పథకం కింద లబ్ధిదారులను ఎంపిక చేసి ఆ సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నదని మంత్రి వివరించారు. కాగా అన్ని కుల సంఘాల వారికి, కుల వృత్తుల వారికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సంపూర్ణ సహకారం అందిస్తున్న నేపథ్యంలో అందరూ సీఎం కేసీఆర్ పాలనను ఆశీర్వదించాలని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తనకు అన్ని కులాల వారు అండగా నిలువాలని మంత్రి ఈశ్వర్ కోరారు.